Chalmeda Lakshmi Narasimha Rao, Siricilla | వేములవాడ, ఆగస్టు 29 : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. అధికారంలోకి రాకముందు వంద రోజులలో అమలు చేస్తామన్న 420 హామీలు వెయ్యి రోజులు పరిపాలన గడుస్తున్న ప్రజలకు అందివ్వడంలో విఫలమైనందున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన నిరసన కార్యక్రమాల పిలుపులో భాగంగా శనివారం నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యా లపై పోరుబాట చేద్దామని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాకముందు 420 హామీలు ప్రకటించి వంద రోజులలో అమలు చేస్తామని మోసపూరితమైన పరిపాలన అందిస్తూ వెయ్యి రోజులు గడుస్తున్న అమలు చేయకపోవడాన్ని క్షేత్రస్థాయిలో నిలదీయాలని అన్నారు.
వైఫల్యాలతో పాటు అవినీతి అక్రమాలను కూడా ప్రశ్నించాలని సూచించారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్ మోసంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట చేపడుతున్న క్రమంలో పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మండలాల అధ్యక్షులు మల్యాల దేవయ్య, మ్యాకల ఎల్లయ్య, గోసుకుల రవి, సీనియర్ నాయకులు మ్యాకల రవి, మామిడిపల్లి రవికుమార్, నిజయోజకవర్గంలోని సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పట్టణ సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్ తదితరులు పాల్గొన్నారు.