రాంనగర్, డిసెంబర్ 3 : పోలీస్ అభ్యర్థులూ.. మీరు రెడీనా! ఖాకీ యూనిఫాం వేసుకోవాలన్న కలను సాకారం చేసుకునే సమయం దగ్గర పడుతున్నది! ఈ నెల 8వ తేదీ నుంచే ఈవెంట్ల ప్రక్రియ మొదలు కాబోతున్నది. మొదటిసారిగా ఒక అంశంలో క్వాలీఫై అయితేనే మరో దానికి అవకాశం దక్కనున్నది. పరుగు పందెంలో అర్హత సాధిస్తేనే మిగతా అంశాలకు వెళ్లే చాన్స్ ఉన్నది. ఇందులో గట్టెక్కకపోతే మిగతా పోటీలకు వెళ్లకుండానే వెనుదిరగాల్సి ఉంటుంది. సమయం మరో ఐదు రోజులే ఉన్నది. మరింత దృష్టిపెడితేనే కొలువును దక్కించుకునే అవకాశమున్నది. ఈ నేథప్యంలో శారీరక సామర్థ్య పరీక్షలకు పోలీస్ రిక్రూట్మెంట్కు కరీంనగర్ కమిషనరేట్ యంత్రాంగం సిద్ధమైంది.
ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా చీఫ్ సూపరింటెండెంట్, కమిషనర్ ఆఫ్ పోలీస్ వీ సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈవెంట్స్కు అర్హత సాధించిన ఉమ్మడి కరీంనగర్తోపాటు మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల 21,966 మంది అభ్యర్థులకు నగర శివారులోని డీర్ పార్ సమీపంలోని కమిషనరేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (సీపీటీసీ)లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) సూచనల మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ నెల 8వ తేదీ నుంచి 31 తేదీ వరకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
17,473 పురుష అభ్యర్థులు, 4,493 మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారని అన్నారు. రిక్రూట్ మెంట్ ప్రక్రియలో భాగంగా పీఎంటీ (ప్రీ మెడికల్ టెస్ట్), పీఈటీ (ఫిజికల్ ఎఫీసీయెన్సీ టెస్ట్) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కేటాయించబడిన తేదీలను, సమయాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రక్రియను వేగంగా కచ్చితత్వంతో పూర్తి చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నామని చెప్పారు.
ఆర్ఎఫ్ఐడీ రిస్ట్ బ్యాండ్స్, బిబ్ జాకెట్లను ఉపయోగించి పరుగు పరీక్షను పర్యవేక్షిస్తామని చెప్పారు. పీఎంటీ, పీఈటీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ముందుగా ధువపత్రాల పరిశీలన, రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్, రిస్ట్ బ్యాండ్ ట్యాగింగ్, ఆర్ఎఫ్(రెడీయో ఫ్రీక్వెన్సీ)ఐడీ బిబ్ జాకెట్ ధరింపచేసిన అనంతరం పరుగు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అందులో అర్హత సాధించిన వారికి ఎత్తు కొలతలు తీసుకుంటామని, నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఎత్తు కలిగిన ఉన్న వారిని లాంగ్ జంప్, షాట్ పుట్ విభాగాల్లో పరీక్షిస్తామని చెప్పారు.