అంగన్వాడీ లబ్ధిదారులకు సర్కారు తీపికబురందించింది. వారి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా మరో ముందడుగువేసింది. సన్నబియ్యంతో ఆహారం అందించాలని నిర్ణయించింది. సెంటర్లకు సన్నబియ్యం సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఈ నెలాఖరు నుంచే అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుండగా ఆయావర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. నిత్యం కోడిగుడ్డు, పప్పు, పాలు, బాలామృతం ఫ్లస్తో పౌష్టికాహారం అందిస్తున్నది. ఇదే కోవలో మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. ఇన్నాళ్లు అంగన్వాడీ లబ్ధిదారులకు దొడ్డుబియ్యంతో భోజనం పెడుతుండగా ఇప్పుడు సన్నబియ్యంతో ఆహారం అందించనున్నది. మే చివరి నుంచే అమల్లోకి తెచ్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. అందుకనుగుణంగా జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తుండగా, కేంద్రాలకు వచ్చే లబ్ధిదారుల్లో హర్షంవ్యక్తమవుతున్నది.
దొడ్డుబియ్యంతో నెరవేరని లక్ష్యం
ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి అనేక చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు బాలామృతం ప్లస్, గర్భిణులు, బాలింతలకు ఒకపూట భోజనంతో పాటు పాలు, గుడ్లు, అధిక ప్రోటీన్లు కలిగిన పిండి పదార్థాలు పంపిణీ చేస్తున్నది. అయితే, దొడ్డు బియ్యంతోనే భోజనం పెడుతున్నది. దీంతో చాలా మంది లబ్ధిదారులు పాలు, గుడ్లు, ఇతర ఆహార పదార్ధాలు మాత్రమే తీసుకెళ్తున్నారు. భోజనం మాత్రం చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. అన్ని జిల్లాల నుంచి ఐసీడీఎస్ అధికారులు నివేదికలు పంపారు.
దీంతో ప్రభుత్వం అంగన్వాడీల్లో కూడా సన్నబియ్యంతో వండిన భోజనమే వడ్డించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి నెలా అందించే ఇండెంట్ ప్రకారం కేంద్రాలకు ఈసారి నుంచి సన్నబియ్యమే సరఫరా చేయాలంటూ పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్న కోటాలో సన్నబియ్యాన్నే కేంద్రాలకు సరఫరా చేయనునున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కరీంనగర్ జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 46, 829 మందికి ప్రయోజనం చేకూరనుండగా, వీరిలో 36,328 మంది ఏడేళ్లలోపు చిన్నారులు, 10,501 మంది గర్భిణులు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ఇప్పటిదాకా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో దొడ్డుబియ్యంతో భోజనం పెడుతున్నది. ఇదే గొప్ప నిర్ణయం అనుకున్నాం. కానీ ఇప్పటి నుంచి సన్నబియ్యంతో ఆహారం పెట్డడాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. అందరికీ మేలు జేత్తున్న సీఎం కేసీఆర్ మాలాంటి వారెందరికో పౌష్టికాహారాన్ని అందించడం సంతోషకరం. ఇంతమంచి పనులు చేస్తున్న సారుకు రుణపడి ఉంటం.
– పద్మ, బాలింత, ముగ్దుంపూర్
గొప్ప నిర్ణయం ..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారందరూ పేదలే. గర్భం దాల్చి, ప్రసవానంతరం ఆర్థిక పరిస్థితుల కారణంగా బలవర్ధకమైన ఆహారం తీసుకోలేని పరిస్థితి. అలాంటి వారి మేలు కోరి ప్రభుత్వం సన్నబియ్యంతో భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే, కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుంది.
– చెరుకు లావణ్య, గర్భిణి, కోతిరాంపూర్