కరీంనగర్, నవంబర్ 28 (కరీంనగర్ ప్రతినిధి) : వ్యవసాయ భూములకు భద్రత కల్పించిన ధరణి పోర్టల్ తీసేస్తే మళ్లీ దగా తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భూముల పరిరక్షణకు ఆధునిక టెక్నాలజీ వాడుతూ.. వివాదాలకు తావులేకుండా భూములకు రక్షణ కల్పిస్తున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ అదే పంథాను అనుసరించారని, ధరణిని తెచ్చి, భూ వివాదాలకు చరమగీతం పాడారని గుర్తు చేస్తున్నారు. నిజాం కాలం నాటి దస్ర్తాలను ఆధునీకరించడంతోపాటు డిజిటలైజ్ చేశారని, భూ వివాదాలకు పరిష్కారం చూపారని చెబుతున్నారు. ధరణిలో ఎప్పటికప్పుడు మాడ్యుల్స్ తెస్తున్నారని, చిన్న చిన్న సమస్యలను కూడా అధిగమించి.. పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నారని చెప్పారు.
క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ.. అందుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్డేట్ చేస్తూ. కబ్జాలకు గురైన ఎన్నోభూములకు విముక్తి కల్పించి.. అసలైన యజమానులకు న్యాయం చేస్తున్నారంటున్నారు. సమస్య ఏదైనా ఉంటే.. కలెక్టర్ పరిశీలించి పరిష్కరించే అధికారాన్ని కల్పించి, క్షేత్రస్థాయి అధికారులు పొరపాట్లు చేయకుండా ధరణి రూపకల్పన చేశారని స్పష్టం చేస్తున్నారు. ఓవైపు రాష్ట్రంలో అమలు అవుతున్న ధరణి పోర్టల్ను… వివిధ రాష్ర్టాలు వచ్చి పరిశీలించి, ఇదే విధానాన్ని వివిధ రాష్ర్టాల్లో అమలుచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రశంసిస్తున్నారు.
కాంగ్రెస్ రోజుకో తీరు చెబుతున్న మాటలపై ఆలోచన చేయాలని, మోసపోవద్దని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరణి రద్దు చేస్తామన్న కాంగ్రెస్పై అన్నదాతలు భగ్గుమంటున్నారు. ఈ విషయంలో వ్యతిరేకత వస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా అదే తీరున ఒకరి వెనుక ఒకరు వ్యాఖ్యలు చేయడం చూస్తే రైతులను దగా చేసే పెద్ద కుట్ర దాగి ఉన్నదని మండిపడుతున్నారు. యాభై ఎనిమిదేండ్ల సమైక్య పాలనలో నలభై రెండేండ్లు కాంగ్రెస్, పదాహారేండ్లు టీడీపీ పాలన చేసినా.. ఏనాడూ తమ బాధలు పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు.
తమను ఆదుకునే దిశగా ఎన్నడు కనీస చర్యలు తీసుకోలేదని, మళ్లీ ఇప్పుడు వచ్చి అరిగోస పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. ధరణి తీసేస్తే మళ్లీ పాత రోజులు వస్తాయని, భూమలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పట్వారీలు, వీఆర్వోలు వస్తారని, లంచగొండులు, పైరవీకారులు రాజ్యమేలుతారని, ఇక పైసలేనిదే ఏ పనికాదని, కొట్లాటలు మొదలవుతాయని భయపడుతున్నారు. అందుకే కాంగ్రెస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వమని, తమను కాపాడుతున్న కేసీఆర్కే ఓటేసి గెలిపించుకుంటామని చెబుతున్నారు.
ధరణి పోర్టల్తో భూముల రిజిస్ట్రేషన్ ఇప్పుడు సులభంగా అవుతున్నది. గతంలో మేం గంగాధరకు వెళ్లి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. అయితే, కొన్న వారు ఒకరోజు ముందుగా వెళ్లి డాక్యూమెంట్ తయారు చేయించి మరుసటిరోజు సాక్షులను వెంట బెట్టుకొని వెళ్తే ఏ సాయంకాలానికో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేది. ఇప్పుడు తహసీల్ కార్యాలయాల్లోనే స్లాట్ బుక్ కాగానే ఇచ్చిన టైంకు వెళ్తే రిజిస్ట్రేషన్ త్వరగా అవుతున్నది. నెలలోగా ఇంటికే పాసు పుస్తకం వస్తున్నది. దీంతో భూములు అమ్మడం, కొనుగోలు చేయడం చాలా సులభమైంది. గా కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు గానీ ధరణి ఎత్తేసి ఇంకేదో తెస్తరట. గట్లయితే రిజిస్ట్రేషన్లకు మళ్లీ తిప్పలు తప్పవు.
– మరిమడ్ల సతీశ్, రైతు,చొప్పదండి
ధరణితో పది నిమిషాల్లోనే భూమి రిజిస్ట్రేషన్ అవుతున్నది. ఎవరిని బతిమిలాడే అవసరం లేకుండానే పట్టా చేతికి ఇస్తున్నరు. ధరణి ఎత్తేస్త్తే పేదలకు కష్టాలు మళ్లీ మొదలైనట్టే. పట్టా కోసం మధ్యవర్తులకు పైసలు ఇవ్వాల్సిన పరిస్థితుల దాపురిస్తయి. పేదల కోసం కేసీఆర్ సారు ధరణి తీసుకొచ్చి మంచిపని చేసిన్రు. కాంగ్రెసోళ్లు ధరణి తీసేస్తామంటున్నరు. ఆ పార్టీ సచ్చేది లేదు.. వచ్చేది లేదుగానీ, పేదల సుఖంగా ఉండడం ఇష్టంలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే కుట్రతో పేదలను ముంచాలని చూస్తున్నది. మేం కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ వెంటే ఉంటం. కాంగ్రెస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మడం లేదు.
-నూనె సంపత్, రైతు, కట్టారాంపూర్ (కరీంనగర్)
తెలంగాణ సరార్ తీసుకొచ్చిన ధరణితో రైతుల భూముల సమస్యలు తీరినయ్. భూ రికార్డులన్నీ శానా భద్రంగా ఉన్నాయి. పాసుబుకులో నుంచి ఎవరైనా భూమి తీసివేసినా మా ఫోన్కు వెంటనే మెసేజ్ వస్తుంది. వెంటనే అధికారుల దగ్గరికి పోయి అడుగచ్చు. ధరణి తీసేస్తే దళారుల రాజ్యం వస్తది. వెనుకటి లెక్క మళ్లీ లంచావతారులు తయారవుతారు. నాడు పట్వారీ వ్యవస్థలో చెప్పులరిగేలా తిరిగినా పని కాకపోయేది. సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసినోడు. గంటలో భూమి రిజిస్ట్రేషన్ అయ్యేలా ధరణి తెచ్చి రైతుల కష్టాలు తీర్చిన్రు. అంతే కాక రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, పంట పెట్టుబడి సాయం రైతుబంధు ఇస్తుండు. కాంగ్రెసోళ్లు రైతులు, కౌలుదారులకు మధ్య విభేదాలు తీసుకువస్తున్రు. ‘ధరణివచ్చాకే భూములకు భద్రత, రైతులకు భరోసా వచ్చింది. ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెస్ను అధికారంలోకి రానివ్వం. వాల్ల కుట్రలు తెలుసుకనుకనే తోటి రైతులను బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని కోరుతాం.
-ఆకుల రవిపటేల్, కొత్తపల్లి (హుజూరాబాద్టౌన్)
కాంగ్రెస్ వాళ్లు ధరణిని తీసేసీ భూమాత తెస్తే మళ్లీ పాత వ్యవస్థ వస్తుంది. భూముల రికార్డులు, వివిధ కాలంలు అందులో పొందుపరిస్తే రైతులకు ఇబ్బందే. తెలంగాణ సర్కారు కొత్తపాస్బుక్లు ఇవ్వడం వల్ల గ్రామాల్లో ఏండ్ల సంది ఉన్న అనేక సమస్యలు తీరినయ్. గతంలో భూముల రిజిస్ట్రేషన్ల కోసం హుజూరాబాద్కు వెళ్లే వాళ్లం. మళ్లీ పాస్బుక్కోసం ఆఫీస్ల చుట్టూ తిరుగాలా? ఇప్పుడు ధరణితో ఏ సమస్యలు లేకుండా ఉన్నం. ఒకసారి పాసుబుక్ వస్తే రంది లేకుండా బతుకుతున్నం. భూమాత పెట్టి కబ్జాకాలం పెడితే ఇక మాభూమి ఉన్నదా? కబ్జాలో పడ్డదా అని చెక్ చేసుకోవాల్సి వచ్చేలా ఉంది. అసలు రేవంత్రెడ్డి రైతుల సౌలతు కోసం కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకే పాత వ్యవస్థ తీసుకువస్తుందని పిస్తంది. ఇది రైతులకు అర్థమైతంది. ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు.
– దూల సురేశ్, రైతు, దుద్దనపల్లి (సైదాపూర్)
ఉమ్మడి రాష్ట్రంలో బావుల్లో నీళ్లు లేక, పెట్టుబడి లేక, ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడి వ్యవసాయ భూములు అమ్ముకున్నరు. వ్యవసాయం చేయలేక చాలామంది వలసలు పోయిన్రు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ వ్యవసాయనికి అధిక ప్రాధాన్యమిచ్చి రైతులను ఆదుకుంటున్నడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదట నష్ట పోయేది రైతులే. వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ సరిపోతుందని, ధరణి రద్దు చేస్తామని చెప్పడం సరికాదు. కేసీఆర్ సార్కే మా మద్దతు.
-చొక్కళ్ల కనుకయ్య రైతు, కొలిమికుంట(చొప్పదండి)
ధరణి గురించి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న కాంగ్రెసోళ్లకు సిగ్గుండాలె. ధరణి పోతే రైతుల బతుకులు మునుపటి లెక్కనే ఉంటది. కేసీఆర్ కట్టపడి మంచిగ చేసిన తెలంగాణను చిందరవందరగా చేసేందుకు కాంగ్రెసోళ్లు కుట్రలు చేస్తున్రు. ప్రతోళ్లు ధరణిని మెచ్చుకుంటుంటే గా.. భట్టి విక్రమార్కకు ఎందుకు నచ్చడం లేదు. మళ్లోమనక ధరణిపై మాట్లాడితే తరిమికొడతం. తెలంగాణ అచ్చినంక మంచిగైన మా బతుకులను ఆగం జేద్దామని చూస్తే ఊర్కొనేది లేదు. కాంగ్రెసోళ్లకు ఓటేస్తే మనగోతిని మనమే తవ్వుకున్నట్లు ఉంటది. ఓట్ల కోసం వచ్చే వాళ్లను ఇంటిదరిదాపులకు రానియ్యం. రైతులకు ఎంతో మేలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కారునే గెలిపించుకుంటం.
-వూరడి ఎల్లారెడ్డి, రైతు(ఇప్పల్నర్సింగాపూర్)
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు కష్టకాలం తప్పదు. వారి మాటలు వింటుంటే రైతులు భయపడే పరిస్థితి ఉంది. గతంలో భూముల గెట్ల దగ్గర రైతుల మధ్య కొట్లాటలు జరిగిన ఘటనలు ఉన్నయి. తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల కరెంటు, పెట్టుబడి సాయం, నీళ్లు పుష్కలంగా ఉండడంతో భూముల రేట్లు బాగా పెరిగాయి. ఇప్పుడు కాంగ్రెసోళ్లు వస్తే భూముల రేట్లు పడి పోతయి. ధరణితో భూములు భద్రంగా ఉన్నాయనే సంతోషంలో రైతులు ఉన్నారు. దీన్ని బట్టి రైతులకు రైతు బంధు, బీమా ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నకారు రైతులు వ్యవసాయం చేసుకోలేక తమ భూములు కౌలుకు ఇచ్చి ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు, అనుభవదారులకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి వారికి రైతుబంధు వచ్చేలా చూస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు భయపడి కౌలుకు భూమి ఇచ్చే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు.
-సత్తు నర్సయ్య, రైతు, కొలిమికుంట (చొప్పదండి)
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటమీద ఉంటరా. భూమాత పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఎందుకు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు 24 గంటల కరెంటు అందిస్తుంది. బావుల దగ్గరకు ఎప్పుడంటే అప్పుడు వెళ్లి కరెంటు మోటర్ పెట్టుకుని వచ్చి ఇతర పనులను కూడా చేసుకుంటున్నం. కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటు సరిపోతుందంటున్నరు. వ్యవసాయం చేసే వాళ్లకు కరెంటు గురించి తెలుస్తుంది. వ్యవసాయంతో పాటు ఇతర పనులు చేసే మాలాంటి వాళ్లకు మూడు గంటల కరెంటు సరిపోదు. ధరణిలో భూయజమాని కాలం మాత్రమే ఉన్నది. భూమాత పెట్టి అందులో కబ్జాకాలం పెడితే మళ్లీ కథ మొదటికీ వస్తుంటి. కబ్జా కాలం ఉంటే గ్రామాల్లో మళ్లాలొల్లులు తప్పవు. రేవంత్రెడ్డి మాటమీద ఉండే రకం కాదు.
– పోలు ప్రవీణ్, రైతు, శివరాంపల్లి (సైదాపూర్)
కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే ధరణిని తీసేసి భూమాత పెడుతారట. రైతులు ప్రశాంతంగా ఉండుడు వాళ్లకు ఇష్టం లేనట్టుంది. ఇప్పుడు ధరణి వల్ల రైతుల సమస్యలన్నీ పరిష్కారమైనయ్. మళ్లా వాటిని సృష్టిస్తారా ఏంది. భూములు కొన్నా, అమ్మినా ఇక్కడ మండల తాసీల్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేయడమేనేది మంచి నిర్ణయం. ఎవరి దగ్గరకు తిరగకుండా పట్టాపాస్బుక్లు ఇంటికే వస్తున్నాయి. ఇగ ధరణి తీసేస్తే మళ్లా మునుపటి సమస్యలు వస్తాయి. భూమాతలో కబ్జాకాలంతో పాటు పలు కాలంలు పెడుతారట. మళ్లీ పట్వారీ వ్యవస్థలో రైతులకు గోస తప్పదు. ఇగ మల్లా పనులన్నీ మాని తాసీల్ కార్యాలయం చుట్టూ తిరిగే రోజులు తెచ్చేలా ఉన్నరు. రైతులు ఇప్పుడు ధరణితో మంచిగా ఉన్నారు. కాంగ్రెస్ను నమ్మితే కష్టాలు తప్పవు.
– ఎల్కపల్లి రవీందర్, రైతు అమ్మనగుర్తి (సైదాపూర్)