కరీంనగర్ ముకరంపుర, ఏప్రిల్ 1 : కాంగ్రెస్ సర్కారు పరిశ్రమలపై కరెంటు కత్తి దూస్తున్నది. ఇప్పటికే ఒడిదుడుకుల మధ్య ఇండస్ట్రీలను నడుపుతున్న నిర్వాహకులకు కొత్తగా అమలులోకి వచ్చిన చార్జీలతో మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు టైం ఆఫ్ డే (టీవోడీ) టారిఫ్ విధానం మరింత భారంగా మారనున్నది. ఇప్పటికే ముడి సరుకు, రసాయనాలు, పరిశ్రమల నిర్వహణకు అవసరమైన పరికరాలు, యంత్రాల విడిభాగాలు, ఇతర వస్తువుల దిగుమతి తడిసి మోపెడవగా, కొత్తగా అమలులోకి వచ్చిన విద్యుత్ చార్జీల టారిఫ్ పరిశ్రమల పాలిట గుదిబండలా మారనుంది. హెచ్టీ విద్యుత్ కనెక్షన్లు ఉన్న 6 కేటగిరీల పారిశ్రామిక వర్గాలను కలవరపాటుకు గురిచేస్తున్నది. అయితే, పరిశ్రమల కరెంట్ వాడకంలో మార్పులు చేయగా, గ్రానైట్, అనుబంధ పరిశ్రమలకు ఇబ్బందిగా ఉంటుందని పరిశ్రమల నిర్వాహకులు వాపోతున్నారు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్వహిస్తున్న పరిశ్రమలను 24గంటలు నిర్వహిస్తేనే గిట్టుబాటు అవుతుందని, కొత్త విద్యుత్ చార్జీల విధింపుతో పరిశ్రమలు గడ్డు పరిస్థితి ఎదురోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో 1.40 కోట్ల అదనపు భారం
జిల్లా వ్యాప్తంగా మొత్తం 837 సర్వీసులు ఉన్నాయి. అందులో హెచ్టీ-1 కేటగిరీలో 585, హెచ్టీ కేటగిరీ-2 లో 141, హెచ్టీ కేటగిరీ-3లో 2, హెచ్ టీ-9 కేటగిరీలో ఒక కనెక్షన్ ఉంది. అయితే, జిల్లాలో అత్యధికంగా గ్రానైట్, వ్యవసాయ, పౌల్ట్రీ అనుబంధ పరిశ్రమలు ఎకువగా ఉన్నాయి. సింహ భాగం గ్రానైట్, గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలే ఉన్నాయి. సుమారు 400 గ్రానైట్ కట్టింగ్ ఫ్యాక్టరీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఇకడ ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం కొత్త హెచ్టీ విద్యుత్ చార్జీల విధానంలో ఒకో పరిశ్రమపై సగటున 30 వేల నుంచి 35 వేల వరకు అదనపు విద్యుత్ చార్జీల భారం పడనున్నది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఇప్పటికే పరిశ్రమలకు అవసరమైన పరికరాల దిగుమతి నిలిచిపోవడం, ఇకడి నుంచి విదేశాలకు గ్రానైట్ స్లాబ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో పరిశ్రమ సంక్షోభ స్థితిలో ఉందని, ఈ తరుణంలో టైంఆఫ్డే(టీవోడీ) టారిఫ్ భారం మరింత మోయలేనిదిగా మారనున్నదని పరిశ్రమల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
టారిఫ్ ఇలా
కొత్తగా వర్తింపజేస్తున్న విధానాన్ని టైంఆఫ్డే(టీవోడీ)గా వ్యవహరిస్తున్నారు.
ప్రతిరోజూ ఉదయం సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య కరెంటు వినియోగించే 6 రకాల హెచ్టీ కనెక్షన్లకు సాధారణ చార్జీ కన్నా ఒక యూనిట్కు 1.50 ఎకువగా వసూలు చేయాలని ఈఆర్సీ ఆదేశించింది.
ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంటు వినియోగిస్తే 6 కేటగిరీల వారికి 0.50 పైసల ప్రోత్సాహకం అందించి, అంతే మేరకు చార్జీ తగ్గిస్తారు.
ఈ ప్రోత్సాహకం ఇప్పటి వరకు యూనిట్కు ఒక రూపాయి ఉండగా ప్రస్తుతం 0.50 పైసలకు తగ్గించారు.
రోజూ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కరెంటు వినియోగిస్తే, ఈ 6 కేటగిరీలకు గతంలో మాదిరిగానే చార్జీలు ఉంటాయి.