కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ బైండోవర్ కేసులపై ఆ పార్టీలో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దాదాపు 24 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి పార్టీ టికెట్ కేటాయించి పరువు తీయవద్దని పలువురు కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి మరోసారి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ నేర చరిత్రను ఇప్పటికే ఆ పార్టీ నాయకులు ఆధారాలతో సహా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. పార్టీలో ముందు నుంచీ పని చేస్తున్న ఆ పార్టీ శ్రేణులు ఆయన రాకను వ్యతిరేకిస్తుండగా.. తాజాగా, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ఎదుట పోలీసులు పురమల్లను బైండోవర్ చేయడం మరోసారి కాంగ్రెస్లో చర్చకు దారి తీసింది.
– కరీంనగర్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఇప్పటికే కాంగ్రెస్ను వీడిన ఎంతో మంది నాయకులు బాహాటంగా విమర్శిస్తుండగా.. కరీంనగర్ టికెట్ విషయంలో జరుగుతున్న తతంగంపై ఆ పార్టీలోని నాయకులే ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ ఇప్పటికే పలు కేసుల్లో బైండోవర్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై బాహాటంగా మాట్లాడేందుకు ఇప్పటికే కొంత మంది కాంగ్రెస్ నాయకులు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. నిజానికి అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని, ఎన్నికల నేరాలకు పాల్పడిన వారిని పోలీసులు తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేసే విషయం అందరికీ తెలిసినప్పటికీ.. ఆ విషయాన్ని పక్కన పెట్టి పురమల్లకు ఒకవేళ టికెట్ కేటాయిస్తే.. ఆ ప్రభావం ఉమ్మడి జిల్లాపై పడుతుందన్న ఆందోళన పార్టీలోని శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
సుదీర్ఘకాలం బొమ్మకల్ సర్పంచ్గా ఉన్న పురమల్ల శ్రీనివాస్పై అనేక భూ కబ్జాల కేసులు నమోదై ఉన్న విషయం తెలిసిందే. బెదిరింపులకు పాల్పడడం, భూముల రికార్డులు మార్చడం, అనేక భూములు తన పేరిట, తన అనుచరుల పేరిట రాయించుకోవడం, ఒకే స్థలాన్ని నలుగురైదురికి అమ్మడం వంటి వాటిలో ఆయనపై దాదాపు 24కు పైగా కేసులు నమోదు కాగా, వాటిలో ఆయన నిందితుడిగా ఉన్నారు. పదుల సంఖ్యలో ఉన్న ఇతని బాధితులు పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టారు. కోర్టుల్లో కేసులు వేశారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి పురమల్ల అజ్ఞాతంలోకి వెళ్లిన అనేక సందర్భాలు ఉన్నాయని ఆ పార్టీ వాళ్లే చర్చించుకుంటున్నారు.
మేజ ర్ గ్రామం బొమ్మకల్కు సర్పంచ్గా ఉన్న పురమల్ల శ్రీనివాస్ ఇటీవల కాంగ్రెస్లో చేరి కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఆ పార్టీ నాయకులంతా అవాక్కయ్యారు. అంతే కాకుండా టికెట్ తనకే కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ కరీంనగర్ టికెట్ విషయంలో ఆ పార్టీ ఇంకా ఎటూ తేల్చుకోలేక పోతున్నది. పురమల్లపై ఉన్న కేసుల వివరాలు, ఆయన చేస్తున్న అక్రమాలను కాంగ్రెస్ అధిష్టానాకి ఇప్పటికే ఆయన బాధితులు సహా కాంగ్రెస్ నాయకులు కూడా ఫిర్యాదు చేశారు.
అనేక కేసుల్లో ఆధారాలు కూడా అందించినట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న రోజునే.. చాలా మంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించా రు. అధిష్టానానికి ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. గతంలో ఈయన బాధితులు అనేక సార్లు కరీంనగర్ కలెక్టరేట్లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేశారు. ఈ ఆధారాలను కూడా కొందరు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
పురమల్ల శ్రీనివాస్పై ఉన్న పలు కేసుల నేపథ్యంలో రౌడీ షీట్ ఓపెన్ చేసేందుకు, ఆయనపై పీడీ యాక్ట్ కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోను సైతం కాంగ్రెస్ పార్టీలోని కొందరు వ్యక్తులు వైరల్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు, సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా.. మళ్లీ మళ్లీ అదే రిపిట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. నేర చరిత్రలో కూరుకుపోయిన పురమల్ల శ్రీనివాస్పై పోలీసులు తాజాగా, గురువారం కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. నిజానికి అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని, ఎన్నికల నేరాలకు పాల్పడిన వారిని పోలీసులు తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేస్తారు.
ఈ పరిస్థితుల్లో శ్రీనివాస్ బైండోవర్ విషయం ప్రస్తుతం కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. సదరు వ్యక్తి కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందంటూ ఇప్పటికే ప్రచారం చేసుకోవడం, అధిష్టానం కూడా కరీంగనర్ నియోజకవర్గం సీటును తేల్చకుండా నాన్చడం వంటి పలు అంశాలు ఆ పార్టీ వర్గాల్లో పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తికి పార్టీ టికెట్ కేటాయిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. పార్టీ కోసం ముందు నుంచీ అహర్నిషలు కష్ట పడి పనిచేసిన నాయకులను కాదని, ఇటీవల చేరిన, పైగా నేర చరిత్ర ఉన్న పురమల్ల శ్రీనివాస్కు అధిష్టానం టికెట్ కేటాయిస్తే పరిస్థితి ఏమిటనే గందరగోళ పరిస్థితిలో ఆ పార్టీ నాయకులు పడ్డారు.
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ పురమల్లకు కేటాయిస్తే ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో పడిపోతామని ఆ పార్టీలో కొందరు నాయకులు బాహాటంగానే వాదిస్తున్నట్లు తెలుస్తోంది. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేసే విషయం తెలిసినా.. ఒక జాతీయ పార్టీ అలాంటి వ్యక్తులకు అవకాశం కల్పిస్తే ఆ ప్రభావం ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై పడుతుందన్న ఆందోళన ఆపార్టీలో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో వాస్తవాలను లోతుగా పరిశీలించి కేసులు నమోదైన వ్యక్తికి టికెట్ కేటాయించి పార్టీ పరువు తీయవద్దని పేర్కొంటూ తాజాగా మరోసారి వారు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని సమాచారం. పార్టీ శ్రేణుల విజప్తిని కాదని టికెట్ కేటాయిస్తే.. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు చాలా మంది సిద్ధం అవుతున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.