స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మొన్నటి సమైక్య పాలన వరకు ప్రోత్సాహం కరువైన మహిళలకు, రాష్ట్ర సర్కారు అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నది. ఆకాశంలో సగం, అవనిలో అర్ధభాగమైన ఆమె సంక్షేమం, అభ్యున్నతికి విశేషంగా కృషిచేస్తున్నది. రోజంతా పనిచేస్తేనే పూటగడిచే బీడీ కార్మికులు, దిక్కూ మొక్కూ లేని ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ‘ఆసరా’గా నిలుస్తూ, పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో సాయం అందిస్తున్నది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు మంజూరు చేస్తూ ఆర్థిక సాధికారతకు చేయూతనిస్తున్నది. గర్భిణులకు ఆరోగ్య లక్ష్మి, తల్లులకు కేసీఆర్ కిట్స్, ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య మహిళ పథకాలను అమలు చేస్తున్నది. ఇంకా ఉద్యోగాలు, రాజకీయాలు సహా పలు రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రగతికి బాటలు వేస్తున్నది. ఈ రోజు ఏ రంగంలో చూసినా దేశంలో ఎక్కడా లేనివిధంగా పురుషుల కంటే అధికంగా ప్రాధాన్యం ఇస్తుండగా, ఆమె అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తీరు మహిళా సంక్షేమ సౌరభాన్ని చాటుతున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తుండగా, ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
– కరీంనగర్, జూన్ 12 (నమస్తే తెలంగాణ)/కలెక్టరేట్
సమాజంలో సగ భాగమైన మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నది. మహిళల కోసం వివిధ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ వారి ప్రగతికి బాసటగా నిలుస్తున్నది. ముఖ్యంగా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటి మానవీయ పథకాలు మహిళలపై సీఎం కేసీఆర్ చూపుతున్న సానుకూల ధోరణికి అద్దం పడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్ కమిటీ పదవుల్లో రిజర్వేషన్లు తెచ్చారు. ప్రత్యేకించి పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలు ఇస్తున్నారు. స్వశక్తి సంఘాలకు రుణాలు, బ్యాంక్ లింకేజీలు అందిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో పురుడు పోసుకున్న వారికి ఆర్థిక సాయంతోపాటు కేసీఆర్ కిట్స్ను అందిస్తున్నారు. ఇలా ప్రతి పథకం మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న నేపథ్యంలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ముందుకెళ్తున్నారు.
– కరీంనగర్, జూన్ 12 (నమస్తే తెలంగాణ)/ కలెక్టరేట్
ఆది నుంచీ ఆడబిడ్డ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి అడుగడుగునా అండగా నిలుస్తున్నది. తల్లీబిడ్డల ఆరోగ్యం బాగుండాలని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నది. గర్భిణులు, బాలింతలు, పిల్లల కోసం రోజులో ఒక పూట పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఒక్కొక్కరికీ ప్రతి రోజూ 23 విలువైన ఆహారాన్ని నెలలో 25 రోజులపాటు ఇస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఈ రకంగా రోజుకు 12,63,574 విలువైన పౌష్టికాహారాన్ని 54,938 మందికి అందిస్తున్నది. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు కోడి గుడ్లు, గోధుమ పిండి, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనె తదితర వస్తువులు ఇస్తున్నది. మాతా శిశు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేయించుకున్న వారికి మగ శిశువు జన్మిస్తే 12 వేలు, ఆడ శిశువు జన్మిస్తే 13 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నది.
కేసీఆర్ కిట్స్ వంటి వినూత్న పథకాన్ని ప్రవేశ పెట్టడంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు నానాటికి పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 1,31,135 మందికి కేసీఆర్ కిట్స్, ఆర్థిక సాయం ద్వారా 118.81 కోట్లు ఖర్చు చేశారు. మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు మహిళా స్వశక్తి సంఘాలకు ఏటా భారీగా రుణాలు అందిస్తున్నారు. 2014కు ముందు ఉమ్మడి జిల్లాలో 40,068 స్వశక్తి సంఘాలకు కేవలం 723 కోట్లు మాత్రమే రుణాలు అందేవి. ఇపుడు సంఘాలు మరిన్ని విస్తరించాయి. అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం రుణాల పరిమితిని పెంచింది. ఇపుడు 49,541 సంఘాలకు ఏటా 3,590 కోట్ల రుణాలను అందిస్తూ మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటును అందిస్తున్నది. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నది. మహిళా సంఘాల నుంచి 11.5 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తూ తిరిగి 10 శాతం వడ్డీని మహిళ సంఘాలకే చెల్లిస్తున్నది. స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ వంటి పథకాల ద్వారా రుణాలు పొందుతున్న మహిళలు తమ కుటుంబ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇతర వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నారు.
చిరుద్యోగులకు కొండంత అండ
మహిళలకు క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న చిరుద్యోగులైన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్ల గురించి గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరి వేతనాలు 150 శాతం పెంచి వారిని వాళ్ల కాళ్లపై నిలబడేలా చేసింది. ఉమ్మడి జిల్లాలో 2,809 మంది అంగన్వాడీ టీచర్లకు 2014లో నెలకు 4,500 మాత్రమే ఇచ్చేవారు. ఇపుడు వీరి వేతనం 13,650 ఇస్తున్నారు. 2014లో వీరి మొత్తం నెల వేతనం 1.26 కోట్లు ఉంటే ప్రస్తుతం 3.86 కోట్లు అందిస్తున్నారు. ఇక అంగన్వాడీ ఆయాలు ఉమ్మడి జిల్లాలో 2,829 మంది ఉన్నారు. 2014లో వీరికి నెలకు కేవలం 2,200 చొప్పున 62.25 లక్షలు మాత్రమే వచ్చేది. ఇపుడు 7,800కు పెంచిన ప్రభుత్వం ప్రతి నెలా 1.97 కోట్లు చెల్లిస్తున్నది. అలాగే మహిళల ఆరోగ్యాలను అనునిత్యం పర్యవేక్షించే ఆశ కార్యకర్తలకు ఇచ్చే పారితోషికం కూడా భారీగా పెంచింది. 2014లో వీరికి గరిష్టంగా రూ.4 వేలు మాత్రమే వచ్చేది. ఈ లెక్కన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 2,354 మందికి 2014లో కేవలం 84.54 లక్షలు మాత్రమే పారితోషికం వచ్చేది. ఇపుడు తెలంగాణ ప్రభుత్వం 9,750 గరిష్ఠంగా పెంచడంతో ప్రతి నెలా రూ.2.29 కోట్లు వస్తున్నది.
పోలీసు శాఖలో పెరిగిన మహిళా ఉద్యోగులు
ఈమె పేరు తాటికొండ విజయమణి. 1991 బ్యాచ్లో కానిస్టేబుల్గా రిక్రూట్ అయ్యారు. అప్పుడు పోలీస్శాఖలో మహిళలకు కొన్ని పోస్టులు మాత్రమే ప్రత్యేకంగా కేటాయించి వాటినే భర్తీ చేసేవారు. విజయమణి ఇప్పుడు ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం షీటీమ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. గతంలో పోలీస్ ఉద్యోగాలకు మహిళలు రావడానికి భయపడేవారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో విరివిగా వస్తున్నారని ఆమె అంటున్నారు. గతంలో కంటే కేసీఆర్ ప్రభుత్వంలో పోలీస్ ఉద్యోగాల నియామకాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా జరుగుతున్న నియామకాల్లో అయితే 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. మహిళలకు భద్రత కల్పించే విషయమై ఏఎస్ఐ విజయమణి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఎంతో బాగున్నాయని చెబుతున్నారు. గతంలో మహిళలకు ఇంత రక్షణ వ్యవస్థ లేదని అంటున్నారు. షీ టీమ్ల ఏర్పాటుతో మహిళల్లో ధైర్యం పెరిగిందని, ఒంటరిగా వెళ్లే మహిళలు, బాలికలను కన్నెత్తి చూడాలన్నా భయపడుతున్నారని అంటున్నారు. అన్ని రంగాల్లో రాణించాలంటే ముందు మహిళల్లో భయం అనేది పోవాలని, పోలీసులు ఉన్నారనే ధైర్యంతో ఉండాలని విజయమణి సూచిస్తున్నారు.
ప్రైవేట్ల అయితే 50వేలకు తక్కువ కాకపోవు
మాది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం. అమ్మవాళ్లది ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్. మొదటి కాన్పు కోసం పుట్టింటికి వచ్చిన. అమ్మ, నాన్న పొలం పనిసేత్తరు. సిరిసిల్ల సర్కారు దవాఖానల వారం కింద డెలివరీ కోసం చేరిన. ఎట్ల చేస్తరో ఏమోనని భయపడ్డ. రాత్రి నిద్రకూడా పోలె. ఆపరేషన్ థియేటర్కు భయం భయంగనే పోయిన. గంట సేపటికి సోయికొచ్చినంక డాక్టర్లు పాప పుట్టిందని చెప్పిన్రు. చాలా సంతోషమనిపించింది. మంచి మందులు ఇచ్చిన్రు. సిస్టర్ల నుంచి డాక్టర్ల దాకా అందరూ మంచిగ సూసుకున్నరు. పాపపుట్టంగనే కేసీఆర్ కిట్టు తెచ్చిచ్చిన్రు. బ్యాంకు ఖాతా, అధార్ కార్డు ఇవ్వమంటే ఇచ్చిన. 13 వేలు ఖాతాల పడుతయన్నరు. సర్కారు దవాఖాన మంచిగున్నది. ప్రైవేటులో అయితే యాభై వేలకు తక్కువ కాకుండె. కేసీఆర్ సార్ మా పేదోళ్లకు పెద్దన్నలా దిక్కయ్యిండు. ఆయన, లేకుంటే మా తల్లిదండ్రులు పైసలు యాడికెళ్లి తెత్తురు. చానా కష్టమైతుండె.
– తమ్మనవేణి హేమలత, రాచర్ల బొప్పాపూర్ (ఎల్లారెడ్డిపేట మండలం)
తెలంగాణ వచ్చిన తర్వాతే మాకు గుర్తింపు
నేను ఎనిమిదేళ్ల క్రితం ఆశ కార్యకర్తగా 750 వేతనంతో ఉద్యోగంలో చేరా. అప్పటి నుంచి కొన్నేండ్లపాటు పాటు చాలీ చాలని జీతంతో పని చేసిన. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి వైద్య సేవలందిస్తం. అయినా మా బాధలను మాత్రం నాటి పాలకులు పట్టించుకోలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని మొరపెట్టుకోగా కంటి తుడుపుగా స్పందించారే తప్పా మా కన్నీళ్లను తుడవలేదు. మా జీతం ఓసారి వెయ్యి, మరోసారి 1200 అయ్యింది. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆశ కార్యకర్తల సేవలను గుర్తించారు. మా జీతం పెంచారు. ఇప్పుడు 9,750 వేతనం అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ సారుకు మేమంతా రుణపడి ఉంటాం.
-కట్ల స్వప్న, ఆశ కార్యకర్త (మంథని)
నేడు మహిళా సంక్షేమ దినోత్సవం
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలోమహిళా సదస్సు నిర్వహిస్తారు. మహిళా సంక్షేమం కోసం పెన్షన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్, మారెట్ కమిటీల్లో రిజర్వేషన్, మహిళలకు వీఎల్ఆర్, షీ టీమ్స్, వీ హబ్ ఏర్పాటు, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు పెంపు, వేతనాల పెంపు, మహిళా డిగ్రీ కాలేజీల పెంపు వంటి కార్యక్రమాలు, పథకాల గురించి వివరిస్తారు. ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేస్తారు.
రిజర్వేషన్లతో ప్రోత్సాహం
మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నది. ఒకప్పుడు నిస్తేజంగా ఉన్న మహిళలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని పునికిపుచ్చుకుని అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించిన రిజర్వేషన్ల కారణంగా మహిళలు పురుషులతో సమానంగా పదవులు దక్కించుకుని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులుగా రాణిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మూడు జడ్పీ అధ్యక్ష పదవులను దక్కించుకున్న మహిళలు చక్కటి పాలన అందిస్తున్నారు. ఎంపీపీలుగా మండలాల్లో సమర్థవంతమైన పాలన సాగిస్తున్నారు. కేతిరెడ్డి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న తిమ్మాపూర్ మండల ప్రజా పరిషత్తుకు జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వకారణం.
ఇలా మహిళలు ఎంపీపీలు, సర్పంచులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న మండలాలు, గ్రామాలకు కూడా జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. ఉదాహరణకు తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, రామడుగు మండలం వెలిచాల గ్రామాలను చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పదవులను కూడా కేటాయించింది. ఇక విద్యా, ఉద్యోగాల విషయానికి వస్తే ఉమ్మడి జిల్లాలో బాలికల కోసం ప్రత్యేకంగా ఇంటర్, మహిళల కోసం డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారు. పోలీసు ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో మహిళలు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు.