వేములవాడ రూరల్, నవంబర్ 30: వేములవాడ, వేములవాడ రూరల్ మండలంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ నాయకుల హంగామా కనబడింది. ఓటు వేసేందుకు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చారు. రుద్రవరంలో 95 ఏళ్ల వృద్దురాలు లక్ష్మీ తన ఓటు హక్కును వినియోగించుకుంది. మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు తన ఓటు హక్కును రుద్రవరంలో వినియోగించుకున్నాడు. వికలాంగులు, వృద్దుల కోసం ప్రత్యేకంగా ఓటు వేసేందుకు వీల్ చేర్ సౌకర్యంతో పాటు సిబ్బందిని నియమించటంతో ఇబ్బందులు తప్పాయి.
పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉత్సహాంగా కనబడటంతో పాట కారుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పోలింగ్ కేంద్రాలకు సెల్ఫోన్ అనుమతి లేకపోవడంతో బయటనే సెల్ఫోన్లు ఉంచి ఓటు వేసేందుకు వెళ్లారు. తిప్పాపూర్, నాంపెల్లి తదితర గ్రామల్లో 5 గంటల వరకు కూడ క్యూలైన్లో ఓటర్లు నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రశాంతమైన వాతవారణంలో పోలింగ్ జరగటంతో పోలీసులు ఊపిరిపిల్చుకున్నారు.
కాగా డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ కృష్ణకుమార్, ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో పోలీస్ బంద్బస్త్ నిర్వహించటంతో పాటు పెంట్రోలింగ్ వాహనలు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటించి, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
రుద్రంగి, నవంబర్ 30: రుద్రంగి మండల కేంద్రంలో డీఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత బలగాల మధ్య ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మండలంలో మొత్తం 8288 ఓటర్లుండగా 7 బూత్లలో 6205 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 74.86 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహరావు మండల కేంద్రంలోని పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, సర్పంచ్ తర్రె ప్రభలత ఓటు హక్కును వినియోగించుకున్నారు
కోనరావుపేట, నవంబర్ 30: మండల వ్యాప్తంగా ఉదయం పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు క్యూలో బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు ప్రధానంగా దివ్యాంగులకు వీల్సైకిళ్లు ఏర్పాటు చేసి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్వోలు, వైద్యసిబ్బంది ఓటర్లకు తమ సేవలను అందించారు.
కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు సమస్యాత్మకమైన కేంద్రాల వద్ద పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహించారు. ఎస్ఐ ఆంజనేయులు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనునిత్యం పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేశారు. మండలంలో 16803మంది పురుషులు, 17447మంది మహిళలు మొత్తంగా 34250 మంది ఓటర్లు ఉన్నారు.
కోనరావుపేట, నవంబర్ 30: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ స్వగ్రామంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. మల్కపేటలోని జానకీదేవి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుతో పాటు కుటుంబసభ్యులు సునీల, నివేదిత, నిహారిక, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్, కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు, మాజీ న్యాయశాఖ మంత్రి చల్మెడ ఆనందరావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామన్నపేటలో జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, రాఘవరెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు, కొలనూర్లో డీపీఆర్వో మామిండ్ల దశరథం, మల్కపేట ఎంపీపీ చంద్రయ్యగౌడ్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వీర్నపల్లి, నవంబర్30: మండలంలోని కంచర్ల, వన్పల్లిలో ఉదయం ముప్ఫై నిమిషాల పాటు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ అలస్యంగా మొదలైంది. బావుసింగ్నాయక్తండా పోలింగ్ బూత్లో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఏజెంట్ వివరాలు సరిగా లేకపోవడంతో ఎన్నికల అధికారులు బయటకు పంపించారు. ఎస్ఐ నవత ఇరు పార్టీల నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. వన్పల్లి పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు వరుస సంఖ్యలో లేకపోవడంతో గ్రామస్తులు అందోళన చేశారు.
దీంతో పోలింగ్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న సెక్టార్ అధికారి నరేశ్కుమార్ నేతృత్వంలో సిబ్బంది సరిచేయడంతో తిరిగి పోలింగ్ ప్రారంభమైంది. రంగంపేట, బావుసింగ్నాయక్తండా, లాల్సింగ్తండా, గర్జనపల్లి పోలింగ్ కేంద్రాలను ఎన్నికల వ్యయ పరిశీలకుడు మణిగండస్వామి పరిశీలించారు. పలువురు మహిళలు చిన్నారులతో క్యూ లైన్లో వేచి ఉండడాన్ని గమనించిన ఆయన వారికి ప్రాధన్యమివ్వాలని సిబ్బందికి సూచించారు.