వర్షాభావ పరిస్థితుల్లో చుక్కనీరు లేక అడుగంటిన చెరువులకు, కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా జీవం పోసింది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా 122 కిలోమీటర్ల మేర వరద కాలువ నిండుగా మారగా, తూముల ద్వారా పరవళ్లు తొక్కి, సాగు నీటి ఆశలను సజీవం చేస్తున్నది. ఇప్పటికే మెజార్టీ గొలుసుకట్టు జలవనరులు నిండి అలుగుపారుతూ మరో చెరువువైపు పరుగులు తీస్తుండగా, కర్షకలోకం మురిసిపోతున్నది.
– రామగుడు/ గంగాధర, జూలై 10
కథలాపూర్/ కోరుట్ల రూరల్/ బోయినపల్లి, జూలై 10 : కాళేశ్వరం జలాలు నలుదిక్కులా పరుగులు పెడుతున్నాయి. కొద్దిరోజులుగా ప్రాజెక్టులోని లింక్-1,2లో నిరంతర ఎత్తిపోతలతో వివిధ ప్రాజెక్టులను దాటుకుంటూ పైకి ఎగిసిపడుతున్నాయి. వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ వైపు పరుగులు పెడుతూనే, మరోవైపు తూముల ద్వారా చెరువుల్లోకి చేరుతున్నాయి. వరుణుడు కరుణించకపోయినా, చినుకు రాలకపోయినా పరవళ్లు తొక్కుతూ ఇన్నాళ్లూ వట్టిపోయిన తటాకాలకు జీవం పోస్తున్నాయి.
తరలివస్తున్న జలాలు
కథలాపూర్ మండలం దూలూర్లోని నాలమల్లప్పకుంట చెరువు కళకళలాడుతున్నది. కాళేశ్వ రం జలాలు తరలిరావడంతో రైతులకు పంటల సాగు భరోసా కలిగింది. నాగమల్లప్పకుంట చెరు వు మత్తడి దూకుతూ సిరికొండలోని నల్లచెరువులోకి జలాలు తరలుతుండగా, రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మరో రెండు రోజు ల్లో నల్లచెరువు నిండనుంది. ఇదే మండలంలోని పెగ్గెర్లలోని ఉర చెరువులోకి తూముల ద్వారా కాళేశ్వరం జలాలు చేరుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో మత్తడి దూకే అవకాశాలున్నాయి. అలాగే తక్కళ్లపెల్లిలోని వరదకాలువ తూము ద్వారా ఉదకమ్మ చెరువు నిండుతోంది. వర్షాలు ఆలస్యం అయినప్పటికి సీఎం కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం జలాలు వరదకాలువ ద్వారా విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కోరుట్ల పట్టణంలో విలీనమైన ఎకీన్పూర్ శివారులోని స్తంభాల చెరువుకు సోమవారం కాళేశ్వరం జలాలు చేరగా, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు, మాజీ వైస్ ఎంపీపీ కాసిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు లు ప్రత్యేక పూజలు చేశారు. జలాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావులకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
కొనసాగుతున్న ఎత్తిపోతలు
పెద్దపల్లి, జూలై 10 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వర గంగ ఉప్పొంగుతున్నది. ప్రాణహిత నుంచి 18,954 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, లింక్-1, లింక్-2లో 22 మోటర్లతో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్లో 7 మోటర్ల ద్వారా 15,400 క్యూ సెకుల నీటిని అదే జిల్లా అన్నారంలోని సరస్వతీ బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడికి చేరిన నీటిని పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతీ పంపు హౌస్లోని 5 మోటర్లను 14,650క్యూసెకులను మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్లోకి తరలిస్తున్నారు. ఇక అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతీ పంపు హౌస్లోని 6 మోటర్లను నడిపిస్తూ 15, 660 క్యూసెకులను ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు. ఇక లింక్-2లో ఎల్లంపల్లికి చేరిన జలాలు టన్నెల్ ద్వారా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంపు హౌస్కు వెళుతుండగా, అక్కడ రెండు బాహుబళి మోటర్లను నడిపి స్తూ 6300 క్యూసెకులను కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్ హౌస్కు తరలిస్తున్నారు. అకడా రెండు మోటర్లను ఆన్ చేసి 6300 క్యూసెకులను వరద కాలు వ ద్వారా ఓ వైపు ఎస్సారార్ రిజర్వాయర్కు తరలిస్తూనే, మరోవైపు పునర్జీవపథకంలో భాగంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు.
ఎస్సారెస్పీలోకి పరుగులు
గాయత్రీ పంప్హౌస్ నుంచి తరలివస్తున్న జలాలు ఎస్సారెస్పీ వైపు పరుగులు తీస్తున్నాయి. 122 కిలోమీటర్ల మేర ఉన్న వరద కాలువలో రాంపూర్ పంప్హౌస్లో నాలుగు మోటర్ల ద్వారా మొత్తం 5800 క్యూసెక్కుల జలాలు మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట వద్ద నిర్మించిన పం పుహౌస్కు చేరుతుండగా, ఇక్కడ మూడు మోటర్ల ద్వారా 4,350 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నా రు. వరద కాలువలో ఎదురెక్కుతూ నిజామా బాద్ జిల్లాలోని ముప్కాల్ పంపుహౌస్ మీదుగా ఎస్సారెస్పీకి ఉరకలేస్తున్నాయి.