ఉమ్మడి జిల్లాను వర్షం వదలడం లేదు. ఇప్పటికే నెలరోజుల్లో నాలుగైదుసార్లు కురిసిన వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చగా, ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వాన అతలాకుతలం చేసింది. వర్షంతో కోతకొచ్చిన వరి దెబ్బతిన్నగా, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మామిడికాయలు రాలిపోయాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లిలో గొర్రెలకాపరి పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాడు. – నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 30
రాజన్న సిరిసిల్ల/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ)/ ఓదెల ఏప్రిల్ 30: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఆదివారం కురిసిన వడగండ్ల వాన రైతాంగాన్ని ఆగం చేసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి, ముస్తాబాద్, వీర్నపల్లి, కోనరావుపేట, సిరిసిల్ల, తంగళ్లపల్లి, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలం, పెద్దపల్లి జిల్లా ఓదెల, కాల్వశ్రీరాంపూర్, మండలాల్లో కురిసిన వర్షంతో కోతకొచ్చిన వరి దెబ్బతిన్నది.
మామిడిపండ్లు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. పలు గ్రామాల్లో స్తంభాలు కూలిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడ్డది. ఈదురుగాలులతో ఓదెల మండలంలోని గుండ్లపల్లిలో ఓ ఇంటి రేకులు లేచిపోయాయి.