అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపట్టిన కంటి వెలుగు శిబిరాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. కంటి పరీక్షలు చేయించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో శిబిరాల నిర్వహణకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రారంభించిన 16 రోజుల్లోనే 62 వేల 489 మంది పరీక్షలు చేయించుకోగా, 12,521 మందికి దగ్గరి చూపు అద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు. మరో 8800ల మందికి పాయింటెడ్ అద్దాలు రావడంతో ఆర్డర్లు పెట్టింది.
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కా ర్యక్రమం పేదలకు వెలుగును ప్రసాదిస్తున్నది. పల్లె నుంచి పట్టణం వరకు లక్షల మంది లో కాంతిని నింపుతున్నది. గత నెల 18న సీఎం కేసీఆర్ ప్రారంభించిగా, జిల్లాలో 19 నుంచి ప్రా రంభమైంది. 26 వైద్య బృందాల ద్వారా క్షేత్ర స్థాయి లో కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఒక్కో శిబిరంలో ఒక వైద్యాధికారి, ఆప్తోమెట్రిస్ట్ , డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు అపరేటర్లు, ఒక ఆరోగ్య కార్యకర్త, ఏఎన్ఎం, సూపర్వైజర్, ముగ్గురు ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 21 బృందాలు, సిరిసిల్ల పట్టణంలో 3, వేములవాడ పట్టణంలో 2 బృందాల ద్వారా వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి.
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసే లా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయన ఇటీవల వీర్నపల్లికి వచ్చినపుడు కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. వైద్య పరీక్షలు చేయించుకుంటున్న వారిని శిబిరాల నిర్వహణ, వైద్యులు అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమాత్యుడి సూచనల మేరకు ప్రతి శిబిరం వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించారు. కంటి పరీక్షల్లో పాయింట్ వచ్చిన వారికి ఉచితంగా ఖరీదైన కంటి అద్దాలు అందిస్తున్నారు. గత నెల 19న శిబిరాలు ప్రారంభం కాగా, సెలవు రోజులు పోను మొత్తం 16 రోజులుగా నిర్వహిస్తున్నారు. వంద రోజుల్లో లక్ష్యం 4,22,182 కాగా, ఇప్పటి వరకు 62 వేల 489 మందికి పూర్తి చేశారు. ఇందులో దగ్గరి చూపు అద్దాలు 12,521 మందికి పంపిణీ చేయగా, 8,800 మందికి వివిధ రకాల పాయింట్ అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 255 గ్రామాలు, సిరిసిల్ల పట్టణంలో 39 వార్డులు, వేములవాడ పట్టణంలో 28 వార్డులు కాగా, మొత్తం 322 హాబిటేషన్లలో దశల వారీగా శిబిరాలు నిర్వహిస్తున్నారు.
కంటి వెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్ లో నమోదు చేస్తున్నారు. కంట్లో శుక్లాలు ఉన్నా యా?, కంటిపొరలు, ఇతర వ్యాధులతో బాధపడే వారికి కంప్యూటర్ ద్వారా పరీక్షలు చేస్తున్నారు. సాధారణ దృష్టిలోపాలుంటే అక్కడికక్క డే చికిత్స అందిస్తున్నారు. శస్త్ర చికిత్స అవసరం ఉన్న వారిని సుమారు 500ల మందిని గుర్తించారు. వీరికి త్వరలో చికిత్సచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండాకాలం సమీపిస్తున్నందున అవసరమైన చోట టెంట్లు వేస్తున్నారు.
పొలం పనికి పోయి నాట్లేస్తుంటే కండ్లన్నీ మసక మసక కనిపించినయ్. గిట్ల ఎందుకైతందని మా ఊళ్లె ఆర్ఎంపీకి చెప్తే కండ్ల డాక్టర్ దగ్గరకు పోయి పరీక్ష చేయించుకోమన్నడు. చేతిల పైసల్లేని యాళ్ల ఏం పోవాలనుకుని నెల సంది రేపు మాపనుకుంట దావఖాన్లకు పోలె. మా ఊళ్లెనే కంటి వెలుగు శిబిరం పెడితే సూపించుకున్న. కండ్లళ్ల సుక్కల మందేసిండ్రు. దగ్గర చూపు అద్దాలిచ్చిండ్రు. అవి పెట్టుకుంటే మంచి గ కనిపస్తున్నయి. కండ్లకు మసక లేదు.
-చంద్రకళ, గర్జనపల్లి వీర్నపల్లి మండలం
పత్తేరేందుకు పోతే కండ్లు సక్కగ కనిపిస్తలేవు. ఇది ఇప్పటి బాధ కాదు. శానేండ్ల నుంచి ఉన్నది. పనికి పోంది పొట్టకెల్లదాయె. బియ్యంల రాల్లు ఏరుదామన్న సక్కగ కనిపిస్తలేవు. మాది పల్లెటూరాయె. ఇక్కడ కంటి దావఖాన్లు లేకపాయె. మా ఊళ్లెనే కంటి వెలుగు శిబిరం అయితుందంటే వచ్చి సూపించుకున్న. డాక్టర్లు పరీక్ష చేసి అద్దాలిచ్చిండ్రు. గింత మంచి అద్దాలకు ఎన్ని పైసలైతయో అనుకున్న. ఒక్క పైసా తీసుకోలె. కండ్లు మంచిగ కనిపిస్తున్నయ్. కేసీఆర్ సార్ అచ్చినంక అన్ని మంచిగ జేత్తున్నడు. నాలాంటోళ్లందరికీ అద్దాలిచ్చిండ్రు.
-ఎఫ్ నీలం సత్తవ్వ, వీర్నపల్లి