కొత్తపల్లి, అక్టోబర్ 7 : గత పాలకులు దళితులను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూశారని, కానీ, సీఎం కేసీఆర్ దళితబంధును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి కుటుంబాల్లో వెలుగులు పంచుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ పథకం ద్వారా నేడు ఎంతో మంది పారిశ్రామిక వేత్తలుగా మారి ఇతరులకు ఉపాధి మార్గాలు చూపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద అంబేద్కర్ భవనాన్ని కరీంనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నామని, ఈ భవనం దళిత విద్యార్థులకు చైతన్య వేదిక కావాలని, ఐఏఎస్, ఐపీఎస్లను తయారు చేసే కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో 8 కోట్లతో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దళితబంధు పథకంతో రాష్ట్రంలోని వేలాది మంది దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదిగాయని, ఇది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. అంబేద్కర్ను ఏ కులానికి, మతానికి పరిమితం చేయవద్దని, ఆయన ప్రపంచం గర్వించగదగిన మేధావి అన్నారు. కరీంనగర్లో అత్యాధునిక సౌకర్యాలతో అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్కు విన్నవించగా, అప్పటికప్పుడే స్పందించి ఒక ఎకరం స్థలం మంజూరు చేయడంతోపాటు భవన నిర్మాణానికి 8 కోట్లు కేటాయించడం దళితులపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
మేధావులు, దళితుల్లో అన్ని సంఘాలు కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని నిర్వహణ చేయాలని సూచించారు. అలాగే, నిర్వహణ కోసం షెట్టర్ల నిర్మిస్తామని, ముందు భాగంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంబేద్కర్ భవన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ముస్లిం కమ్యూనిటీ సెంటర్ను పరిశీలించి అన్ని హంగులతో నిర్మాణం జరుగాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. క్రిస్టియన్ల భవన నిర్మాణం కోసం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో భూమిని కేటాయించినట్లు చెప్పారు. మేయర్ వై సునీల్రావు మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్ దూరదృష్టితో ఆలోచించి నిర్మించిన అంబేద్కర్ భవనం రాష్ట్రంలోనే గొప్పగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. దళితుల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ఈ భవనం వేదికగా మారాలన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మేడి మహేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్గౌడ్, జడ్పీటీసీ పిట్టల కరుణ, భూక్య తిరుపతినాయక్, దళిత సంఘాల నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్లో అంబేద్కర్ భవనాన్ని రాష్ట్రంలోనే గొప్పగా నిర్మించి ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్కు దళితులమంతా రుణపడి ఉంటాం. దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన దళితబంధు పథకంతో వేలాది కుటుంబాల్లో వెలుగులు నిండాయి. గత పాలకులు, ప్రభుత్వాలు దళితుల గురించిన ఆలోచించిన సందర్భాలు ఎప్పుడూ లేవు. దళితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్న మంత్రి గంగులకు నాలుగోసారి భారీ విజయాన్ని అందించి కానుకగా ఇస్తాం.
కార్పొరేట్ కార్యాలయాన్ని తలదన్నే విధంగా అంబేద్కర్ భవనం రూపుదిద్దుకోవడం దళితులంతా గర్వించే రోజు ఇది. మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవ చూపడం ద్వారానే 30 ఏళ్ల నాటి అంబేద్కర్ భవన నిర్మాణానికి ఇప్పుడు మోక్షం కలిగింది. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే దళితులు సంతోషంగా ఉన్నారు. అన్ని వర్గాలను సమన్యాయంగా చూసే తెలంగాణ ప్రభుత్వానికి దళితులమతా రుణపడి ఉంటాం. రాబోయే రోజుల్లో అంబేద్కర్ భవనంను చైతన్య కేంద్రంగా మారుస్తాం.