HomeKarimnagarThe Theft Took Place In Famous Temples Of Jammikunta
ఆలయాల్లో చోరీ
హుజూరాబాద్, జమ్మికుంటలోని ప్రముఖ ఆలయాల్లో చోరీ జరిగింది. హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని కేసీ క్యాంపులో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వెంకటాద్రినగర్ శ్రీపద్మావతీ, గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయాల గేటు తాళాలు పగలగొట్టి గుడిలో చొరబడి నగలు చోరీ చేశారు.
కేసీ క్యాంపు వేంకటేశ్వరస్వామి దేవాలయంలో..
జమ్మికుంట ‘వెంకన్న’ గుడిలో దొంగతనం
సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ, క్లూస్ టీంతో విచారణ
హుజూరాబాద్టౌన్/జమ్మికుంట, జూన్ 27: హుజూరాబాద్, జమ్మికుంటలోని ప్రముఖ ఆలయాల్లో చోరీ జరిగింది. హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని కేసీ క్యాంపులో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వెంకటాద్రినగర్ శ్రీపద్మావతీ, గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయాల గేటు తాళాలు పగలగొట్టి గుడిలో చొరబడి నగలు చోరీ చేశారు. పోలీసులు, ఆలయ పూజారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుజూరాబాద్ వెంకన్న ఆలయంలో ఎప్పటిలాగే ఆలయానికి తాళం వేసి ఉండగా అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు ఆలయంలో చొరబడి దేవుడి మెడలోని, అమ్మవారి మెడలోని నాలుగు తులాల బంగారు ఆభరణాలు, పుస్తెలు, బంగారు గొలుసులు ఎత్తుకెళ్లారు.
ఉదయం వచ్చి చూసిన ఆలయ పూజారి నందకిషోరాచార్యులు దొంగతనం జరిగింది గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలాన్ని ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి, టౌన్ సీఐ బొల్లం రమేశ్, ఎస్ఐ జీ రాజన్న పరిశీలించారు. కరీంనగర్లోని క్లూస్ టీమ్కు సమాచారం ఇచ్చారు. అలాగే చోరీకి పాల్పడిన దొంగలు పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ఆలయం వద్ద ఉన్న సిసి పుటేజీ హార్డ్ డిస్ను సైతం వెంట తీసుకెళ్లారు. ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ ఆలయాన్ని సందర్శించి వేలిముద్రలను సేకరించారు. పూజారి నందకిషోరాచార్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి తెలిపారు.
జమ్మికుంటలో..
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వెంకటాద్రినగర్ శ్రీపద్మావతీ, గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయం ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టిన దొంగలు, గర్భగుడిలోని అమ్మవారికి సంబంధించిన రూ.5లక్షలకు పైగా విలువజేసే 8సెట్ల బంగారు మంగళ సూత్రాలు అపహరించారు. రాత్రి ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, హరికృష్ణమాచార్యులు ఆలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. గుడిలో పనిచేసే కుటుంబ సభ్యులు సమీపంలోని ఇంట్లో పడుకున్నారు. ఇదే సమయంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు ఆలయ తాళాలు పగులగొట్టారు.
గర్భగుడిలో ఉన్న మూల విరాట్ విగ్రహాలు, ఉత్సవ మూర్తులైన అమ్మవారికి సంబంధించిన 8 సెట్లు(87గ్రాములు)బంగారు మంగళ సూత్రాలను చోరీ చేశారు. వాటి విలువ రూ.5లక్షలకు పైగా ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ చెప్పారు. హుండీని పగులగొట్టి, గత పది రోజుల్లో భక్తులు సమర్పించిన కైంకర్యాలను పట్టుకెళ్లారు. ఆలయంలోని వెండి ఆభరణాలను ముట్టుకోలేదు. మంగళవారం తెల్లవారుజామున ఆలయంలో పనిచేసే కుటుంబ సభ్యులు, అర్చకులు గుడిని తెరిచేందుకు యత్నించారు. అప్పటికే ఆలయం తాళం పగులగొట్టి ఉండటంతో దొంగతనం జరిగిందని గుర్తించారు. ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులకు, పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రమేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది, క్లూస్ టీం రంగంలో దిగింది. చోరీకి సంబంధించిన ఆధారాలు, ఫ్రింగర్ ప్రింట్స్ సేకరించారు. వివరాలు తీసుకున్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ ముక్కా జితేందర్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.