కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. ఆదివారం నూతన సచివాలయం ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 5544 మంది ఒప్పంద లెక్చరర్లు, ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఫైల్పై సంతకం చేయడంతో రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగ లోకం సంబురాల్లో మునిగితేలింది. తమ జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారంటూ ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసింది. ఇచ్చిన మాటకు కట్టుబడి రెగ్యులర్ చేసి మా కుటుంబాల్లో ఆనందం నింపారని కృతజ్ఞతలు తెలిపింది. జీవితాంతం రుణపడి ఉంటామని, భావోద్వేగంతో చెప్పింది.
కమాన్ చౌరస్తా/ విద్యానగర్, ఏప్రిల్ 30 : కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్కారు తీపి కబురు అందించింది. నూతన సచివాలయం ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమబద్ధీకరణ ఫైల్పై తొలిసంతకం చేయడంతో 23ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. నాడు ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఉద్యోగ సంఘాలు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40 విభాగాల్లోని 5544 మంది రెగ్యులర్ కానున్నారు. ఉన్నత విద్యాశాఖలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న జనరల్ జూనియర్ అధ్యాపకులు 2909 మంది, ఒకేషనల్ జూనియర్ అధ్యాపకులు 184 మంది, ఒకేషనల్ సీనియర్ ఇన్స్ట్రక్టర్లు ముగ్గురు రెగ్యులర్ కానున్నారు. అలాగే కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్లో మినిమం టైం స్కేల్ లెక్చరర్లు పది మంది, డిగ్రీ లెక్చరర్లు 270మంది రెగ్యులర్ అవుతారు. సాంకేతిక విద్య శాఖలో పనిచేస్తున్న 390మంది పాలిటెక్నిక్ లెక్చరర్లు, 131మంది వర్క్ షాప్ అటెండర్లు/ల్యాబ్ అటెండర్లు, వైద్య శాఖలో 837 మంది వైద్య సహాయకులు, ల్యాబ్ టెక్నీషియన్లు 179 మంది, ఫార్మసిస్టులు 58 మంది, 230 మంది సహాయ శిక్షణ అధికారులు రెగ్యులర్ కానున్నారు. క్రమబద్ధీకరణ దస్త్రంపై సంతకం చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాంట్రాక్ట్ లెక్చరర్లు పాలాభిషేకం చేయడంతో పాటు కృతజ్ఞత సభలను ఏర్పాటు చే సి జీవితాంతం ముఖ్యమంత్రి కేసీఆర్తో వెన్నంటి ఉంటామని, రుణపడి ఉంటామని నినదించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల, లెక్చరర్ల క్రమబద్ధీకరణ ఫైలుపై తొలి సంతకం పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. తెలంగాణ ఉద్యమంతో ఉద్యమ యోధుడిగా, 23 సంవత్సరాల నిరీక్షణకు తెరతెంపిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంట్రాక్ట్ లెక్చరర్ల కుటుంబాల తరపున ధన్యవాదాలు.
-షేక్ బికారి సాహెబ్, రసాయన శాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ
జూనియర్ కళాశాల, సారంగాపూర్ (జగిత్యాల అర్బన్)
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల, లెక్చరర్ల 23సంవత్సరాల నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో క్రమబద్ధీకరణ ఫైలుపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ పెద్దలకు, సహకరించిన అధికారులకు అందరికి హృదయ పూర్వక ధన్యవాదాలు., కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
-గగడం రచన, అర్థశాస్త్ర అధ్యాపకురాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మల్యాల (జగిత్యాల అర్బన్)
23 సంవత్సరాలుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు సేవలందిస్తూ, ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడిలా రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మమ్మల్ని రెగ్యులర్ చేయాలని ప్రతి ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాం. కానీ ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కాట్రాంక్ట్ ఉద్యోగులకు బాసటగా తొలి సంతకం చేశారు. ఎంతో ఆనందంగా ఉంది. దీంతో మా ఆరు వేల కాంట్రాక్ట్ అధ్యాపకుల కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి.
– లింగంపల్లి దేవేందర్, కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్రఉపాధ్యక్షుడు (కరీంనగర్ కమాన్ చౌరస్తా)
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషించదగ్గది. ఈ విషయంలో మేం ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. 20 సంవత్సరాలు ప్రభుత్వ కళాశాలలో సేవలందిస్తున్నాం. ఏ ప్రభుత్వాలు మమ్ములను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు నూతన సచివాలయం ప్రారంభం రోజున గొప్ప నిర్ణయం తీసుకుని మా జీవితాలను మంచి మార్గం వైపు తిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ కళాశాలలలను మరింత బలోపేతం చేసి, పేద విద్యార్థులకు ఉతన్న విద్య అందేలా కృషి చేస్తాం.
– కే సునీల్ కుమార్, కాంట్రాక్ట్ అధ్యాపకుడు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు (కరీంనగర్ కమాన్ చౌరస్తా)
23 ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న మేమంతా తీవ్ర ఆందోళనలో ఉన్నాం. సమైక్య పాలకులు ఏనాడూ మమ్మల్ని పట్టించుకోలేదు. అధైర్య పడకండీ మేమున్నామంటూ మంత్రి కేటీఆర్ మాకు ఆత్మైస్థెర్యం కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా క్రమబద్దీకరిస్తుందంటూ పదేపదే చెపుతూ వచ్చారు. మాకు సహకరించిన మంత్రి కేటీఆర్కు రాష్ట్రంలోని 3800 మంది కాంట్రాక్టు లెక్చరర్ల కుటుంబాల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంబేద్కర్ సచివాలయం ప్రారంభించిన అనంతరం క్రమబద్ధీకరణ ఫైల్పై తొలి సంతకం చేసి ఇచ్చిన మాటను నిలుబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
-శనిగరం శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు (రాజన్న సిరిసిల్ల)
గత 23 ఏళ్లుగా ఎన్నో ఆశలు పెట్టుకుని కాంట్రాక్ట్ లెక్చరర్లుగా కాలం వెల్లదీస్తున్నాం. ఉద్యోగ భద్రత ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో మాకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఎందరో ఇచ్చిన హామీలు బుట్టదాఖలయ్యాయి. రామన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు క్రమబద్ధీకరణ ఫైల్పై సీఎం కేసీఆర్తో సంతకం చేయించి మా జీవితాల్లో వెలుగులు నింపారు. మేము జీవితాంతం గుర్తుంచుకుంటూ అమాత్యుడికి రుణపడి ఉంటాం.
-జెల్ల సుమన్, తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు (రాజన్న సిరిసిల్ల)
20 ఏళ్లుగా కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. సీమాంధ్ర ప్రభుత్వాలు మాకు ఏం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులరైజేషన్ చేస్తూ, ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుపడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-తొడుపునూరి మధూకర్, ల్యాబ్ టెక్నీషియన్, టీ హబ్ కరీంనగర్ (విద్యానగర్)
క్రమబద్ధీకరణ వల్ల మా జీవితాల్లో వెలుగులు వచ్చాయి. దాదాపు 15 ఏళ్లుగా నిరీక్షిస్తున్న మాకు సీఎం కేసీఆర్ వల్ల భరోసా లభించింది. మేం చేస్తున్న సేవలను గుర్తించి మమ్మల్ని క్రమబద్ధీకరణ చేసినందుకు సంతోషంగా ఉన్నాం.
-రాఘవాచారి, ప్రభుత్వ బాలుర జూనియర్కళాశాల, మంథని
ఎన్నో ఏళ్లుగా క్రమబద్ధీకరణ కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న మాకు తెలంగాణ ప్రభుత్వంలో సరైన న్యాయం జరిగింది. సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలో మా కాంట్రాక్టు లెక్చరెర్లను క్రమబద్ధీకరిస్తూ తొలి సంతకాన్ని చేసి మా జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయనకు జీవితాంతం రుణ పడి ఉంటాం.
-జయ, కాంట్రాక్టు లెక్చరెర్, ముత్తారం.
కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించడంపై సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ ఆధ్వర్యంలో లెక్చరర్లు ఆదివారం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక ప్రభుత్వ కళాశాల ఆవరణలో స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరిపారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావులకు ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్లోని గీతా భవన్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం (475) ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.