వేములవాడ రాజన్న ఆలయంలో అమ్మవారికి సమర్పించుకునే ఒడి బియ్యానికి డిమాండ్ పెరిగింది. వేలంపాటలో గతానికంటే రెట్టింపు ధర పలికింది. రాజన్న దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి, అనుబంధ బద్ది పోచమ్మ అమ్మవారికి కూడా ఒడి బియ్యం సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో 2021-23 ఆర్థిక సంవత్సరంలో టెండర్ ప్రక్రియను ఆలయ అధికారులు ప్రారంభించారు. గతంలో 48 లక్షలు పలుకగా, ప్రస్తుతం 2023-25 (రెండు సంవత్సరాలకు) గాను కోటీ 22 లక్షల వేలం పాటతో హకులు దకించుకున్నారు.
– వేములవాడ, జూలై 10
వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం శ్రీ రాజరాజేశ్వర దేవి అమ్మవారికి , అనుబంధ బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ఒడి బియ్యపు సమర్పిస్తారు. వీటిలో బియ్యం, ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూర కూడా ఉంటాయి. కాగా, ఒడి బియ్యాన్ని సేకరించుకునే ప్రక్రియను 2021-23 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ఆలయ అధికారులు ప్రారంభించారు. దీంతో 48 లక్షలకు దక్కించుకోగా వారి హక్కులు ఈ ఏడాది జనవరి వరకు ముగిశాయి. మళ్లీ టెండర్, వేలంపాట నిర్వహించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ యేడాది జనవరి 7 నుంచి, మార్చి 9 వరకు ఆలయ అధికారులే ఒడిబియ్యం సేకరణ నిర్వహించారు. రెండు నెలల్లో దాదాపు 200 క్వింటాళ్ల బియ్యం, 5 క్వింటాళ్ల ఎండు కొబ్బరి సమకూరింది. తర్వాత నిర్వహించిన 2023-25 రెండు సంవత్సరాల హకులకు గాను నిర్వహించిన వేలంపాటలో ఒడిబియ్యం కోటీ 22 లక్షల 55 వేల ధర పలికింది.
ఒడిబియ్యానికి డిమాండ్ ఉన్నది
భక్తులు రాజరాజేశ్వరి దేవి, బద్ది పోచమ్మ అమ్మవార్లకు ఒడి బియ్యం సమర్పించుకునే ఆనవాయితీ ఉంది. ఈ క్రమంలో ప్రతి నెలా దాదాపు 100 క్వింటాళ్లకు పైగా బియ్యం, కొబ్బరి సమకూరుతుంది. రెండోసారి నిర్వహించిన వేలంపాటలో రెట్టింపుకు పైగా ఆదాయం రావడమే ఇందుకు నిదర్శనం. ఒడి బియ్యం, ఎండు కొబ్బరికి బాగా డిమాండ్ ఉంది.
– గోలి శ్రీనివాస్ పర్యవేక్షకుడు, రాజన్న ఆలయం