`రెండేళ్లలో సగానికిపైగా సాలరీలను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
ఏటా 450 కోట్లకుపైగా ఉద్యోగుల నుంచి ట్యాక్స్ రూపేణా కేంద్రానికి..
సగటున ఒక్కో ఉద్యోగి లక్షా 50వేల పన్ను చెల్లింపు తాజా బడ్జెట్లోనూ నిరాశే
మండిపడుతున్న ఉద్యోగులు
కరీంనగర్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వరాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం వేతనాలు పెంచుతూ వస్తున్నది. రాష్ట్రంలో కొత్త పీఆర్సీ 2018 జూలై ఒకటి నుంచి అమల్లోకి తెచ్చిన 2020 ఏప్రిల్ ఒకటి నుంచి నగదు చెల్లింపులు చేస్తున్నది. కొత్త పీఆర్సీ ప్రకారం చూస్తే.. 30 శాతం ఫిట్మెంట్తో కూడిన వేతన స్థిరీకరణ చేయడంతోపాటు ఇటీవలికాలంలో మూడుసార్లు కలిపి దాదాపు 10 శాతం డీఏ పెంచారు. దీంతోపాటు మూల వేతనంపై పెరిగిన హెచ్ఆర్ఏ లాంటి ఇతర వాటిని పరిగణలోకి తీసుకొని చూస్తే.. దాదాపు 50 శాతం వేతనాలు పెరిగాయి. ఈ విషయాన్ని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఇప్పటికే సగర్వంగా ప్రకటించాయి. నిజానికి ఉత్తర భారతంతో పోలిస్తే.. మన ఉద్యోగులకు వేతనాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరకుల ధరలు, ఉద్యోగుల కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచింది. దీంతో అటెండర్ నుంచి మొదలు ప్రతి ఉద్యోగీ టాక్సు పరిధిలోకి వచ్చారు.
టాక్సు రూపేణా ఏటా 450 కోట్లకుపైగా..
ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎలక్ట్రిసిటీ వంటి విభాగాలే కాదు.. అన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఉమ్మడి జిల్లాలో 30వేల పైచిలుకు మంది ఉన్నది. ప్రతి ఉద్యోగి ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చారు. వీరితోపాటు పెన్షనర్లు 25 నుంచి 30వేల మంది ఉన్నారు. ఒక్కో ఉద్యోగి సుమారు 60 వేల నుంచి 4లక్షల వరకు టాక్సులు కడుతున్నారు. ఉద్యోగుల గణాంకాల ప్రకారం చూస్తే.. సగటున లక్షా 50వేల వరకు పన్ను చెల్లింపులు జరుగుతున్నాయి. ఆ లెక్కన చూస్తే.. ఏటా ఉమ్మడి జిల్లా ఉద్యోగులు 450కోట్ల వరకు ఆదాయ పన్నును కేంద్రానికి చెల్లిస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా టాక్సు కటింగ్పై మళ్లీ 4 శాతం సర్చార్జీని విధించి కేంద్రం వసూలు చేస్తున్నది. ఇదో అదనపు భారం. కొంత మంది పెన్షనర్లు కూడా పన్ను కోవలోకి వస్తున్నారు.
ఏనిమిదేళ్లుగా ఎదురుచూపులే..
పెరుగుతున్న ఖర్చులు, అవసరాల మేరకు వేతనాలు పెరిగినా.. అందుకనుగుణంగా మాత్రం ఆదాయ పన్ను పరిమితి పెంచడంలో కేంద్రం ఏమిదేళ్లుగా వివక్ష చూపుతూ వస్తున్నది. గతంలో ఒక్క స్లాబ్ ఉంటే.. కొత్తగా మరో స్లాబ్ను అందుబాటులోకి తెచ్చి రెండు రకాల స్లాబ్లను అమలు చేస్తుందే తప్ప ఆదాయ పన్ను, స్టాడెండ్ డిడెక్షన్, అలాగే పొదుపు మినహాయింపుల పరిమితులు మాత్రం పెంచడం లేదు. మొదటి స్లాబ్ ప్రకారంచూస్తే.. 2.50 లక్షల నుంచి 5 లక్షల వరకు 5శాతం, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20శాతం, 10 లక్షలపైగా ఆదాయముంటే 30 శాతం టాక్సు చెల్లించాలి. అలాగే బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రెండో స్లాబ్ ప్రకారం చూస్తే.. 2.50 లక్షల నుంచి 5 లక్షల వరకు 5 శాతం, 5లక్షల నుంచి 7.5 లక్షల వరకు 10శాతం, 7.5లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం, 15లక్షల నుంచి 12.50 లక్షల వరకు 20శాతం, 15 లక్షలకు పైబడి ఆదాయముంటే 30శాతం టాక్సు చెల్లించాలనే స్లాబ్ను అమలు చేస్తున్నది.
అయితే బీజేపీ అమల్లోకి తెచ్చిన రెండో స్లాబ్ను ఉద్యోగులు పక్కన పెట్టారు. ఈ స్లాబ్ను ఎంచుకుంటే.. పొదుపు పరిమితి అంటే లక్షా 50 వేల మినహాయింపులు వర్తించవు. అందుకే ఉద్యోగులంతా మొదటి స్లాబ్నే ఆధారంగాచేసుకొని పన్ను చెల్లిస్తున్నారు. ఈ స్లాబ్లను మార్చాలని, ముఖ్యంగా ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచాలని, అలాగే ప్రస్తుతమున్న పొదుపు పరిధి 1.50 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలని చాలా ఏండ్లుగా కోరుతున్నారు. కానీ, కేంద్రం మాత్రం ప్రతి బడ్జెట్లో వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లూతూనే ఉన్నది. దీంతో ఏటా లక్షల్లో టాక్సులు చెల్లించాల్సిన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు వేతనాలు పెంచుతుంటే.. కేంద్రం మాత్రం ఆదాయ పన్ను రూపేణా అంతా మింగుతోందన్న ఆసంతృప్తి ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదాయ పన్ను పరిమితిని 5లక్షలకు పెంచాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే చేసి తీరుతామని చెప్పారు. కానీ, ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
ఆదాయపు పన్ను పరిమితిని మార్చకపోవడం వల్ల ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నరు. ఉద్యోగుల ఆదాయ పరిమితిని రూ.10లక్షలకు పెంచాలని టీఎన్జీవో సంఘం డిమాండ్ చేసింది. మా ఉద్యోగుల వేతనాల్లోంచి అధికంగా పన్నులకే వెళ్తుంది. దీంతో కొనుగోలు శక్తి తగ్గిపోతున్నది.
– బోగ శశిధర్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు (జగిత్యాల)
రాష్ట్రం ఇస్తుంటే.. కేంద్రం కోత..
ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటున్నది. మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకొని అర్హత ప్రకారం జీతాలు పెంచి చేదోడు వాదోడుగా నిలుస్తున్నది. కానీ, కేంద్రం ఇన్కం టాక్స్ రూపంలో కోత విధించడం అన్యాయం. దీంతో ఉద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురువుతున్నారు. ఎనిమిదేళ్ల నుంచి ఇన్కంటాక్స్ పెంచకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నరు. కనీసం ఈ యేడాదైనా ఇన్కం టాక్స్ స్లాబ్ రేట్లు మారుతాయని అంతా ఆశపడ్డాం. కానీ నిరాశే మిగిలింది.
– తూము రవీందర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (పెద్దపల్లి)