ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,07,894 మంది అభ్యర్థులకు గానూ, ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగిన పేపర్-1కు 87,876 మంది, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్-2కు 87,519 మంది హాజరయ్యారు. కాగా, అధికారులు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షా కేంద్రాలను పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. అభ్యర్థులు పరీక్ష రాస్తున్న విధానం, చీఫ్ సూపరింటెండెంట్ గదులను పరిశీలించారు. నిమిషం ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు.
– కమాన్చౌరస్తా, జూలై 1
తిమ్మాపూర్, జూలై 1: టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని శ్రీ చైతన్య, జ్యోతిష్మతి, వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు మోడల్ స్కూల్, మైనార్టీ గురుకులాల్లో సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్ష రెండు విడుతల్లో జరగ్గా ఉదయం 10 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30-5గంటల వరకు అభ్యర్థులు పరీక్ష రాశారు. అభ్యర్థులను గంటన్నర ముందే సెంటర్లోకి అనుమతించిన అధికారులు.. నిమిషం నిబంధన పాటించారు. దీంతో పలు సెంటర్లలో దాదాపు 30మంది వరకు అభ్యర్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. పరీక్షా కేంద్రాలను జిల్లా అధికారులు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కమిషనరేట్, తిమ్మాపూర్ సర్కిల్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.