జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుబంధ కళాశాల బాబు జగ్జీవన్రామ్ అగ్రికల్చర్ కళాశాల (జిల్లెల్ల)లో విద్యనభ్యసించే విద్యార్థులు పలు గ్రామాల్లో సాగు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా ఏరువాక కేంద్రాల నేతృత్వంలో శిక్షణ పొందుతున్నారు. నాలుగో సంవత్సరం చదివే విద్యార్థులు నలుగురి చొప్పున బృందంగా ఏర్పడి రోజువారీగా రైతుల వలే పంటపొలాలకు వెళ్తున్నారు. రైతులు సాగు చేసిన వరి, మక్క, పత్తి, మిరప, ఇతర పంటలను పరిశీలిస్తున్నారు. పంట వేసినప్పటి నుంచి కోత కోసే వరకు రైతులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వారికి తెలియన విషయాలను రైతుల వద్ద నుంచి నేర్చుకుంటున్నారు.
పంట కోత వరకు పరిశీలన
వ్యవసాయ డిగ్రీ కోర్సులో భాగంగా నాలుగో సంవత్సరంలో విద్యార్థులు ఒక పంట కాలం గ్రామాల్లోనే బస చేసి పంటల సాగును స్వయంగా పరిశీలించాలి. ఏరువాక కేంద్రాలు ప్రతి విద్యార్థికి ఒక అభ్యుదయ రైతును కేటాయించి, అన్నదాతలు చేపట్టే యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తారు. విత్తనం వేసిన నుంచి పంట కోత మార్కెటింగ్ వరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సస్యరక్షణ పద్ధతులు, చీడపీడలు గురించి విద్యార్థులు నేర్చుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మరో నెల పాటు వారు నేర్చుకున్న అంశాలపై నివేదిక తయారు చేయడం, అవగాహన కార్యక్రమాలు చేపడుతారు.
సాగులో సస్యరక్షణ పద్ధతులు, పంటల ఉత్పత్తులు, చీడపీడల నివారణపై అధ్యయనం చేసేందుకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని బాబు జగ్జీవన్రామ్ అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు పొలంబాట పట్టారు. నలుగురు చొప్పున బృందంగా ఏర్పడి గ్రామాల్లో పర్యటించి, పరిస్థితులను తెలుసుకుంటున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ విద్యలో భాగంగా పంటలను పరిశీలిస్తున్నారు. తరగతి గదిలో నేర్చుకున్న విద్యతోపాటు వినూత్న సాగు గురించి రైతులకు వివరిస్తున్నారు. వారి నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
– చందుర్తి, అక్టోబర్ 10
పల్లె వాతావరణం మంచిగున్నది
గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా పల్లెలో ఉండే అవకాశం లభించింది. పచ్చని చెట్లు, పాడి సంపద, చెరువులు, పంటపొలాలతో ఇక్కడి వాతావరణం మంచిగున్నది. రోజువారీగా రైతులతో మమేకమై పంటల సాగు గురించి తెలుసుకుంటున్నాం. పత్తిలో బంతి, బెండ సాగు చేస్తే శనగపచ్చ, మచ్చల పురుగులను నివారించవచ్చు.
– ఎస్ ఆకాంక్ష, విద్యార్థిని
గొప్ప అదృష్టం
పంట పొలాల్లో అభ్యసనం చేసే అవకాశం లభించడం అదృష్టం. పంటల సస్యరక్షణ, చీడపీడల నివారణ, మార్కెటింగ్ గురించి తెలుసుకుంటున్నాం. మూడేండ్ల పాటు తరగతి గదిలో నేర్చుకున్న వాటితోపాటు అధునాత సాగు గురించి రైతులకు వివరిస్తున్నాం. తెలియని విషయాలను వారి నుంచి తెలుసుకుంటున్నాం.
– బీ నవ్యశ్రీ, విద్యార్థిని
కూరగాయలకు భలే డిమాండ్
పంటల యాజమాన్య పద్ధతులను క్షేత్ర స్థాయిలో తెలుసుకుంటున్నాం. రైతులు అనుబంధ రంగాలపై దృష్టిసారించాలి. పాడి, కోళ్లు, పట్టు పరిశ్రమ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఈ రోజుల్లో కూరగాయలకు భలే డిమాండ్ ఉంది. కూరగాయలు సాగు చేస్తే రోజువారీగా ఆదాయం వస్తుంది.
– బీ నేహ విద్యార్థిని
క్షేత్ర పర్యటన.. గొప్ప అనుభూతి
బీఎస్సీ అగ్రికల్చర్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఏరువాక కేంద్రాల సమన్వయంతో శిక్షణ ఇస్తున్నాం. నిర్దేశించిన గ్రామాల్లో పరిస్థితులను విద్యార్థులు అధ్యయనం చేస్తున్నరు. తద్వారా వారు క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకోవచ్చు. ఇలాంటి పర్యటన వారికి గొప్ప అనుభూతిని ఇస్తుంది.
-డా మదన్మోహన్రెడ్డి, శాస్త్రవేత్త