గంగాధర, జనవరి 6 : తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని, దేశం ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో దేశం మొత్తం బీఆర్ఎస్ వైపే చూస్తున్నదని చెప్పారు. బూరుగుపల్లిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చొప్పదండి నియోజకవర్గాన్ని 650 కోట్లతో అభివృద్ధి చేశానని తెలిపారు. ప్రభుత్వం నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 54 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం 10.80 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. పంచాయతీరాజ్ రోడ్ల కోసం 22 కోట్లు, ఆర్అండ్బీ రోడ్ల కోసం 6.15 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో పల్లె దవాఖానలను ఏర్పాటు చేయడంతో పాటు, ఎంబీబీఎస్ డాక్టర్ను నియమించిందన్నారు. పల్లె దవాఖాల నిర్మాణం కోసం 16 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు. 70 ఏండ్ల చరిత్రలో చొప్పదండి మండల కేంద్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు లేడని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి 72 కోట్ల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి 100 కోట్లు కేటాయించారని, మద్దుట్ల లిఫ్టులు, నారాయణఫూర్ రిజర్వాయర్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. మధురానగర్ చౌరస్తాలోని నాలుగు రోడ్లను అభివృద్ధి చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో దేశం మొత్తం బీఆర్ఎస్ వైపు చూస్తున్నదని, కేసీఆర్ ప్రధానమంత్రి అయితే తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశం మొత్తం అమలవుతాయనే నమ్మకం ప్రజల్లో కలుగుతున్నదన్నారు. తెలంగాణ లాంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు శక్తులకు ధారదత్తం చేస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, ఆర్బీఎస్ కోఆర్డినేటర్లు, కొండగట్టు బోర్డు డైరెక్టర్లు, వైస్ ఎంపీపీలు, వైస్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.