రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన ఎన్నికల సంఘం, తాజాగా బోగస్ ఓట్లపై దృష్టిపెట్టింది. ఓవైపు అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగకుండా చూడాలని సూచిస్తూనే, మరోవైపు ‘బోగస్’ తొలగించేందుకు చర్యలు చేపట్టింది. అందుకోసం ఒకే ఇంటి నంబర్లో ఆరుకు పైగా ఓట్లుంటే.. సదరు ఇండ్లకు వెళ్లి పరిశీలించాలని ఆదేశించింది. ఏ మాత్రం అనుమానమున్నా.. పరిశీలన సమయంలో సరైనా ధ్రువీకరణ పత్రాలు చూపించకయినా బూత్లెవల్ అధికారులకు అక్కడికక్కడే నిర్ణయం తీసుకునే అవకాశమిచ్చింది. దీంతోపాటు బోగస్ ఓట్లను పూర్తిగా కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే తొలగించిన ఓటర్ల జాబితాను మరోసారి పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు అప్రమత్తమైన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు ఇప్పటికే సదరు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కాగా, గడిచిన నాలుగేళ్లలో చూస్తే ఉమ్మడి జిల్లాలోని పదమూడు నియోజకవర్గాల్లో 1.85 లక్షల కొత్త ఓటర్లు పెరిగినట్లు తాజా జాబితా గణాంకాలు చెబుతుండగా, అన్ని కోణాల్లో పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు.
కరీంనగర్, మే20 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గత జనవరిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వివరాలను నిశితంగా పరిశీలిస్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఓటర్ల సంఖ్య పెరిగింది. 2018 ఎన్నికల నుంచి 2023 జనవరి నాటికి అంటే నాలుగేళ్లలో 1,85,496 మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకోగా, అధికార యంత్రాంగం అందుకు కారణాలను ఇప్పటికే వెల్లడించింది. ఆన్లైన్లో దరఖాస్తులను పరిశీలించడం, అలాగే ఇంటింటా సర్వే చేయడం, అర్హులను ఓటర్ జాబితాలో చేర్చడం, ఓటుపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల నేపథ్యంలో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలిపింది. అందుకు సంబంధించిన ఓటరు జాబితాను జనవరి మొదటి వారంలో విడుదల చేయగా, దీనిపై ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చ జరుగుతూనే ఉన్నది. గతంలో ఏనాడూ లక్షకు మించి ఓటర్ల సంఖ్య పెరగలేదు. కానీ, జనవరి జాబితా చూస్తే.. అమాంతం 1.85 లక్షలు పెరగడంపై రాజకీయ పార్టీల్లో చర్చ నడుస్తున్నది.
బోగస్ ఓట్ల తొలగింపు పక్రియ పకడ్బందీగా చేపట్టాలని, ఇదే సమయంలో అర్హులైన ఏ ఒక్క ఓటర్కు అన్యాయం జరగవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆ మేరకు రంగంలోకి దిగిన అధికారులు, బోగస్ ఓట్లకు కళ్లెం వేయడంతోపాటు తుది జాబితా రూపొందించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోగస్ ఓట్ల తొలగింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టారు. అందుకు సంబంధించి శిక్షణతోపాటు పూర్తి క్లారిటీ ఇవ్వడంతో బూత్లెవల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. కుటుంబంలో ఎక్కువ ఉన్న ఓట్లు ఉన్నా.. నిబంధనలకు విరుద్ధంగా రెండు ఓట్లు ఉన్నా వెరిఫికేషన్ చేస్తున్నారు. ఒకే ఇంటి నంబర్లో ఆరు ఓట్లకుపైగా ఉన్న ఓటర్ల జాబితాను జిల్లా యంత్రాంగం అందించగా, ఆ జాబితా ఆధారంగా సదరు ఇండ్లకెళ్లి పరిశీలిస్తున్నారు. ఆ ఓటర్లు ఆ ఇంటిలో ఉన్నారా..? లేరా..? అని చెక్ చేస్తారు. ఒక వేళ ఉంటే ఓటర్ల ధ్రువపత్రాలను చెక్ చేస్తున్నారు. సదరు ఓటర్ ఆ ఇంటిలో లేకపోయినా, లేదా అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వకపోయినా ఆ ఓటుపై నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకోవడానికి కారణాలను సైతం అదే ఫార్మాట్లో వివరిస్తారు. అలాగే రెండు చోట్ల ఓటు ఉంటే సమాచారం ఇచ్చి, వారు కోరుకున్న చోట ఓటు ఉంచి మిగిలిన దానిని తొలగించనున్నారు. వీటితోపాటు గతంలో జరిగిన వెరిఫికేషన్లో కొన్ని పేర్లను తొలగించారు. ఆ పేర్లు కరెక్టుగా ఉన్నాయా..? లేవా..? అన్న వివరాలను ప్రస్తుతం పరిశీలించాలని ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు ఒక వేళ ఏదైనా పొరపాటు ఉంటే.. వెంటనే వాటిని సవరించి అర్హులకు అన్యాయం జరగకుండా ఓటర్ జాబితాలో చేర్చనున్నారు.
2014తో పోలిస్తే 2018 ఎన్నికల సమయం నాటికి ఓటర్ల సంఖ్య తగ్గింది. 2014కు 2018కి మధ్య నాలుగేళ్ల సమయం ఉన్నా.. అప్పట్లో ఓటర్ల సంఖ్య పెరగలేదు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో ఉన్న ఓటర్ల సంఖ్య 28,27,556 ఉండగా, 2018 ఎన్నికల సమయంలో ఆ సంఖ్య 27,87,549కి తగ్గింది. అంటే రెండు ఎన్నికల మధ్య 40,007 మంది ఓటర్లు తగ్గారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికకు మరో ఎన్నికకు మధ్య ఓటర్ల సంఖ్య పెరగాలి. కానీ, తగ్గింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ సమయంలో బోగస్ ఓట్లను పకడ్బందీగా తొలగించడం వల్లే ఓట్ల సంఖ్య తగ్గిందని అధికారులు అప్పుడే స్పష్టం చేశారు.
నిజానికి 2018 ఎన్నికల సమయంలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య 27,87,549 ఉంటే.. జనవరిలో విడుదల చే సిన జాబితా ప్రకారం 29,73,045 మంది ఉన్నారు. అంటే నాలుగేళ్లలో 1,85,496 మంది పెరిగారు. ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఓటర్ల సంఖ్యను నిశితంగా పరిశీలిస్తే కరీంనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా అంటే 35,243 మంది ఓటర్లు పెరిగారు. 26,148 మంది ఓటర్లతో హుజూరాబాద్ రెండో స్థానం లో ఉన్నది. మిగిలిన నియోజకవర్గాల వారీగా చూస్తే.. కోరుట్లలో 7,793, జగిత్యాలో 10,668, ధర్మపురిలో 4,195, రామగుండం లో 15,570, మంథనిలో 13,368, పెద్దపల్లిలో 18,123, చొప్పదండిలో 15,339, వే ములవాడలో 15,803, సిరిసిల్లలో 9,493, మానకొండూర్లో 9,095, హుస్నాబాద్లో 4,657 మంది ఓటర్లు పెరిగారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పె ట్టుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇప్పటి నుంచే ఓటర్ జాబితాను పరిపూర్ణంగా త యారు చేయడంపై దృష్టిపెట్టింది. ఈ విషయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో కొందరి ఇండ్లళ్లో 20నుంచి 100కుపైగా ఓట్లు ఉన్నట్లు వెలుగుచూడడం, వాటిపై తరచూ ఫిర్యాదులు రావడం వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలని, సదరు ఇండ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారయంత్రాంగం, కొత్త సాఫ్ట్వేర్ ఆధారంగా ఒకే ఇంటి నంబర్లో ఆరు ఓట్లకుపైగా ఉన్న ఓటర్ల వివరాల జాబితాను తయారు చేసింది. వీటిని ఇప్పటికే బూత్లెవల్ అధికారులకు పంపించింది.