Peddapally | పెద్దపల్లి కమాన్, అక్టోబర్ 5 : పెద్దపల్లి మున్సిపల్ అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పట్టణంలో ని 30వ వార్డు ప్రజలకు శాపంగా పరిణమించింది. వర్షపు నీరు రోడ్డుపైనే నిలుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే కాలనీలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కనీసం కాలి నడకన కూడా వెళ్లలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ముందు మూన్ ఫంక్షన్ హల్ వీధిలో వర్షం పడినప్పుడల్లా మోకాళ్ళోతూ నీళ్లు నిలుస్తున్నాయి. డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఇండ్లు, షాపుల్లోకి మురుగు నీరు చేరుతూ దుర్వాసన వస్తున్నదని కాలనీవాసులు మండిపడుతున్నారు. ఈ రోడ్డు ఇలా మారడానికి కారణం ఇటీవల జెండా చౌరస్తా నుంచి నెహ్రు విగ్రహం వరకు విస్తరించి న రోడ్డు పనులేనని విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఎత్తు పల్లాలను సరి చూసుకోకుండానే ఇష్టారీతిలో అస్తవ్యస్తం గా తారురోడ్డు వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దీంతో ఎస్బీ ఐ, యూనియన్, ఇండియన్ బ్యాంకులతో పాటు మూన్ ఫంక్షన్ హాల్ వీధిలో వర్షపు నీటితో పాటు డ్రైనేజీలోని మురుగు రోడ్ల పై ప్రవహిస్తున్నదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి మురుగునీరు రోడ్డు పై నిలువకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.