వేములవాడ టౌన్, డిసెంబర్ 4 : కరోనా నేపథ్యంలో 2020 ఫిబ్రవరి 19న మూతబడడ రాజన్న ఆలయ పుష్కరిణి దాదాపు 34 నెలల తర్వాత ప్రారంభమైంది. ఆలయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి పులకించిపోయారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ధర్మగుండంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు పుణ్యాహవాచనం, గణపతి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం, ధర్మగుండంలో సంప్రోక్షణ పూజలు నిర్వహించి, అర్చకులు, ఆలయ సిబ్బంది కూడా ధర్మగుండంలో స్నానాలు చేశారు. అనంతరం ధర్మగుండంలోని పవిత్ర జలంతో శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి తమ జన్మధన్యమైందని పేర్కొన్నారు.
ఏటా రాజన్న దర్శనం కోసం వస్తాం. ప్రతిసారి ధర్మగుండంలో స్నానం చేసిన తర్వాత కోడెమొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో రెండేళ్లుగా ధర్మగుండంలో స్నానమాచరించక పోవడం మాకు ఏదో లోటుగా అనిపించేది. ఈ రోజు ఏకాదశి సందర్భంగా ధర్మగుండంలో సంప్రోక్షణ పూజలు కాగానే మేం సరిగంగ స్నానాలు చేశాం. మా ఆనందానికి అవధుల్లేవు.
-మహేందర్, శ్వేత దంపతులు, జమ్మికుంట