రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత కోసం రాష్ట్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పోస్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడి ఈకేవైసీ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందుకోసం రేషన్ షాపుల్లో సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి, ఇప్పటికే ఈ ప్రక్రియను అన్ని జిల్లాల్లో ప్రారంభించింది. దీని ద్వారా బోగస్ కార్డులు, మరణించిన వారి పేర్లు తొలగించే అవకాశం ఉంటుంది.
కలెక్టరేట్, సెప్టెంబర్ 25: రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభు త్వం ఉపక్రమించింది. గతంలో ఐరీస్, ఈ పోస్ మిషన్లు, జియోట్యాగింగ్ విధానాలను అందుబాటులోకి తెచ్చి కొంతమేర అడ్డుకట్ట వేయగలింది. అయితే సరుకులు తీసుకొనేందుకు కార్డుదారుల్లో ఏ ఒక్కరూ వేలిముద్ర వేసినా సరిపోయేది. దీంతో చనిపోయినవారి పేరిట సైతం సరుకులు తీసుకుంటున్నారు. కొందరు అర్హతలేని వారు కూడా కార్డులు పొంది నెలనెలా రేషన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సరుకుల పంపిణీలో పూర్తి పారదర్శకత కోసం రేషన్ కార్డులను ఈ కేవైసీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ప్రారంభం కాగా, గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఈ ప్రక్రియను జిల్లాలోని ఆయా రేషన్ దుకాణాల్లో చేపట్టనున్నారు. ఈ విధానంలో ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ కేవైసీ) పద్ధతిలో చేయనున్నారు. అందుకు ఈ-పాస్ యంత్రంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ను పొందుపరిచారు. ప్రస్తుతం రేషన్బియ్యం తీసుకోవాలంటే వేలిముద్ర వేస్తున్నట్లుగానే అదే విధానంలో రేషన్ దుకాణానికి వెళ్లి కార్డులో ఉన్న కుటుంబసభ్యులంతా వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. వేలిముద్రలు పడకుండే ఐరిస్ ద్వారా నిర్ధారణ జరిగేలా యంత్రంలో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశారు. వేలిముద్ర వేయని కుటుంబ సభ్యుడి పేరును కార్డు నుంచి తొలగించనున్నారు. కార్డు సభ్యులు ఎవరూ రాకుంటే కార్డును రద్దు చేస్తారు..
రేషన్కార్డులో పేర్లు ఉన్న కుటుంబసభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ-పోస్ యంత్రంలో థంబ్ వేయాలి. వేలిముద్ర వేయగానే రేషన్కార్డునంబర్తో పాటు ఆధార్ నంబర్ తెరపై కనబడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా ఆకుపచ్చ వెలుగు వచ్చి సదరు వినియోగదారుని కెవైసీ పునరుద్ధరించబడుతుంది. ఎరుపు రంగు వెలుగు వస్తే సదరు వినియోగదారుడి రేషన్కార్డు ఆధార్కార్డు సరిపోల్చలేమంటూ తిరస్కరిస్తుంది. వేలిముద్ర వేసిన తర్వాత ఈ -పాస్ యంత్రంలో ఎరుపు రంగు వస్తుందో సదురు వ్యక్తి పేరు కార్డు నుంచి తొలగిస్తారు. కార్డులో ఎంతమంది ఉంటారో వారంతా రేషన్ దుకాణానికి ఒకేసారి రావాల్సి ఉంటుంది. వీరిలో ఒకరిద్దరూ గైర్హాజరు అయితే వాళ్ల కుటుంబం నుంచి దూరమయ్యారని భావించి వచ్చిన వారి కేవైసీని అప్డేట్ చేస్తారు.
పెద్దపల్లి జిల్లాలో ఆహారభద్రతకార్డులు 2,07,580, అంత్యోదయ 12,217, అన్నపూర్ణ కార్డులు 156 మొత్తంగా 2,19,953 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో 6,27,314 మంది కుటుంబ సభ్యులు నమోదై ఉన్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో 345 రేషన్దుకాణాలున్నాయి. వీటిలో 1,73,972 రేషన్కార్డులుండగా, దాదాపు 4,98,497 మంది వినియోగదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా దాదాపు 325 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. కాగా, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో ఈ కేవైసీ ప్రక్రియ ఇటీవలే మొదలైంది. పౌర సరాపరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సిరిసిల్లలో మంగళవారం జిల్లా పౌర సరాఫరాల శాఖ అధికారి జితేందర్రెడ్డి ఈ కేవైసీ ప్రక్రియను ప్రారంభించారు.