చొప్పదండి పీహెచ్సీలో ఇప్పటివరకు 300 మందికి పరీక్షలుమహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి పూర్తిగా మహిళా సిబ్బందితో పరీక్షలు చేయిస్తుండగా మహిళాలోకం తరలివస్తున్నది. నిర్మొహమాటంగా సమస్యలు చెప్పుకుంటూ చికిత్స పొందుతున్నది. చొప్పదండి పీహెచ్సీలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఇప్పటికే 300 మంది పరీక్షలు చేయించుకోగా, ఉచితంగా మందులు అందించడంపై సంబురపడుతున్నది.
చొప్పదండి, మార్చి 29: మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న తెలంగాణ సర్కారు పెద్ద జబ్బులు దరి చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో మహిళా దినోత్సవం ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నది. మహిళా మెడికల్ అధికారుల నేతృత్వంలో ఈ కేంద్రాల్లో వైద్య పరీక్షలు చేయడంతో మహిళలు వారి సమస్యను నిర్మోహమాటంగా తెలియజేస్తున్నారు. మెడికల్ అధికారితో పాటు వైద్య పరీక్షలు చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్ అంతా మహిళా సిబ్బందే పని చేస్తున్నారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఉచితంగా మందులు అందజేసి. అవసరమైతే కరీంనగర్ ప్రభుత్వ దవఖానకు, ఇంకా అవసరమైతే హైదరాబాద్కు రిఫర్ చేస్తారు. వేలాది రూపాయాలు ఖర్చయ్యే వివిధ రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించడం, మందులు అందించడంపై మహిళాలోక హర్షం వ్యక్తం చేస్తున్నారు. చొప్పదండి నియోజక వర్గంలోని చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మహిళా ఆరోగ్య కేంద్రాలుగా ఎంపిక చేశారు. చొప్పదండి ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ప్రతి మంగళవారం వీటిల్లో మహిళలకు 8 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు.
ఆరోగ్య మహిళా కేంద్రాల్లో పలు రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు వైద్య సేవలు అందిస్తున్నారు. మహిళలకు పరీక్షలు నిర్వహంచిన అనంతరం వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీంతోపాటు వ్యాధిగ్రస్తుల రిపోర్టుల ఆధారంగా అందించే వైద్య చికిత్సల కోసం వైద్య సిబ్బంది వారిని పర్యవేక్షించే బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు. చొప్పదండిలో ఆరోగ్య మహిళ పథకం ప్రాంరంభమైన మూడు వారాల వ్యవధిలోనే 300 మంది మహిళలు రాగా, వైద్యులు పరీక్షలను చేసి మందులు అందించారు. సలహాలు, సూచనలు ఇచ్చి భరోసానింపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏం ఎప్పుడు జరుగుతుందో అని భయపడే అవసరం లేకుండా ముందస్తుగా అన్ని వ్యాధులను గుర్తించేందుకు వైద్యశాఖ ఉచితంగా పరీక్షలు నిర్వహించడం చాలాబాగుంది. ప్రైవేట్ దవాఖానల్లో వైద్యచికిత్సలు, పరీక్షలకు వేలల్లో ఖర్చవుతున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు నిర్వహించి సామాన్యుల్లో భయం తొలగిస్తున్నందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు.
-నర్మద , చొప్పదండి క్లస్టర్ ఏపీఎం
నేను నడుమునొప్పి, కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న. మేం పరీక్ష చేసుకోవాల్నంటే కరీంనగర్ ప్రైవే ట్ దవాఖాన్లకు పోయి పరీక్షలు చేసుకుందుము. ఈడ రూపాయి ఖర్సు లేకుండా పరీక్షలు చేసి మందులు ఇస్తున్రు. మాలాంటి బీదోళ్ల ఆడోళ్ల కోసం కేసీఆర్ సారు మంచి సౌలత్ జేసిండు. ఇప్పుడు పాణం మంచిగా లేకపోతే దూరం పోవుడు బాధ తప్పింది. కేసీఆర్ సారు సల్లగాండాలే
-పులి లక్ష్మి, పెద్దకుర్మపల్లి (చొప్పదండి)