గొల్లకుర్మల బతుకుల్లో వెలుగు నిండింది. సబ్సిడీ గొర్రెల పంపిణీతో సరికొత్త విప్లవం మొదలైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర సర్కారు గొర్రెల పంపిణీ చేస్తుండగా, ఇప్పటికే గొర్లు అందుకున్న వారి జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. మొదటి విడుత పంపిణీ చేసిన జీవాలు వృద్ధి చెంది, ఆరేండ్లలోనే నాలుగైదింతలు కాగా, రెండో విడుత ముమ్మరంగా సాగుతున్నది. ఎదిగిన జీవాల విక్రయంతో ఒక్కో కుటుంబానికి ఏడాదికి లక్షకుపైగానే ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 900 కోట్ల వరకు, ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 220 కోట్లకుపైగా వచ్చినట్లు యంత్రాంగం అంచనా వేస్తున్నది. శనివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులు ఫీల్డ్ విజిట్ చేయగా, సీఎం కేసీఆర్ చొరవతో తమ జీవితాలే మారిపోయాయని గొలకుర్మలు సంతోషంగా చెబుతున్నారు. గొర్రెలిచ్చి.. తమకు బతుకుదెరువు చూపిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– కరీంనగర్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ)
నేను బతుకుదెరువు కోసం తెలంగాణ రాక ముందు బొంబాయి పోయిన. అక్కడ మస్తు కష్టపడ్డ. కూలీ పనిచేస్తూ బతుకీడ్చిన. మా కుటుంబాన్ని, ఊరిని వదిలి పెట్టి పోయినా పెద్దగా సంపాదన లేకుండె. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సారు మా గొల్లకుర్మలకు సబ్సిడీపై గొర్లు ఇస్తున్నడని తెలిసి మా సొంతూరు దమ్మన్నపేటకు వచ్చిన. మొదటి విడుతల నాకు 20 గొర్లు, ఒక పొట్టేలు ఇచ్చిన్రు. వాటిని జాగ్రత్తగా సాదుకున్న. ఆరు నెలలు గడిచినంక కొన్నింటికి పిల్లలు పుట్టి మొత్తం 35 సనుగు(జీవాలు)లు అయినయ్. ఇలా రెండేళ్లలోనే వంద దాటినయ్. అప్పటి నుంచి ఆరు నెలలకోసారి వాటికి పుట్టిన పిల్లలను అమ్ముకుంటున్న. అలుకగా ఆరు నెలలకు లక్ష ఆదాయం వస్తున్నది. దాదాపు మూడేళ్ల సంది ఏడాదికి 2 లక్షల చొప్పున సంపాదిస్తున్న. గొర్ల ఎరువును మా పొలానికి వాడుతున్న. అవసరం ఉన్న వారి పొలాల్లో మంద తోలుతున్న. అట్ల కూడ లాభం వస్తున్నది. భార్యా పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్న. సొంతూళ్లో రాజులెక్క బతుకుతున్న. నిజంగా గొల్ల కుర్మలకు కేసీఆర్ సారు దేవుడు. ఆ సారుకు ఎప్పటికీ రుణపడి ఉంటం.
సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన గొర్రెలు మంచిగనే దక్కినయ్. ఆరేండ్ల కింద నాకు 20 ఆడవి, ఒక పొట్టేలు ఇచ్చిన్రు. ఇక్కడి మేత పడక నాలుగైదు గొర్రెలు చచ్చిపోతె సుతం పైసలిచ్చిన్రు. మల్ల గొర్లు కొనుక్కున్న. ఇప్పుడు మంచిగనే ఉంటున్నయ్. ఒక్కో గొర్రె ఏటా రెండు పిల్లలు పెడతది. అట్ల లెక్కవెడితే ఏడాదిల ఎన్ని గొర్లయితయో లెక్కెయ్యున్రి. ఇప్పటికే నా మందల అన్ని గొర్రెలు గవ్వే ఉన్నయ్. నాకు ఇంకో పని లేదు. గొర్ల కాసుడే. ఎదిగచ్చిన కొద్దీ అమ్ముకుంటున్న. ఈడికైనా నలభై సనుగులు అమ్ముంట. గొర్లు సాదుకుంటే మంచిగనే ఉంటది. కేసీఆర్ గొర్లిచ్చినంక మంద మంచిగనే హెచ్చింది. అమ్ముకోంగ మిగిలినయ్ ఇపుడు 70 సనుగులు ఉండచ్చు. గొర్లు అమ్ముకుంటే వచ్చిన పైసలతోనే బతుకుతున్నం. సంబురంగ ఉంది.
– జెడ ఓదెలు, చెర్లభూత్కూర్
గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నిండాయి. రాష్ట్ర సర్కారు సబ్సిడీపై అందించిన గొర్రెలు బతుకుధీమా చూపుతున్నాయి. గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధికి మార్గం చూపుతూ.. వారి బతుకులకు భరోసా కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో మాంసోత్పత్తిని పెంచడంతోపాటు గ్రామాల్లో సంపదను సృష్టించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని నెరవేరుస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘గొర్రెల పంపిణీ’ కార్యక్రమంపై ‘నమస్తే తెలంగాణ’ ఫీల్డ్ విజిట్ చేయగా, క్షేత్రస్థాయిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : గతంలో గొల్లకుర్మల పరిస్థితి దారుణంగా ఉండేది. అంతంతగానే ఉన్న గొర్రెలతో జీవితాలు గడిచేది కాదు. నాటి ప్రభుత్వాల నుంచి చేయూత ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కాపర్లు ఎక్కువగా హమాలీ పని చేసుకోవడం, ఇతర రాష్ర్టాలు, దేశాలకు వెళ్లి కూలీ పనులు చేస్కొని పొట్ట పోసుకునే దుస్థితి ఉండేది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులకు జీవం పోస్తున్నారు. అందులో భాగంగానే గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 75 శాతం సబ్సిడీతో గొర్రెలు యూనిట్లు అందిస్తున్నారు. మొదటి విడుతగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 49,308 మంది గొర్రెలు పంపిణీ చేశారు. తర్వాత రెండో విడుత పంపిణీ చేస్తున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖజానా నుంచి నిధులు ఇచ్చి గొర్రెల పంపిణీని కొనసాగిస్తున్నారు.
ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఆరోగ్యంగా ఉన్న గొర్రెలను లబ్ధిదారులకు అందిస్తున్నారు. దీంతో గొర్రెలు పొందిన ప్రతి గొల్ల, కుర్మ జీవితంలో స్పష్టమైన మార్పు స్పష్టంగా కనిపిస్తుండగా, శనివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పలువురు గొల్లకుర్మలను కదిలించినపుడు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొదటి విడుతలో ఇచ్చిన గొర్రెలను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, అవి ఐదారింతలు అయ్యాయాని, ఆదాయం కూడా పెరిగిందని సంతోష పడుతున్నారు. అంతకుముందు ఉన్న కొన్ని గొర్రెలతో కలిపి ఇప్పుడు మందలు తయారయ్యాయని చెబుతున్నారు. ఆడ గొర్రెలు పుడితే పెంచుకుంటూ మగ గొర్రెలు పుడితే అమ్ముకుని ఆదాయం సమకూర్చుకుంటున్నామని చెప్పారు. ఇలా ఒక్కో గొల్ల, కుర్మ గడిచిన ఐదారేళ్లలో రూ.ఐదారు లక్షలు సంపాదించుకునామని చెప్పారు. ఏటా లక్ష ఆదాయం ఎటూ పోవడం లేదని స్పష్టం చేశారు. వచ్చిన ఆదాయంతో గతంలో చేసిన అప్పులు తీర్చుకున్నామని, ఇండ్లు లేని వారు ఇండ్లు కట్టుకున్నామని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తున్నామని, కొందరు తమ పిల్లలకు పెండ్లిళ్లు కూడా చేశారని చెప్పారు.
మాకు మునుపు కొన్నే గొర్లు ఉండె. నాలుగేండ్ల కింద కేసీఆర్ సర్ సబ్సిడీ గొర్లు ఇత్తండని తెలిసి డీడీ కట్టినం. ఆ తర్వాత వెంటనే మేం ఆంధ్రకు పోయి ఇరవై గొర్లు పట్టుకొచ్చుకున్నం. మాకున్న పాత గొర్ల మందల కలుపుకుని నాలుగేండ్ల సంది సాదుతన్నం. ఇప్పుడు మా మంద పెరిగింది. ఇప్పుడు మల్ల రెండో విడుతల మా కొడుక్కు అత్తున్నయ్. డీడీ కట్టుకుంటం. ఇప్పటి దాకా పిల్లలు పెరిగినకొద్ది అమ్ముకుంటన్నం. ఏటా రూ.లక్ష దాక ఆదాయం అత్తంది. మునుపున్నన్ని గొర్లు ఉంటే ఇన్నిగనం పైసలు రాకపోవు. కేసీఆర్ సర్ ఇచ్చుట్ల మాలెక్క ఎంతో మంది మందలు బలిసినయ్. మల్ల కాలం మంచిగైతంది. గడ్డికి కొదువ లేదు. ఇప్పటికైతే మంచిగనే ఉన్నది. మునుపటి కంటే మాకు మందులు ఎక్కువ అత్తన్నయ్. మునుపు పసరు మందులే దిక్కయితుండె. మా ఎర్కల మందులకు అరిగోస పడెటోళ్లం. గొర్లకు ఏమన్న రోగం అచ్చిందంటే ఆకుపసరు మందులు పోసెటోళ్లం. రోగాల సీజన్ అత్తంది అంటే ఏటూరు నాగారం, కొత్తగూడెం అడవులల్లకు పోయి అక్కడి పెద్దమనుషులను తీసుకుని వచ్చి వారం రోజులు ఉంచుకుని గొర్లకు మందులు పెడుతుంటిమి. అది ఎంతో ఖర్చుతో కూడుకున్నదైనా.. మందకు రోగాలు రాకుంట ఉండడానికి పసరు మందులనే నమ్ముకునెటోళ్లం. అయినా, ఆ మందులు సక్కగ పని చేయకపోయేటియి. తర్వాత కొద్దికొద్దిగా ప్రైవేటు షాపులోళ్లు అచ్చిన్రు. పైసలు బాగ అయ్యేటియి. ఇక ఆకుపసరు మందులకంటే మంచిగనే ఉంటయి కదా అని ప్రైవేటులనే మందులను తెచ్చుకునేది. కేసీఆర్ సారు అచ్చినంక మాత్రం నట్టలు, రోగాల మందులను సీజన్లల్ల పంపిత్తండు. గప్పటి ఖర్చు యాదికి చేసుకుంటే మస్తు భయమైతది.
-దాడి కనుకయ్య, గొర్రెల కాపరి,
సీఎం కేసీఆర్ సారు ఇస్తున్న గొర్రెలతో మాకు జీవనోపాధి దొరికింది. నాకు మొదటి విడుత 2017-18ల నాకు 21 జీవాలచ్చినయి. ఒక్కో గొర్రె ఏడాదికి రెండు ఈతలు ఈనుతున్నది. ఐదేండ్లుగా మంచిగా ఉపాధి పొందు తున్నం. పిల్లలను మేమే సాదుకుంటున్నం. పోతు అయితే ఐదార్నెళ్లయిన తర్వాత అమ్ము కుంటున్నం. ఒక్కో పోతును ఆరు వేల రూపాయలకుపైనే అమ్ముతున్నం. ఇలా ఆరు నెలలకోసారి 15 పోతులను అమ్ముతున్నం. ప్రస్తుతం నా దగ్గర 30కి పైగా గొర్రెలున్నయి.
నేను అంతకు ముందు పదైదు మేకలను మాత్రమే కాసేది. పొద్దంతా మేకలతోటి పోయినా ఏం మిగులకపోయేది. 2019ల కేసీఆర్ సారు నాకు 21గొర్రెలు ఇచ్చిండు. అప్పట్నుంచి నా మేకలతో పాటు గొర్రెలను కాస్తున్న. వీటి ద్వారా అన్ని పోంగ లచ్చ రూపాలైతే ఏడపోతలేవు. మా ఇంట్ల అన్ని అక్కెర్లు తీరుతున్నయి. ఈ యేడాది మాకు రెండో విడతల ఇంకో రెండు యూనిట్లు వస్తయి. ఇప్పుడున్న మందకు తోడు ఆ గొర్లతోటి ఇంకింత మేలైతది. గొర్రెలు ఇచ్చుడుతోటి మా గొల్ల కుర్మలు మునుపటికంటే ముందటికచ్చిన్లు. కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం.
– కాటం సంతోష్, గొర్రెల కాపరి గౌరెడ్డిపేట
పల్లెటూర్లో పుట్టినోళ్లం. మా అయ్యవ్వలు మేకలు కాసి మాకప్పగించిన్రు. చదువుకోలేని మేము చెట్లెంట, చెరువుల పొంట మేకలను తిప్పి మేపుతుండేటోళ్లం. మాకు సొంతంగా లేక ఇంకోళ్ల దగ్గర కాపర్లుగా జీతం జేసినం. వాళ్లిచ్చే జీతంతో పొట్టే గడువలేదు. ఇంక మేకలు కొని ఏం బ్యారం సేత్తమంటూ మా ఆయన చంద్రయ్య ఊకే రందిపడ్డడు. మనం ఏం బాగుపడతం? మన బతుకులు గింతే అనుకుని ఎన్నో సార్లు సర్ది జెప్పిన. ఇద్దరు పోరగాండ్లను మంచిగ సదివించి పెద్దోళ్లను జెయ్యాలని సర్కారు బడిలో ఏసిన. కాలం కలిసొచ్చిందేమో. దేవునోలే కేసీఆర్ సార్ వచ్చి గొల్లకుర్మలందరికీ గొర్రెలు ఇత్తుండ్రని అందరు అనుకుంటుంటే విన్న. మా అయ్య నాకు చెప్పిండు. మనకెందుకిత్తరు? మనమేమైనా ఉన్నోళ్లమా..? అని, అవి రావన్నా. ఓ నాడు సర్పంచ్ వచ్చి గొర్రెలు ఇత్తున్నరు, మీరు దరఖాస్తు పెట్టుకోమని చెప్పిండు. నేను మాకిత్తరా? అని అడిగిన. ఎందుకివ్వరు? కేటీఆర్ సార్ ఉన్నడు కదా దరఖాస్తు పెట్టుకోమన్నడు. ఉత్తగనే కాగితం మీద రాసి సార్లకు ఇచ్చినం. లిస్టులో మీ పేరోచ్చిందని ఊరోళ్లు చెపితే నమ్మలేదు. పంచాయతీ గోడకు అంటించిన కాగితంలో ఉందో లేదో సూసిరమ్మని మా పిల్లలకు చెప్పి తోలించిన. పిల్లలు సంబురంగా ఉరికివచ్చి అవ్వా మన పేరొచ్చిందని సెప్పిన్రు. నాకు నిజంగా నోట మాట రాలె. మా ఆయనకు సెప్పి సంబుర పడ్డ. 21 గొర్రెలు వచ్చినయి. మూడేళ్లయితంది. పుట్టిన గొర్లను సాదుకుంటూ పొట్టేళ్లను ఐదారునెలల తర్వాత అమ్ముకుంటూ బతుకుతున్నం. మమ్ములను సేట్లు అని అందరూ అంటుంటే ఎంతో ముచ్చటనిపిస్తంది. కేసీఆర్ దీవెన, కేటీఆర్ సార్ దయ మమ్మల్ని ఇంత ఎత్తుకు చేసింది.
– ఎక్కల్దేవి పద్మ, గొర్రెల కాపరి,
మేం ముగ్గురు అన్నదమ్ములం. మా అన్నలతో కలిసి మా తండ్రి ఇచ్చిన మేకలను సాకిన. మా పరిస్థితి బాగా లేక పదో తరగతి వరకే చదివి మానేసిన. అందరం వేరు పడితే నాకు పదిమేకలే అచ్చినయి. కేసీఆర్, మంత్రి కేటీఆర్ దయవల్ల నాలుగేండ్ల కింద 20 గొర్లు, ఒక పొట్టేలు ఇచ్చిన్రు. విజయవాడ నుంచి నచ్చిన జీవాలను తెచ్చుకున్నం. పిల్లలు తెచ్చిన కొద్ది రోజులకే పెద్దగైనయి. రెండు పసల్లకే పెట్టిన పెట్టుబడి రెండింతలు వడ్డది. పిల్లలు అమ్ముకోంగ ఇపుడు యాభై అరవై గొర్లున్నయి. ఈ గొర్రెల మాంసం బాగుందని చాలా మంది వచ్చి కొనుక్కుని పోతన్రు. ఒకప్పుడు సిరిసిల్ల జిల్లాలో సంతలే లేకుండె. సిద్దిపేట జిల్లా దుబ్బాక, కామారెడ్డి, గంగాధరలోని సంతలో కొనుక్కొచ్చే వాళ్లు. సర్కారు ఇచ్చిన గొర్రెలు బాగా వృద్ధి చెందినయి. ఇప్పుడు ఎల్లారెడ్డిపేట, పెద్దూర్లో సంతలైనయి. మేం ఇక్కన్నే గొర్లను అమ్ముతున్నం. నా దగ్గర మేకలు, గొర్రెలు 150 దాకా ఉన్నయి. నా భార్య చంద్రకళ నేను జీవాలను సాకుతున్నం. కేసీఆర్ సార్ జెయ్యవట్టి ఎక్కడా చూసినా పచ్చగ ఉన్నది. మేతకు కొరత లేదు. చెరువుల పొంటి మేపుతున్నం. సారు ఇచ్చిన గొర్లు నాలుగింతలైనయి. కొడుకు వెంకటేశ్, బిడ్డ లావణ్యను పెద్ద సదువులు సదివిస్తున్న.
– ఎక్కల్దేవి పర్శరాములు, గొర్రెల కాపరి, కొండాపూర్
గొల్లకుర్మల జీవితాల్లో జీవితాల్లో వెలుగులు నింపడం, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా గొర్రెల పంపిణీ శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, 75శాతం సబ్సిడీపై యూనిట్లు అందిస్తున్నది. ఒక్కో యూనిట్ కింద 20 ఆడగొర్లు, ఒక పొట్టేలు ఇస్తున్నది. మొదటి విడుత యూనిట్ ధర 1.25 లక్షలు కాగా, అందులో 75 శాతం 93,750 సబ్సిడీ ఇచ్చింది. సభ్యుడి వాటా 25 శాతం అంటే 31,250 డీడీ చెల్లించారు. రెండో విడుత యూనిట్ ధర 1.75లక్షలకు పెరిగింది. అందులో సబ్సిడీ 1,31,250 కాగా, సభ్యుడి వాటా 25శాతం అంటే 43,750 డీడీ చెల్లించారు.
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలను అందించమే కాకుండా, వాటి పోషణ, సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకుంటున్నది. యూనిట్ మంజూరు చేసినపుడే 3,500 విలువైన దాన కిట్టు, 500 విలువైన మందులు ఇస్తున్నది. అంతే కాకుండా ఆపరేషన్ క్యాలెండర్ ప్రకారంగా ఏడాదికి ఒకసారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. నట్టలు రాకుండా మందులు, టీకాలు ఇస్తున్నది. గాలికుంటు, నీలి నాలుక, పారుడు రోగం, చిటుకు రోగం తదితర రోగాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఫలితంగా 15 నుంచి 18 శాతం ఉన్న జీవాల మరణాలు ఇపుడు 5 శాతానికి తగ్గాయని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు.
సబ్సిడీ గొర్రెల పథకాన్ని సీఎం కేసీఆర్ 2017లో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో మొదటి విడుత కింద 13,519 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆరేళ్ల కింద ఇచ్చిన యూనిట్లలో 2,70,380 ఆడ గొర్రెలు ఉండగా, ఏడాదికి సుమారు 70 వేల గొర్రెల పునరుత్పత్తి జరిగినట్లు తెలుస్తున్నది. అంటే ఆరేళ్లలో సుమారు 4.20 లక్షల గొర్రెలు పునరుత్పత్తి జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పునరుత్పత్తి జరిగిన గొర్రెల్లో వివిధ కారణాలతో 5 శాతం మరణాలు సంభవించినా మిగతావి బతికి ఉన్నాయని చెబుతున్నారు. అందులో ఏటా 40 శాతం గొర్రెలను గొల్ల, కుర్మలు విక్రయించి ఆదాయం సమకూర్చుకుంటున్నారు. అంటే ఒక్కో గొర్రెకు 8వేల నుంచి 10 వేల దాకా విక్రయించినా ఇప్పటి వరకు 220 కోట్లకుపైగా ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
నాకు 60 ఏండ్ల మీదుంటయి. నేను బుద్దికి వచ్చిన సంది గొర్లనే కాస్తున్న. ఇన్నేండ్లల్ల కేసీఆర్ సార్ లెక్క గొర్లు ఎవ్వలూ ఇయ్యలే. నాకు మునుపటిసారే గొర్లు వచ్చినయ్. రూ.33 వేల చిల్లర డీడీ కడితే 20 గొర్లు, పొట్టేలు ఇచ్చిన్రు. మాకున్న పాత గొర్లతోని కలుపుకుని పెంపు చేసుకున్నం. ఇప్పుడు మల్ల మా కొడుక్కు కూడా రెండో విడుతల అత్తున్నయ్. అన్నీ కలిపితే పెద్ద మంద అయితది. వీటితోని ఏటా రూ.లక్ష, రూ.లక్షన్నర ఆదాయం వస్తది. మాకు మందులు కూడా ఉత్తగనే ఇత్తన్రు. డాక్టర్లు ఎప్పటికప్పుడు వచ్చి చూస్తన్రు. గిట్ల మాకు గొర్లు ఇచ్చి మా మంద పెరిగేటట్టు కేసీఆర్ సార్ చేసిన్రు. ధరలు కూడా మంచిగనే ఉన్నయి. పిల్లలను అమ్ముకుంట వచ్చిన పైసలతోటి ఇల్లు గడ్తంది. నా చిన్నప్పుడు గొర్లు కాసుడంటే మస్తు కష్టం ఉండె. ఎటు చూసినా మొత్తం ఎడారిలెక్క ఉండేది. భూములన్నీ అట్టిగనే ఉండేటియి కనీ, పస్క కనపడకపోయేది. వానకాలం గుడ సక్కగ గడ్డి ఉండకపోయేది. ఐదారుగురం కలిసి మందలను ఏసుకుని పెద్దపల్లి, హన్మకొండ జిల్లాలకు పోతుంటిమి. అక్కడ నానా తిప్పలు పడేది. ఎవ్వలు పడితే ఆళ్లు మీదిమీదికి అచ్చేది. కని గొర్రెకడుపు నింపెటందుకు అట్ల తిరిగేది. ఎక్కడపడితే అక్కన్నే తినుకుంట, మంద పెట్టేది. గిప్పుడా పరిస్థితే ఎక్కడ కనిపిస్తలేదు. ఇప్పటోళ్లకు మేం ఎంత కష్టపడ్డమో ఎవ్వలకు తెల్వది. మాకు వేరే పని చేసుడు తెల్వది. కాబట్టి మా వారసత్వంగా వచ్చే గొర్లనే కాసుకుంట బతికినం.
-ఆవుల రాజయ్య, గొర్రెల కాపరి, రామకృష్ణకాలనీ(తిమ్మాపూర్)
గొల్ల, కుర్మలు ఆర్థికంగా వృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నడు. గతంలో ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అటువంటిది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గొర్రెల పెంపకం వృత్తిగా జీవనం సాగిస్తున్న గొల్ల, కుర్మలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని, మా వృత్తిని ఆదుకోవాలన్న ఆలోచనతో గొర్రెల పంపిణీ మొదలు పెట్టిన్రు. అర్హులను గుర్తించి 20 గొర్రెలు, ఒక పొట్టేలు కలిపి యూనిట్గా ఇచ్చిన్రు. 2017 నుంచి గొర్రెల పెంపకాన్ని చేపట్టిన. నాకు సర్కారు ఇచ్చిన వాటాతో నా మందను ఇంకింత పెంచుకుంటూ పోతా. ఆర్థికంగా అభివృద్ధి చెందుతా. కేసీఆర్ మేలును జన్మలో మరచిపోను.
-మొగుళ్ల నరేశ్, గొర్రెల లబ్ధిదారుడు, బాలపెల్లి, జగిత్యాలరూరల్ మండలం
గతంలో మావైపు చూడని ప్రభుత్వాలుండె. నట్టల మందు ఎప్పుడో ఒకసారి ఇవ్వడం తప్ప మమ్మల్ని కనీసం పట్టించుకోకపోయేవి. కానీ, తెలంగాణ రావడం.. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం నిజంగా పేదలకు వరం. సంపదను నిరుపేదలందరికీ పంచుతున్నరు. అలా మా గొల్ల, కుర్మలకు అవకాశం దక్కింది. సర్కారే గొర్రెల యూనిట్లను పంచడం సంతోషంగా ఉన్నది. మాకున్న సంపదే గొర్రెలు, మేకలు. ప్రభుత్వం అందించిన చేయూతతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నం. మమ్మల్ని ఆదుకున్న సర్కారుకు రుణపడి ఉంటాం. సొసైటీల్లో సభ్యత్వం ఉన్న సభ్యులకు ఒక యూనిట్గా 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందజేస్తున్నరు. వాటితోటి మందలో గొర్రెల సంఖ్యను మరింత పెంచుకుంట.
నాకు భార్య, ఇద్దరు కొడుకులు. మేం గొల్లోళ్లమే అయినా గొర్లు లేకుండె. నేను కూలీ పని చేసేది. నా భార్య లక్ష్మి బీడీలు చుట్టేది. అట్లనే కుటుంబాన్ని పోషించుకునేటోళ్లం. పెద్దోడు రఘు 12 వరకు చదివి మానేసిండు. కూలీపనికి పోతున్నడు. చిన్న కొడుకు కుమార స్వామి 8వ తరగతి సదువుతున్నడు. మా ఊరు చిన్నదే అయినా గొల్లకుర్మల సంఖ్య ఎక్కువగానే ఉన్నది. మా ఊరి సహకార సంఘంల 64 మంది గొల్లోళ్లు, 35 మంది కుర్మలు ఉన్నరు. ఊరిల 99 కుటుంబాలు గొర్రెల పెంపకందారులుగా ఉన్నయి. అందుల కొందరికే గొర్ల మందలు ఉండేటియి. చాలా మంది పేదలే. కూలీనాలి చేసుకొని బతికేది. తెలంగాణ అచ్చినంక, కేసీఆర్ సీఎం అయినంక గొల్లకుర్మలకు గొర్రెలు ఇస్తామని చెప్పడంతో కొంచెం ఆశపుట్టింది. 2017ల గొర్రె పిల్లల కోసం దరఖాస్తు చేసుకున్న. 31వెయ్యి కట్టిన. 2018ల మాకు ఆంధ్రాకెళ్లి తెచ్చి, ఇరవై గొర్లు, ఒక పోతు ఇచ్చిన్రు. చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పటి సందో గొర్ల మంద పెంచాలని, మంచిగా బతకాలని ఉండేది.
గొల్లకులంలో పుట్టి, మేకలు, గొర్లు పెంచకపోతినే అనే మనాది ఉండేది. కానీ, సీఎం కేసీఆర్ పుణ్యమా అని గొర్ల మంద వచ్చింది. అయితే ఆ గొర్లను ఇచ్చిన తర్వాత మొదటి రెండుమూడు నెలల్లోనే కొన్ని సచ్చిపోయినయి. వాటికి అంతకుముందే ఇన్సూరెన్స్ చేయించినం. సచ్చిపోయిన గొర్లకు పైసలు ఇవ్వాలని పెట్టుకున్నం. ఆంధ్రాకెళ్లి తెచ్చిన గొర్లలో కొన్ని బతికినయి. అవి మళ్ల పిల్లలను కన్నయి. దాంతోటి గొర్ల సంఖ్య కొంచెం కొంచెం పెరిగింది. ప్రస్తుతం నా దగ్గర నలభై గొర్లున్నయి. అందులో కొన్ని సర్కార్ ఇచ్చినయి, మరికొన్ని నేను కొన్నయి ఉన్నయి. సీఎం కేసీఆర్ దయతోనే నేను గొర్ల మందకు యజమానికి అయిన. లేకపోతే కూలిపని చేస్కుంట బతుకుడే అయ్యేది. ఇప్పుడు గొర్రెల మందతోపాటు వ్యవసాయ కూలి పనులు కూడా చేస్తున్న. ఏ ఇబ్బందిలేకుండా గడిచిపోతంది. బతుకడానికి గొర్ల మందే ఆసరా అయితున్నది. నా కొడుకు రఘు రెండో విడుతలో గొర్ల కోసం 43,750 రూపాయలు కట్టిండు. ఇంక రాలేదు. వస్తయి అని చెప్పిన్రు.
-యాగండ్ల రాజన్న, గొర్రెల కాపరి, ధర్మారం (జగిత్యాల రూరల్ మండలం)
నేను ఇంటర్ మధ్యలోనే ఆపేసిన. మా నాన్న శంకర్ చనిపోయిండు. మా అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటున్న. మాకు ఎకురం భూమి ఉన్నా సా గు నడుస్తలేదు. మరే ఆధారంలేదు. గొర్ల పెంపకంపైనే ఆధారపడి బతుకు తున్నం. తెలంగాణ ప్రభుత్వం రెండో విడుతల సబ్సిడీపై 21 గొర్రెలు అచ్చినయ్. గతంలో ఉన్న కొద్ది పాటి గొర్లకు తోడుగా వీటిని కంటికి రెప్పలా కాపాడుకున్న. గొర్రెల మందను రోజు ఉదయం అడవికి తీసుకెళ్లి మేపుతున్న. మూడేళ్లలో 50అయినయి. పెరిగిన పెరిగినట్టే అమ్మితే ఇప్పటి దాకా రూ.2.50 లక్షల దాకా అచ్చినయ్. గొర్రెల పెంపకం ఎంతో సంతృప్తినిస్తుంది. ఇప్పుడు ధీమాగా ఉన్నం. సబ్సిడీ కింద గొర్రెలు ఇచ్చిన సీఎం కేసీఆర్ సార్కు మా కుంటుంబం రుణపడి ఉంటది.
సీఎం కేసీఆర్ సారు దయతోనే మా గొల్ల కుర్మలకు ఇంత బువ్వ దొరుకుతంది. తెలంగాణ రాక ముందు అప్పు సప్పు చేసి మాకున్న భూమిల ఎవుసం చేసుకుంట ఉండెటోళ్లం. అచ్చిన పైసలతోటి గంజినీళ్లు తాగి బతికెటోళ్లం. మా కట్టాలను చూసిన కేసీఆర్ సారు మా గొల్ల కుర్మలకు బతుకుదెరువు కోసం గొర్రెలను ఇస్తున్నడు. మాకిచ్చిన 21 గొర్రెలను కాసుకుంటున్నం. ఇపుడవి 50 కన్నా ఎక్కువ అయినయ్. మేం సాదుకుంటున్న గొర్రెల్లో కొన్నింటిని అమ్ముకుంటు కొంత సంపాదించుకుంటున్నం. మా గొల్ల కుర్మలకు కేసీఆర్ సారు బీరయ్య దేవుడిలెక్క. మా కుటుంబాలకు పెద్దదిక్కుగా ఉన్న కేసీఆర్ సారు సల్లంగుండాలె.
– గుంట ఓదయ్య, దేశాయ్పేట