కరీంనగర్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): భారత గణతంత్ర దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో గణతంత్ర దినోత్సవ నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేడుకల కోసం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేదికను అలంకరించి సిద్ధం చేయించాలని పోలీస్, రెవెన్యూ అధికారులకు చెప్పారు. వేడుకల సందర్భంగా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులకు, ప్రజలకు సీటింగ్ అరెంజ్మెంట్లు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి, అర్బన్ తహసీల్దార్ను ఆదేశించారు. వేడుకలకు వచ్చే ప్రజలు, విద్యార్థులకు తాగునీరు సమకూర్చాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కరోనా దృష్ట్యా పరేడ్ గ్రౌండ్లో ప్రతి ఒకరికీ థర్మల్ స్రీనింగ్ చేయాలని, చేతులను శానిటైజ్ చేసుకునేందుకు శానిటైజర్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. మైక్ సెట్ ఏర్పాటు చేయాలని ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజినీర్ను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు వీలుగా, వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో కూడిన ప్రగతి సందేశాన్ని తయారు చేయాలని జిల్లా పౌర సంబంధాల అధికారిని ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించనున్నామని, అర్హులను ఎంపిక చేసి ఈ నెల 20లోగా ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు.
కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలి
జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కోర్టు కేసులు, మానవ హక్కుల కమిషన్, లోకా యుక్త కేసులకు సంబంధించి వెంటనే కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కోర్టు ఉత్తర్వులను అధికారులు విధిగా అమలుపర్చాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి అన్ని కార్యాలయాల్లో ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. కోర్టు కేసులకు సంబంధించి కలెక్టరేట్లో ప్రత్యేక లీగల్ సెల్ను ఏర్పాటు చేశామని, ఏమైనా సందేహాలుంటే సంప్రదించాలని సూచించారు. కోర్టు కేసులకు సంబంధించిన కౌంటర్ ఫైల్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలన్నారు. ముఖ్యంగా కాంటెంప్ట్ కేసులపై ప్రత్యేక శ్రద్ధతో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, ముఖ్య ప్రణాళికా అధికారి కొమురయ్య, డీఆర్డీవో శ్రీలత, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీపీవో వీర బుచ్చయ్య, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు నతానియల్, జిల్లా విద్యాధికారి జనార్దన్రావు, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాజు, జిల్లా మారెంటింగ్ అధికారి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.