‘కాంగ్రెస్ పాలనే దరిద్రం. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్నా చేసిందేమీ లేదు. నాడు అన్నదాతను గోస పెట్టింది. కరెంట్ సక్కగియ్యలె. నీళ్లియ్యలె. కండ్ల ముందే పంటలు ఎండుతున్నా పట్టించుకోలె. ఆఖరుకు రైతు అప్పుల బాధతో సచ్చిపోయినా పట్టించుకోలె. ఇప్పుడు మళ్లీ మాయమాటలు చెబుతూ వస్తున్నది. అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు గానీ, ఝూటా మాటలతో పరేషాన్ చేస్తున్నది. అన్నదాతలపై కుట్రలు చేస్తున్నది.
24 గంటలు మంచిగున్న కరెంట్ను తీసేసి 3 గంటలు ఇస్తదట. అట్లయితే మళ్లీ పాతరోజులే వస్తయి. మా బతుకులు ఆగమైతయి’ అని జిల్లా రైతులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ మోటర్లకు మీటర్లు పెట్టే కుట్రలు చేస్తున్నదని, నమ్మితే రాష్ట్రం అంధకారం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లతో బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఎవుసాన్ని పండుగలా మార్చి, తమ గోస తీర్చిన కేసీఆర్ను మరోసారి గెలిపించుకుంటామని చెబుతున్నారు.
– కరీంనగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ను నమ్మితే పదేండ్ల కిందటి పరిస్థితులు పునరావృతం అవుతాయని జిల్లా రైతులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ వచ్చేదాక ఎసోంటి గోస పడ్డమో.. ఎన్ని కష్టాలు పడ్డమో ఆ భగవతునికే తెలుసని వాపోతున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు గానీ, అన్నదాతలను ముంచే కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు అని చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. 24 గంటల కరెంట్ ఉన్న కాడ ఈ మాయమాటలేందని నిలదీస్తున్నారు. పైగా 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని ఉచిత సలహా ఇవ్వడంపై ఆగ్రహిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని, కేంద్రం మంత్రి నిర్మలా సీతారామన్ మాటలతో కాంగ్రెస్ మోటర్లకు మీటర్ల పెట్టే కుట్ర బట్టబయలైందని మండిపడుతున్నారు.
వాళ్లను నమ్మితే మోటర్లకు మీటర్లు పెడుతరని, 24 గంటల కరెంట్ తీసేసి 3 గంటల ఇస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు వాళ్ల పాలనలో అరిగోస పడ్డామని, కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియక రాత్రిళ్లూ జాగారం చేశామని, కండ్ల ముందే పంటలు ఎండుతుంటే కన్నీళ్లు పెట్టుకున్నామని గుర్తు చేశారు. దొంగ రాత్రి కరెంట్ ఇచ్చి ఎందరో రైతుల ఉసురు పోసుకున్న ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. కరెంట్ విషయంలో ఇటు బీజేపీ కూడా తెలంగాణ రైతులకు అన్యాయం చేసిందని ఆక్షేపిస్తున్నారు. కేసీఆర్ లేకుంటే తమ మోటర్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేసేవారని, కానీ, తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మోటర్లకు మీటర్లు పెట్టనివ్వని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నెల 30న కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ను మరోసారి సీఎంగా చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు నాణ్యమైన కరెంటు ఇస్తంది. మేము ఎప్పుడంటే అప్పుడు బావి దగ్గరకు వెళ్లి కరెంటు పెట్టుకుంటున్నం. గతం లో కరెంటు కోసం పొద్దనకా, రాత్రనకా ఎదురుచూసేది. గత 9 ఏండ్లసంది కరెంటుతో ఎలాంటి ఇబ్బంది లేదు. బాయిల నీరున్నంత సేపు కరెంటు మోటర్ నడుస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు 10 హెచ్పీ మోటర్లను పెట్టుకోమంటున్నరు. 10హెచ్పీ మోటర్లతో ఇబ్బందులు ఉంటాయి. అవికాలిపోతే మాపై ఆర్థికభారం పడుతుంది. కాంగ్రెసోళ్లు ఇప్పుడున్న 24 గంటలు తీసేసి మూడు గంటలు ఇస్తరట. అసోంటి పార్టీ మాకెందుకు?. అది వచ్చేది లేదు. సచ్చేది లేదు.
– మునిపాల శ్రీనివాస్, వెన్కేపల్లి(సైదాపూర్)
సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే రైతును రాజు చేసిన్రు. వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇవ్వడంతో పాటు ఏటా రెండు పంటలకు సమృద్ధిగా నీళ్లు అందిస్తున్నరు. కాళేశ్వరం గోదావరి జలాలతో పంటలకు సాగునీరు రావడంతో ఎలాంటి నీటి ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ పాలన చూసి కాంగ్రెస్, బీజేపీ ఓర్వడం లేదు. మూడు గంటల కరెంటు ఇస్తామన్న కాంగ్రెసు ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవు. ఆ పార్టీ కట్టు కథలు నమ్మడానికి ఇక్కడ ఎవరూ లేరు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలి. అప్పుడే రైతులకెంతో మేలైతది.
– తోట లక్ష్మణ్, రైతు, ఇందుర్తి (చిగురుమామిడి)
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24గంటల కరెంట్ ఇస్తుండడంతో రైతులం ఎవరూ ఇబ్బందులు పడడం లేదు. గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయానికి కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రి, పగలు పొలం దగ్గరనే ఉండేవాళ్లం. సీఎం కేసీఆర్ 24గంటలు ఇవ్వడంతో ఆటోమేటిక్ స్టార్టర్లతో ఇంటి వద్ద ఉండి సెల్ ఫోన్తో మోటర్ను ఆన్ ఆఫ్ చేసేవాళ్లం. నాటి నుంచి రైతులం సంతోషంగా బతుకుతున్నం. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే రోజుకు 3గంటల విద్యుత్ వ్యవసాయానికి ఇస్తామని అంటున్నరు. ఆ పార్టీ నాయకులు, రేవంత్రెడ్డి టీవీల్లో ప్రచారం చేస్తున్నరు. కరెంట్ మూడు గంటలు ఇస్తే రైతులు ఎట్లా వ్యవసాయం చేసుకుంటరు. 10హెచ్పీ మోటర్ల వల్ల రైతులకు నానా ఇబ్బందులు తప్పవు. వ్యవసాయంపై ఏ మాత్రం అవగాహన లేని రేవంత్రెడ్డితో ఆగం కాకుండా ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్కే ఓటేయాలి.
-కందుల పెద్ద సమ్మిరెడ్డి, రైతు, (దమ్మకపేట, హుజూరాబాద్టౌన్)
ఎవుసం మీద కనీసం అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు కరెంట్పై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. 10హెచ్పీ మోటర్ బిగిస్తే బోర్లు ఎండిపోతయి. కాంగ్రెస్ నాయకులకు ఎవుసంలో సాధకబాధకాలు తెల్వదు. 10 హెచ్పీ మోటర్లతో ట్రాన్స్ఫార్మర్పై లోడ్ పడి పేలిపోయే ప్రమాదం ఉంది. సీఎం కేసీఆర్ పుణ్యమా.. అని 24 గంటల కరెంటు వస్తుంది. మూడు గంటల కరెంట్ వ్యవసాయనికి సరిపోతుందా? కాల్వ కూడా సాగది. పొలం ఎలా పారుతుంది. 10హెచ్పీ మోటర్ను ఏ ప్రాంతంలో వాడరు. కాంగ్రెస్కు ఓటు వేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.
– యల్లా మాధవరెడ్డి రైతు, పారువెల్ల (గన్నేరువరం)
రోజంతా అత్తున్న కరెంట్తో రైతులు సుఖంగా ఉంటున్నరు. ఇదీ కాంగ్రెసోళ్లకు ఇట్టం లేనట్టుంది. తెలంగాణ రాకమునుపు ఎవుసానికి కరెంటు కోసం పడిన బాధలు చాలు. మూడు గంటల కరెంటుతో మళ్లా గా కట్టాలు తప్పవ్. మూడు గంటల ఇత్తామంటున్న రేవంత్కు మతిలేనట్లుంది. ఆళ్లకు తలెరుకనా.. తోకెరుకనా?. సోయిలేని మాటలు మాట్లాడుతున్నరు. గిప్పుడు ఎప్పుడంటే గప్పుడే బాయి కాడికి పోయి మోటరు పెట్టుకుంటున్నం. మూడు గంటలు ఇత్తే పాత కథే ఉంటది. రైతులందరూ ఒకేసారి మోటరు పెడితే కాలిపోతయ్. ట్రాన్స్ఫార్మర్లు పేలుతయ్. ఫ్యాన్ల కింద కూకొని మాట్లాడుడు కాదు…ఎవుసం జేత్తే తెలుత్తది.
-యాళ్ల వీరారెడ్డి, రైతు (ఇప్పల్ నర్సింగాపూర్)
20 ఏండ్ల కింద అప్పటి గవర్నమెంట్ రాత్రి పూటనే ఎవుసానికి కరెంటు ఇచ్చేది. ఇక పొలానికి నీళ్లు పెట్టుటానికి అర్ధరాత్రి పొలంకాడికి పొయ్యి నీళ్లు పెట్టెటోళ్లం. పురుగో పుట్రో కాళ్ల కింద ఏముందో తెలవకుంట మొండిగ కరెంటు కాడికి పొయ్యి కరెంటు పెట్టినం. ఎప్పుడు కరెంటు ఉంటదో ఎప్పుడు ఉండదో తెలవక రాత్రంత జాగారం చేసేటోళ్లం. రాత్రంతా కూసుండి కరెంటు పెడితె ఒక్కమడి కూడా పారకపోయేది. తెలంగాణ గవర్నమెంట్ అచ్చినంక గా తిప్పలు తప్పినయి. రాత్రిపూట కరెంటు కాడికి పోవుడు బందైంది. పగటీలే పొయ్యి కరెంటు పెడుతున్న, మళ్ల కేసీఆర్ అత్తెనే మా రైతులం మంచిగుంటం. లేకుంటె మళ్లీ టార్చి లైట్లు కొనుక్కునుడైతది.
– ఏరు నారాయణరెడ్డి, తాడిజెర్రి(గంగాధర)
మాకు వాగు ఒడ్డున ఎకురంన్నర పొలం ఉండె.. వాగుల నుంచి పైప్ లైన్ ఏసినం.. అయితే అండ్ల ఈ నడుమ బైపాస్ రోడ్ల అరెకురం భూమి పోయింది.. ఇంక ఎకురం మిగిలింది.. వరి కోతలైనయ్.. మల్ల నాటుకు దున్నుతన్నం.. వాగుల దార సాగుతది గనుక నీైళ్లెతె ఎప్పటికీ ఉంటయ్.. అయితె మునుపు పదేండ్ల కింది దాంక కరెంట్ లేక అరిగోస పడేది.. షిప్టుల కింద కరెంటు అచ్చేది.. ఓ సారి 4 గంటలు, ఓసారి 2 గంటలు, ఒక్కోసారి 3 గంటలు కరెంటు ఇచ్చేది.. వాగు చుట్టూ తిరిగి పోవడానికే మాకు పొద్దు గడిచిపోయేది.. తెల్లందాక పోయి మోటర్ పెట్టచ్చేది.. కేసీఆర్ పదవిల ఎక్కినంక కరెంటు మంచిగ ఉంటంది.. షాటేజ్ ఏంలేదు..సౌలతిగుంది.. పొద్దుందాంకనే పొలం పారిచ్చుకుంటన్నం.. ఇప్పటిదాంక లోటు లేకుంట ఇచ్చి కాంగ్రెస్ వస్తె 3 గంటలు ఇస్తమంటె రైతులు ఎట్ల ఒప్పుకొంటరు.. రైతులు మల్ల రాత్రింబవళ్లు బాయిల పొన్ననే తిరుక్కుంట ఉండాల్నా..
– ఆకుల సదానందం, రైతు, కేశవపట్నం(శంకరపట్నం)
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణల ఎవుసానికి 24 గంటల కరెంటు ఇస్తుండడంతోటి రైతులకు మేలు జరుగుతున్నది. కాళేశ్వరం జలాలతో భూగర్భజలం పెరిగింది. గతంలో బాయిలు, బోర్ల కింద నీళ్లు లేక పడావుండేటివి. ఇప్పుడు ఆ భూములన్నీ సాగులోకి వచ్చి రెండు పంటలు సాగు చేసే పరిస్థితి ఉన్నది. మంచి దిగుబడి వచ్చి లాభపడుతున్నరు. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడున్న కరెంటు సిస్టంను మారిస్తే రైతులకు మునుపటి గతి పడుతది. పంటలను కాపాడుకునేందుకు బాయిలు, బోర్ల దగ్గరే ఉండాల్సి వస్తది. ఒకసారి మూడు గంటలు అంటరు.. ఓసారి ఐదు గంటలంటరు.. ఇంకోసారి 10హెచ్పీ మోటర్లు పెడితే పారుతదంటరు. గిప్పుడే గిన్ని తీర్ల మాట్లాడుకుంట ఇన్ని ఏషాలేత్తన్రు.. వీళ్లని నమ్మితే మున్ముందు ఇంకెన్నిజేత్తరో?. అందుకే ఆళ్లను నమ్మేది లేదు. 10హెచ్పీ మోటర్లు పెట్టుకోవడమంటే రైతులను అప్పుల పాలు చేసే కుట్ర చేస్తున్నరు. గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ కూడా 10హెచ్పీ మోటర్లకు సరఫరా చేసే విధంగా లేదు. సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ నాయకులు పల్లెల్లో రైతులను ఆగం చేసే ఆలోచన చేస్తున్నరు. ప్రతి రైతు ఆలోచించాలి.
– గుంటి రాజమల్లు, (ముకరంపుర)
రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్తో పొలం పారుతదని అంటుండు. అదీ పొద్దున ఇస్తరో, రాత్రి ఇస్తరో చెప్పరు. 3 గంటల కరెంట్ ఇస్తే ఒకేసారి రైతులు మోటర్లు స్టార్ట్ చేస్తే కాలిపోవుడు ఖాయం. కేసీఆర్ సీఎం అయ్యాక రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇస్తున్నడు. 24 గంటల కరెంట్తో ఎప్పుడు అవసరమైతే అప్పుడు మోటర్ పెట్టుకొని నీళ్లు పారిస్తున్నం. నాకు 8 ఎకరాల పొలం ఉన్నది. ఈ పొలానికి 3 గంటల కరెంట్ ఎలా సరిపోతది. మూడు గంటల కరెంట్ ఇచ్చి, 10 హెచ్పీ మోటర్లను పెట్టుకుంటే మొదటికే మోసం తప్పదు. గా కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే నట్టేట మునుగుడు ఖాయం. ఆ పార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. ఆళ్లను నమ్మేది లేదు.
-కంది దిలీప్రెడ్డి, రైతు, వంతడుపుల(ఇల్లందకుంట)
నాకున్న ఐదెకరాలు పారియాలంటే ఒక్క బావికి రెండు ఐదు హెచ్పీ మోటర్లు పెట్టినా పొలం పారేది కాదు. లోవోల్టేజీతో మోటర్లు కాలుడు, ఫీజు కొట్టేయడంతో చాలా ఇబ్బందయ్యేది. రాత్రి పూట పొలం కాడికి టార్చిలైట్లు పట్టుకొని పోయేవాళ్లం. పత్తి, మక్క చేన్లకు నీళ్లు కడుతుంటే గుడ్డెల్గులు వచ్చేవి. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని రాత్రి పూట నీళ్లు కట్టేవాళ్లం. పది నిమిషాలకోసారి కరంటు పోయి వచ్చేది. కాలువ సాగకముందే పోయేది. ఒకరు కరంటు డబ్బకాడ ఉండి మోటర్ ఆన్ చేస్తే ఒకలం నీళ్లు కట్టేది. మా మండలానికంత ఒక్క సబ్స్టేషనే ఉండేది. ఇప్పుడైతే మూడు గ్రామాలకో సబ్స్టేషన్ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి మంచిగా ఉంది. పొద్దంతా పోయి కరెంటు పెడుతున్న. కాంగ్రెస్ పార్టీ వాళ్లు మూడు గంటల కరంటు అనడం రైతులకు మళ్లీ నరకం చూపించడానికే. వాళ్లు మళ్లచ్చుడు ఎందుకు? మేం ఆగమవుడెందుకు?. ఎట్టి పరిస్థితిలో వాళ్లరు రానిచ్చేదే లేదు.
-మిడిదొడ్డి పోచయ్య, రైతు, మాందాడిపల్లి(హుజూరాబాద్రూరల్)
మాకు ఐదెకరాల భూమి ఉంది. నేను ఒక ఎకరం పత్తి, ఎక ఎకరం పలు రకాల కూరగాయలు, మూడెకరాలు వరేసిన. ఇన్ని రోజులు 24 గంటల కరెంటుతో పంటలు మంచిగ పండించుకుంటున్న. ఇప్పడు గా కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటిస్తే పంటలు పండిచ్చుడు సాధ్యమైతదని అంటున్రు. నాకున్న భూమిల తీరొక్క పంటలు పండిస్త. ఒకోపంటకు ఒకోసారి నీళ్లు పారిస్త. కరెంటు పొద్దున ఇస్తరో.. రాత్రి ఇస్తరో కాంగ్రెసోళ్లు చెప్పరు. మూడుగంటల కరెంటిస్తే రైతులు ఒకేసారి మోటర్లు స్టార్ట్ చేస్తే ఎక్కడికక్కడ కాలిపోతయ్. వాటిని బాగు చేయడానికి సమయం, డబ్బువృథా అయితయ్. అంతలోపు పంటలు ఎండిపోతయ్. తెలంగాణ రాక ముందు అప్పటి పాలకులు రాత్రి కరెంటు ఇస్తురు.. పొలాల దగ్గరే చెద్దరి వేసుకుని పాముల మధ్యన వ్యవసాయం చేస్తుంటిమి.
ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ ఇస్తున్న 24 గంటల కరెంట్తో ఎప్పుడు అవసరమైతే అప్పుడు మోటర్లను ఆన్ చేసి నీళ్లు పారిస్తున్నం. పంటలు మంచిగ పండుతున్నయ్. నేను 20 ఏండ్ల నుంచి ఎవుసం చేస్తున్న. కానీ, ఈ పదేండ్లళ్ల కరెంట్ కష్టాలను చూడలే. మూడు గంటల కరెంటిచ్చి 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే మొదటికే మోసం వస్తది. 10 హెచ్పీ మోటర్ పెట్టుకోడానికి ఖర్చు తడిసి మోపెడైతది. ఆ ఖర్చు ఎవరు భరిస్తరు? ఆ మోటర్లు బిగిస్తే బోర్లు ఎత్తిపోతయ్.. అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెసోళ్లు అప్పుడు ఏంచేసిన్రు. ఇప్పుడు మల్ల రైతులను ముంచడానకి వస్తున్నరు. ఆ పార్టీ వచ్చేది లేదు సచ్చేది లేదు.. కేసీఆర్ సారు వచ్చినంకనే రైతులు మంచిగ బతుకుతున్రు. మళ్లీ కేసీఆర్ సారే రావాలి.
– తాడెం మల్లేశం, గుడ్డెలుగులపల్లి, రామడుగు మండలం (చొప్పదండి)