కరీంనగర్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్లోని క్రిస్టియన్ కాలనీలోని ఒకేషనల్ కాలేజీలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ముకరంపురలోని మల్టీపర్పస్ స్కూల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అల్గునూర్లో మానకొండూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ తన ఓటు హక్కును వినియోగించుకోగా, హుజూరాబాద్ మండలం సింగాపూర్లో హుస్నాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, గంగాధర మండలం బూరుగుపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వీణవంక మండల కేంద్రంలో ఓటు వేశారు. రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ తన సతీమణితో కలిసి వీణవంక మండలం హిమ్మత్నగర్లో, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ తన కుటుంబంతో కలిసి హుజూరాబాద్ పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.