మిగ్జాం తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి జిల్లాపై పడింది. రెండు రోజులుగా వణుకు పుట్టిస్తున్నది. వాతావరణంలో సంభవించిన మార్పులతో మంగళవారం రాత్రి నుంచే అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చలి తీవ్రత పెరగడంతోపాటు రోజంతా చల్లని ఈదురు గాలులు వీస్తున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల పవనాలతో చలి తీవ్రత మరింత పెరిగే ముప్పు కనిపిస్తున్నది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలకు పడిపోగా, ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వృద్ధులు, చిన్నారులు అతి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, మారిన వాతావరణ మార్పులతో పంటలకు ఎలాంటి ముప్పు ఉండదని అధికారులు చెబుతున్నారు.
కరీంనగర్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : మిగ్జాం తుఫాన్ కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు రోజులుగా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకు అంతంత మాత్రంగానే ఉన్న చలి తీవ్రత పెరిగింది. మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు 26కు పడిపోయాయి. వర్షానికి తోడు ఈదురు గాలులు వీస్తున్నాయి. రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నది. సోమవారం రాత్రి నుంచే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
మంగళవారం తెల్లవారు జాము నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చలి తీవ్రత మరింత ఎక్కువైంది. మూడు నాలుగు రోజుల కిందటి వరకు పగటి ఉష్ణోగ్రతలు 29-30 డిగ్రీలు నమోదవగా సోమవారం నుంచి పడిపోతున్నాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోవడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ఏడాది శీతా కాలంలో అక్టోబర్, నవంబర్లో చలి తీవ్రత అంతగా కనిపించ లేదు. మిగ్జాం తుఫాన్ ప్రభావం కారణంగా ఈ ఏడాది మొదటిసారిగా ఇంతగా చలి పెడుతోంది. ఉత్తరాది నుంచి శీతల పవనాలు వీస్తున్న కారణంగా ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుఫాన్ ప్రభావం తగ్గినా చలి తీవ్రత కొనసాగవచ్చని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
పంటలకు ముప్పు ఉండదు..
మారిన వాతావరణ పరిస్థితులు యాసంగి పంటల సాగుకు ఎలాంటి నష్టం కలిగించకపోవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్లో రైతులు ఇంకా వరినార్లు పోస్తున్నారు. మక్క, పల్లి, తదితర ఆరుతడి పంటలకు ఈ వాతావరణం వల్ల ఎలాంటి నష్టమూ ఉండదని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజులు వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయని చెబుతున్నారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తగ్గితే వర్షాలు తగ్గే అవకాశం ఉంటుందని, ఈ వర్షాల వల్ల చలి తీవ్రత పెరగడమే గానీ, పంటలకు ఎలాంటి ముప్పూ ఉండదని అంటున్నారు.