దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయి. పట్టణాలతో సమానంగా గ్రామాల్లో మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. అందుకే దేశంలోనే నంబర్ వన్ స్థాయిలో తెలంగాణ పల్లెలు జాతీయ అవార్డులు అందుకున్నాయి. నుస్తులాపూర్కు సైతం రెండు సార్లు జాతీయ అవార్డు వచ్చింది. రానున్న రోజుల్లో జిల్లాకు ఈ గ్రామం ముఖద్వారం కానున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తుంటే ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నుస్తులాపూర్ కోసం ఒక్క రూపాయైనా తెచ్చారా?, ఎప్పుడైనా వచ్చారా?, కనీసం ఏం కావాలని అని అడిగారా..? పనులు చేసిన వారు చెప్పుకోరు, చేయనివారే అబద్ధాలు ప్రచారం చేస్తారు.
– నుస్తులాపూర్ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
తిమ్మాపూర్ రూరల్, జనవరి 22 : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారతున్నాయని, నుస్తులాపూర్ గ్రామానికి అన్ని వసతులూ సమకూరాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని నుస్తులాపూర్ గ్రామ నూతన పంచాయతీ భవనాన్ని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మెన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి ప్రారంభించారు. కార్పొరేట్ స్థాయిలో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించారని సర్పంచి రావుల రమేశ్ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పల్లెలను దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చిందన్నారు. ప్రస్తుతం మన పల్లెల మాదిరిగా దేశంలో ఎక్కడా లేవన్నారు.
అభివృద్ధిలో నుస్తులాపూర్ ఆదర్శం : ఎమ్మెల్యే రసమయి
గ్రామం, ప్రజలు గురించే ఆలోచించే రావుల రమేశ్ వంటి వ్యక్తి సర్పంచి అయితే గ్రామాలు ను స్తులాపూర్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని, ఈ గ్రామం అన్నింటికీ ఆదర్శంగా ఉందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. అభివృద్ధి చేయాలన్న సంకల్ప ఉంటే గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో నుస్తులాపూర్ను చూస్తే అర్థం అవుతుందన్నారు. గ్రామాల్లో పెరుగుతున్న మౌలిక వసతులతోనే భూముల రేట్లు కోట్లు దాటుతున్నాయని తెలిపారు. నాలుగు పైసలు తీసుకురాని ఎంపీ బండి సంజయ్ యువతను రెచ్చగొడుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోయినా ప్రజల కోసం ఆలోచించే వినోద్కుమార్ వంటి నాయకులను మరవద్దని కోరారు. మంజూరైన నిధులతోపాటు సొంత ఖర్చులు వెచ్చించి పంచాయతీ భవనాన్ని పూర్తి చేసిన సర్పంచిని అభినందించారు. రూ.పది లక్షలను తన నిధుల నుంచి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తాం : సుడా చైర్మన్ జీవీఆర్
రాజీవ్ రహదారిపై సెంట్రల్ లైటింగ్ను నుస్తులాపూర్ వరకు, నల్లగొండ వైపు కూడా ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు హామీ ఇచ్చారు. సుడా నుంచి గ్రామాలు ఎంత అభివృద్ధి అయితే తనకు అంత సంతోషమన్నారు. అలాగే, పలువురికి రమేశ్ కానుక కింద డిపాజిట్ చేసిన రూ.5116 బాండ్లను, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అంతకు ముందు అతిథులకు మహిళలు బొట్టుపెట్టి, పూలవర్షం కురిపిస్తూ, డప్పుచప్పుళ్ల నడుమ ర్యాలీగా స్వాగతం పలికారు. కళాకారులు ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి మాదాడి రమేశ్రెడ్డి, ఎంపీపీ కేతిరెడ్డి వనిత, వైస్ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, ఇనుకొండ జితేందర్రెడ్డి, ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి, నాయకులు గుజ్జుల రవీందర్రెడ్డి, దన్నమనేని నర్సింగరావు, తాజొద్దీన్, బేతి శ్రీనివాస్రెడ్డి, పాశం అశోక్రెడ్డి, ఎలుక అంజనేయులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఎంపీ.. ఒక్కరూపాయైనా తెచ్చారా..?
అభివృద్ధి కోసం ఆలోచించే వారిని, ఆలోచించని వారిని ఒకేతీరుగ చూస్తే ఎలా? అని, ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నుస్తులాపూర్ కోసం ఒక్క రూపాయైనా తెచ్చారా?, ఎప్పుడైనా వచ్చారా?, కనీసం ఏం కావాలని అని అడిగారా..? అని వినోద్కుమార్ ప్రశ్నించారు. పనులు చేసిన వారు చెప్పుకోరని, చేయనివారే అబద్ధాలు ప్రచారం చేస్తారని మండిపడ్డారు. ఏమైనా అంటే అప్పుల తెలంగాణ అని విమర్శిస్తున్నారని, అప్పుచేసి అభివృద్ధి చేస్తే తప్పా? అని నిలదీశారు. అప్పు చేసి ఎక్కడో ఉన్న నీటిని ఇక్కడికి తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ది అని స్పష్టం చేశారు. ఇప్పుడు యావత్ తెలంగాణలో పండిన పంటలు ఏ రాష్ట్రంలోనూ పండడం లేదని చెప్పారు.
టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యాక దేశంలోని ఇతర రాష్ర్టాల మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, బడా నేతలు పార్టీలో చేరేందుకు పోటీ పడుతున్నారని చెప్పారు. ఇక నుంచి ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విమర్శిస్తే.. ఇక్కడి నేతలు వారిని తీసుకెళ్లి వారి పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో పర్యటించి తీసుకురావాలని సూచించారు. ఇక నుంచి విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. దళిత బంధుతో దళితుల జీవితాల్లో ఎంతగానో మార్పు వచ్చిందన్నారు. బీజేపీ ఎంపీలు, మంత్రులే తెలంగాణ భేష్ అని అంటున్నారని స్పష్టం చేశారు.