జ్యోతినగర్, జూలై 4 : వారంతా సాధారణ దినసరి కూలీలు. పని చేస్తూ వచ్చే జీతం జల్సాలకు సరిపోవడం లేదు. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. దొంగతనాలు చేస్తే బాగా సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. తాళం వేసిన ఇండ్లు, బండ్లను టార్గెట్ చేశారు. ఎన్టీపీసీ ఏరియాలో పగలు తిరుగుతూ తాళం ఉన్న ఇండ్లను గుర్తించారు. ఇరుగు పొరుగు వారు లేని సమయం చూసి తాళాలు పగులగొట్టి విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లడం, అమ్మడం, దీనికితోడు ఎక్కడైనా తాళం వేసి ఉన్న బండ్లు కనిపిస్తే తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. ఎన్టీపీసీ పోలీసులు నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసి విచారించడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. ఈ మేరకు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ నిందితుల అరెస్టు, దొంగతనాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గోదావరిఖని ఫైవింక్లయిన్కు చెందిన కొండ రాజేశ్, ఇందిరానగర్కు చెందిన బండారి శివ కోటేశ్వరరావు, అడ్డగుంటపల్లికి చెందిన గుర్రాల గంగాధర్ పలు దొంగతనాలు చేసిన కేసుల్లో నిందితులు.
గతేడాది జూలై 3న గౌతమినగర్లో ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో చొరబడ్డారు. బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించారు. ఈ విషయమై బాధితుడు జాకీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన స్థలంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఇదివరకే పలు కేసుల్లో నిందితుడైన కొండ రాజేశ్గా నిర్ధారించారు. అతని కోసం ప్రత్యేక టీంను రంగంలోకి దింపారు. ఆ మరుసటి రోజే నిందితులు మేడిపల్లి చౌరస్తాలోని మద్యం దుకాణం వద్ద ఉండడంతో ఎన్టీపీసీ ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లి నిందితుడిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నాడు. అతన్ని విచారించగా పలు విషయాలు తెలిశాయి. రాజేశ్ గతంలో పలు దొంగతనాల్లో జైలుకు వెళ్లి వచ్చాడని, అయినా తన పద్ధతి మార్చుకోలేదు. మరో నిందితుడు బండారి శివ కోటేశ్వరరావుతో కలిసి జల్సాల కోసం దొంగతనాలు చేశారు. దొంగిలించిన ఆభరణాలు, వాహనాలను గుర్రాల గంగాధర్ ద్వారా అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు.
గోదావరిఖనిలో పార్కింగ్ చేసి ఉన్న బైక్లను అపహరించి తన స్నేహితుడు గంగాధర్ ద్వారా అమ్మేవారు. నిందితులపై ఎన్టీపీసీలో ఒక కేసు, గోదావరిఖని వన్ టౌన్లో మూడు కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి రూ.1.40లక్షల విలువైన 47.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి కలిపి మొత్తం రూ.1.55 లక్షల సొత్తు రికవరీ చేశారు. ఇంటి పరిసరాల్లో స్థానికులు కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలను అరికట్టవచ్చని డీసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రామగుండం సీఐ చంద్రశేఖర్ గౌడ్, సీఐ ప్రసాద రావు, ఎస్ఐ జీవన్తోపాటు సిబ్బంది అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు.