Sircilla | రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్, జూలై 20 : ప్రజావాణిలో ప్రజలు సమర్పించే ప్రతీ అర్జీని బాధ్యతగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు అప్పగించారు. ఈ వారపు ప్రజావాణికి మొత్తం 175 దరఖాస్తులు అందగా, ప్రతీ దరఖాస్తుపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావివ్వొద్దని స్పష్టం చేశారు.
డివిజన్ కేంద్రాల్లోనూ ప్రజావాణి సేవలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంతో పాటు రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. స్థానిక ప్రజలు దూర ప్రయాణాలు చేయకుండా తమకు సమీపంలోని ఆర్డీవో కార్యాలయాల్లోనే వినతులు సమర్పించి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో 6, వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో 4 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖితతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.