జగిత్యాల కలెక్టరేట్, జూన్ 1 : పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి గుర్తు చేశారు. కానీ, మూడేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, పల్లెల్లో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు రాని దుస్థితి ఉన్నదని విమర్శించారు. రాయికల్ మండలం రామాజిపేటకు చెందిన ఎనుగంటి రాములు తన తల్లితండ్రుల జ్ఞాపకార్థం సమకూర్చిన బాడీ ఫ్రీజర్ను సోమవారం ఆయన గ్రామ పంచాయతీకి అందజేశారు.
ఈ సందర్భంగా ఎనుగంటి రాములును అభినందించారు. అనంతరం జీవన్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పదవులను త్యాగం చేసిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. ఆయన పదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని, గ్రామాలను అభివృద్ధి బాట పట్టించారని చెప్పారు. కానీ, కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత ఉందని, దీంతో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లపై అభివృద్ధి పనుల బాధ్యత పెట్టే అవకాశం లేదని చెప్పారు. గ్రామాల్లో మన ఊరు-మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన పెద్ద బిల్లులు మాత్రమే వస్తున్నాయని, రూ.10లక్షలలోపు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు గోపి రాజిరెడ్డి, మల్లేశ్ యాదవ్, రవి, హరీశ్రావు పాల్గొన్నారు.