Traffic signals | కోరుట్ల, జూన్ 14: లక్షపై చిలుకు జనాభా కలిగిన కోరుట్ల పట్టణంలో గత ఏడాది కాలంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పని చేయడం లేదు. టీయూ ఎఫ్ఐడీసీ నిధులు రూ. 25 లక్షలతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఆలంకారప్రాయంగా మారాయి.
పట్టణంలోని నంది చౌరస్తా, కల్లూరు రోడ్డు క్రాసింగ్ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. నిజామాబాద్, జగిత్యాల, వేములవాడ పట్టణాలకు వెళ్లేందుకు ప్రధాన రహదారిగా ఉన్న కోరుట్లలోని జాతీయ రహదారిపై రాకపోకలు సాగించేందుకు ఏకైక మార్గంగా ఉంది. బైపాస్ రోడ్డు లేని కారణంగా వందలాది చిన్న, భారీ వాహనాలు కూడ పట్టణంలోని ఈ రహదారి గుండానే ప్రయాణించాల్సి ఉంది.
నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిగ్నల్స్ పని చేయక మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలు, ఇష్టానుసారంగా వాహన రాకపోకలతో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారితో పాటూ ఈ రెండు చౌరస్తాల మార్గం నుంచి రోడ్డు పైకి చేరే క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ లేక వాహనదారులు అయోమయానికి గురౌతున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనదారులు సైతం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ఇబ్బందులు ఎదురౌతున్నాయి.
నిత్యం రద్దీగా కొత్త బస్తాండు, నంది చౌరస్తా, కల్లూరు రోడ్డు క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ కానిస్టేబుల్ నియమించాలని, సిగ్నల్స్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ను సంప్రదించగా, ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైన చోట ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.