Karimnagar | గంగాధర, సెప్టెంబర్ 11 : ఎస్సారెస్పీ పునర్జీవ పథకంని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని కన్నెపల్లి పంప్ హౌస్ నుండి గాయత్రి పంప్ హౌస్ కు నీటిని విడుదల చేసి, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరద కాలువకు నీటిని విడుదల చేసి, ఇక్కడి నుండి లింక్ కెనాల ద్వారా కాకతీయ కెనాల్కు సాగునీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. వరద కాలువ లింకు కెనాల్ నుండి కాకతీయ కెనాల్కు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ర్యాలపల్లి లింకు కెనాల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ పునర్జీవ పథకంలో భాగంగా వరద కాలువ లింక్ కెనాల్ నుండి కాకతీయ కెనాల్ కు సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వం సాగునీటిని విడుదల చేయకపోవడంతో కెనాల్ పరివాహక ప్రాంతాల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకునేందుకు అవకాశం ఉన్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదన్నారు.
వరద కాలువ లింక్ కెనాల్ ద్వారా కాకతీయ కాలువను అనుసంధానం చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం విజయవంతం కావడంతో వరద కాలువ జీవనదిలా మారిందని పేర్కొన్నారు. కేసీఆర్ హయంలో వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేయడానికి రూ.30 కోట్ల లింక్ కెనాల్ నిర్మించినట్లు గుర్తు చేశారు. వరద కాలువ 88.400 కిలోమీటర్ వద్దనుండి 3,006 క్యూసెక్కుల సామర్థ్యంతో మూడు కిలోమీటర్ల మేర వరద కాలువను తవ్వి కాకతీయ ప్రధాన కాలువ 97.460 కిలోమీటర్ వద్ద అనుసంధానం చేసినట్లు తెలిపారు. గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామ పరిధిలో వరద కాలువకు రెండు గేట్లను ఏర్పాటు చేసి ఇక్కడి నుండి చొప్పదండి, ధర్మపురి, కరీంనగర్, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలకు సాగు నీరు అందించవచ్చని తెలిపారు. వరద కాలువ లింకు కెనాల్ నుండి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.