Peddapally | అంతర్గాం, నవంబర్ 20: మహిళల రక్షణే లక్ష్యమని షీ టీం ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య అన్నారు. రామగుండం పోలీసు కమిషనర్ అదేశాల మేరకు గురువారం అంతర్గాం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్, ఎల్లంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలకు షీటీం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్థులు అవగాహన కలిగిఉండాలన్నారు.
ఎవరైనా చెడు గా మాట్లాడినా, ప్రవర్తించినా తల్లిదండ్రులకు చెప్పాలాని సూచించారు. మహిళల రక్షణ కోసం ప్రతీ రోజు బస్టాండ్, ప్రధాన చౌరస్తా, జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం సభ్యులు నిరంతరంగా అందుబాటులో ఉంటారని చెప్పారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్స్ మోసానికి గురవుతున్నారని, వాటికి జోలికి పోకుండా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి సమాచారమివ్వాలని, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని విజ్ఞప్తి చే చేశారు. ఈ కార్యక్రమం లో షీ టీం సభ్యులు మౌనిక, సురేష్, స్నేహలత, ప్రిన్సిపాల్ కల్పన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.