కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో స్వచ్ఛహారం (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) చకచకా సిద్ధమవుతున్నది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో ఆరెకరాల్లో రూ. 61.50 కోట్లతో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ ఆఖరి దశకు చేరుకున్నది. 19.3 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ఎస్టీపీని త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు బల్దియా యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. ఇన్నాళ్లూ డ్రైనేజీ నీటి చేరికతో మురికికూపంలా మారిన మానేరు స్వచ్ఛతను సంతరించుకోనుండగా పట్టణ జనం హర్షం వ్యక్తం చేస్తున్నది.
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) రాజన్నసిరిసిల్ల ఆవిర్భావం తర్వాత సిరిసిల్ల పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. ఏడు పల్లెలు బల్దియాలో విలీనమయ్యాయి. వస్త్రపరిశ్రమకు కేంద్రబిందువు కావడంతో పెద్దసంఖ్యలో ఇండస్ట్రీలు తరలివస్తున్నాయి. ఒకవైపు ఇండ్ల నుంచి వెలువడే మురుగు నీరు, మరోవైపు పరిశ్రమల నుంచి వచ్చే రంగులు, రసాయనాలతో కూడిన నీటిని కాలువల ద్వారా రామప్పగుట్టల సమీపంలోని తుమ్మల కుంటకు మళ్లిస్తున్నారు.
గత జనాభాకు అనుగుణంగా సుమారు 1.50 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ చెరువు ప్రస్తుతం సరిపోవడం లేదు. చెరువు నిండి సమీపంలోని పంట చేలల్లోకి చేరి అక్కడి నుంచి మానేరు వాగులో కలుస్తున్నది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించారు. అంచనాలు రూపొందించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పంపించాలని బల్దియా అధికారులను ఆదేశించారు.
దీంతో అధికారులు యుద్ధ ప్రతిపాదికన అంచనాలు రూపొందించి పంపించగా వెంటనే అప్పటి ప్రభుత్వం ఆమోదించింది. ఫస్ట్ బైపాస్రోడ్డు నర్సింగ్ కాలేజీ సమీపంలో ఆరెకరాల స్థలాన్ని కేటాయించింది. 19.3 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ నిర్మాణ పనులను 2022 మే నెలలో ప్రారంభించింది. దాదాపు పనులు పూర్తి కాగా, త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే రోజుకు 3.19 మిలియన్ లీటర్ల మురుగునీరును శుద్ధి చేసే అవకాశం ఉంటుంది.
2022 మే నెలలో ప్రారంభమైన ఎస్టీపీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగాయి. అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ నిరంతరం పర్యవేక్షించారు. సిరిసిల్లకు వచ్చిన ప్రతిసారి అధికారులతో సమీక్షించేవారు. దీంతో అధికారులు చకచకా సాగేలా చర్యలు చేపట్టారు. కేవలం ఏడాదిలోనే ప్లాంట్ పనులు దాదాపు పూర్తి చేశారు. సాధ్యమైనంత త్వరలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను అందుబాటులోకి తెస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్ల పట్టణ జనాభా 1.10లక్షలుండగా, 22,000 నివాసాలున్నాయి. ఇందులో ముఖ్యంగా మరమగ్గాలు, అద్దకం (డైయింగ్) పరిశ్రమలు, సైజింగ్లు, అనుబంధ, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. నివాసాలు, పరిశ్రమల నుంచి 3.19 మిలియన్ల మురుగు నీరు రోజు వెలువడుతుంది. ఈ నీటిని శుద్ధి చేయనుండగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 19.3 లీటర్ల నీటిని రీసైక్లింగ్ చేసే సామర్థ్యంతో ప్లాంట్ను నిర్మించారు.
ఎస్టీపీ ప్లాంట్కు వంద మీటర్ల దూరంలోని డ్రైనేజీకి ఇన్లెట్ చాంబర్ (ఐఅండ్డీ) స్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తున్నారు. మురుగునీరులో వచ్చే చెత్తా చెదారం జాలి వద్ద ఆగిపోతుంది. నీటిని రాసీలెజ్ సంపులోకి మళ్లిస్తారు. అందుకు 33 ఫీట్ల లోతు, సుమారు వంద ఫీట్ల వెడల్పుతో పెద్ద బావి (సంపు) నిర్మించారు. ఇందులో 195 హెచ్పీ సామర్థ్యం గల మోటరు 1, 45 హెచ్పీల సామర్థ్యం గల 4 మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. మురుగునీటిలోని బ్యాక్టీరియాను తొలగిస్తారు. క్లోరినేషన్ కాంటాక్ట్ ట్యాంక్లో నీటిని శుద్ధి చేసి, ఔట్లెట్ పైపులైన్ ద్వారా తుమ్మల కుంట చెరువులోకి మళ్లిస్తారు.
పంట చేలకు, ఇతర అవసరాలకు ఈనీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్లాంట్ నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతను పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కు అప్పగించారు. పనులను హైదరాబాద్ ఉన్నతాధికారుల బృందం ఎప్పటికప్పుడూ పరిశీలిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నది. యంత్రాలు అమర్చి ట్రయల్ రన్కు ఏర్పాట్లు చేస్తున్నారు.