కరీంనగర్, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కలెక్టరేట్ : లోక్సభ పోలింగ్కు మరో పది రోజులు మాత్రమే గడువు ఉన్నది. దీంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో వేగం పెంచింది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తికాగా, సిబ్బంది నియామకం కూడా పూర్తయింది. వారికి రెండో దఫా శిక్షణ కొనసాగుతున్నది. పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం చేపట్టిన హోం ఓటింగ్ కూడా ఈ నెల 3 నుంచి చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యాంగుల కోసం నాలుగు రోజుల పాటు హోం ఓటింగ్ కొనసాగించనున్నారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి కాగా, వాటిని అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించారు. పోలింగ్ స్లిప్పుల పంపిణీ ఇప్పటివరకు 25 శాతం వరకు పూర్తి చేశారు. మరో వారంలో మొత్తంగా కంప్లీట్ చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 33,90,146 మంది ఓటర్లుండగా, అందులో 17,25,320 మంది మహిళలు, 16,64,623 మంది పురుషులు ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 17,97,150 ఓటర్లుండగా, అందులో 9,19,565 మంది మహిళలు, 8,77,484 మంది పురుషులు ఉన్నారు. పెద్దపల్లి సెగ్మెంట్లో 15,92,996 మంది ఓటర్లుండగా, వీరిలో 8,05,755 మంది మహిళలు, 7,87,140 మంది పురుషులు ఉన్నారు.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నారు. ఇటీవల దరఖాస్తు చేసుకున్న వారితోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రానివారికి కూడా ఓటరు ఎపిక్ కార్డులు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు 1.40 లక్షల ఓటరు గుర్తింపు కార్డులను ఓటర్ల చిరునామాలకు పంపినట్లు ఎన్నికల అధికారులు వెల్లడిస్తున్నారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 70 వేల మంది పీడబ్ల్యూడీ ఓటర్లుండగా, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎస్సెన్షియల్ ఉద్యోగులతోపాటు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది కోసం రెండు సెగ్మెంట్లలో కలిపి 27 వేల పైచిలుకు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కరీంనగరంలోని సెయింట్ అల్ఫోన్స్ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.
రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 4,044 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సరిపడా ఈవీఎంలు, వీవీ ప్యాట్లు కూడా అందుబాటులో ఉంచారు. మొత్తం 15,562 మంది అధికారులు, సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొననుండగా.. ఓటింగ్ ప్రశాంతంగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నారు.
కరీంనగర్, చొప్పదండి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి నగరంలోని ఎస్సారార్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు, మానకొండూర్ సెగ్మెంట్ కోసం నగర శివారులోని ఎస్సీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, వేములవాడ ప్రభుత్వ పాఠశాల, సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల, హుస్నాబాద్ మోడల్ స్కూల్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రిసెప్షన్, పోలింగ్ సామగ్రి పంపిణీకి తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు.