కేబుల్ బ్రిడ్జి ప్రారంభ సంబురాలు రెండోరోజు గురువారం అంబరాన్నంటాయి. కళాకారుల నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నగరవాసులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. మంత్రి గంగుల కమలాకర్ కుటుంబసమేతంగా హాజరై కళాప్రదర్శనలు తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మూడు నెలల్లో మానేరు రిఫర్ ఫ్రంట్ మొదటి దశ పనులు పూర్తి చేస్తామన్నారు.
– కమాన్ చౌరస్తా, జూన్ 22
కమాన్చౌరస్తా, జూన్ 22 : కరీంనగర్ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్నామని అందులో భాగంగానే మానేరు రివర్ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నగరంలోని తీగల వంతెనను బుధవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ లాంఛనంగా ప్రాంభించిన విషయం తెలిసిందే. మానేరు తీరంలో గురువారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలను మంత్రి గంగుల వీక్షించి మాట్లాడారు. మానేరు రివర్ ఫ్రంట్లో భాగమే తీగల వంతెన అని, మూడు నెలల్లో రివర్ ఫ్రంట్ మొదటి దశ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
రివర్ఫ్రంట్ నీటిలో తీగల వంతెన దృశ్యాలు ప్రతిబింబిస్తాయని చెప్పారు. తాను ఎన్నికల కోసం పని చేసే నాయకుడిని కాదని, బంగారు భవిష్యత్ను ముందు తరాలకు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మానేర్ రివర్ ఫ్రంట్ను వేగంగా పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అప్పుడు ఐదు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. అంతకు ముందు కళాకారులను ఆయన అభినందించారు. దుబాయ్ కళాకారుల ఎల్ఈడీ డ్యాన్స్, ఢిల్లీ నుంచి వచ్చి కళాకారుల ఖవ్వాలీ, నాగదుర్గ నృత్యాలు, జోర్దార్ సుజాత వ్యాఖ్యానం ఆకట్టుకున్నాయి.