అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం నజర్ పెట్టింది. ఎక్కడ పరిమితికి మించినా ఉక్కుపాదం మోపేందుకు కొత్తగా సాఫ్ట్వేర్తోపాటు నయా విధానాలను అమల్లోకి తెచ్చింది. అందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థి లెక్కలకు సంబంధించి పది బృందాల ద్వారా తనిఖీలు చేయడమే కాకుండా.. యాభై అంశాల్లో లెక్కలు సేకరించి, ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది.
సదరు వివరాలు ఏరోజుకారోజు కలెక్టర్ నుంచి మొదలు.. రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించేలా చర్యలు తీసుకున్నది. ఈసీ ఆదేశాలతో ఇప్పటికే రంగంలోకి దిగిన యంత్రాంగం, అభ్యర్థుల కదలికలపై ఫోకస్ పెంచింది. మరోవైపు ప్రతి జిల్లాలోనూ చెక్పోస్టులను ఏర్పాటు చేయడంతోపాటు ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నది. ఏదేమైనా ఈ ఎన్నికల్లో అభ్యర్థులు నిబంధనలు పాటించేలా ఈసీ తీసుకుంటున్న చర్యలతో ఉత్కంఠ కనిపిస్తున్నది.
కరీంనగర్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వివిధ అవసరాల కోసం చేసే ఖర్చులపై ఎన్నికల సంఘం మూడో కన్ను తెరవబోతుంది. షెడ్యూల్ రావడంతో రాజకీయ పార్టీలు చేసే పలు రకాల వ్యయంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు అవసరమైన ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడా రూపకల్పన చేసి, ఇప్పటికే జిల్లాలకు పంపినట్లు వెల్లడిస్తున్నారు. గతంలో పోటీ చేసే అభ్యర్థులు అందించే ఖర్చుల వివరాలు మాత్రమే ఎన్నికల అధికారులు నమోదు చేసుకునేవారు.
ఇకనుంచి వారి ప్రతి కదలికపై కూడా నిఘా ఉండబోతున్నట్లు పేర్కొంటున్నారు. వారందించే ఖర్చుల వివరాలు క్షేత్రస్థాయిలో సరిపోల్చుకునేందుకు రహస్య పరిశీలన చేపట్టనున్నట్లు చెబుతున్నారు. వాటిని షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్లో నమోదు చేసేందుకు క్యాండిడేట్స్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సిస్టం అమలు చేయనున్నారు. గతంలో కేవలం కొన్ని ప్రధాన అంశాలకు సంబంధించి మాత్రమే తనిఖీ బృందాలను ఏర్పాటు చేసేవారు. ఆ బృందాల సభ్యులు ఎన్నికల ప్రచార సమయంలో మాత్రమే రూట్ల వారీగా తిరుగుతూ, అభ్యర్థుల వ్యయ పరిశీలన చేసేవారు. వారి ఖర్చుల సమాచారం పూర్తి స్థాయిలో లభించేది కాదు.
లెక్కకు మిక్కిలి ఖర్చు పెడుతున్నా అభ్యర్థులు చూపిన ఖర్చులనే స్థానిక అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపేవారు. దీంతో, ఎన్నికల ఖర్చు కూడా విచ్చలవిడిగా పెరుగుతుండడంతో దీనిని అరికట్టే క్రమంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఎన్నికల ఖర్చుల వివరాలను అభ్యర్థులు నిర్ధారిత ఫార్ములాలో జిల్లా ఎన్నికల అధికారులకు అందజేసేలా మందుగానే చర్యలు చేపట్టేలా ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు.
ప్రచార క్రమంలో నిఘా వ్యయాన్ని లెక్కించేందుకు పది విభాగాలను ఏర్పాటు చేయనుండగా, వాటి పరిధిలో యాభై అంశాల వారీగా ఖర్చు లెక్కించేలా నిఘా బృందాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకునే వ్యక్తులకు రోజు వారీగా చెల్లించే భత్యం, ఒక్కో రోజుకు ప్రచారానికి అయ్యే ఖర్చును క్షేత్రస్థాయిలో లెక్కించనున్నారు. అభ్యర్థులు అందించే వ్యయ వివరాలు, క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం కూడా సాఫ్ట్వేర్ ద్వారా అప్లోడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వివరాలు సరిపోలితేనే అప్లోడ్ అవుతాయని, లేకుంటే రిజెక్ట్ కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరస్కరణకు గురైతే వెంటనే సంబంధిత అభ్యర్థికి అందుకు గల కారణాలు వెల్లడిస్తూ, మరోసారి సరైన వివరాలు అందించాలని సూచించనున్నట్లు చెబుతున్నారు.
కొత్త సాఫ్ట్వేర్ వినియోగంతో జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కూడా ఏకకాలంలో అభ్యర్థుల ఖర్చులను పరిశీలించే అవకాశముంటుందని, దీంతో, అభ్యర్థులు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించే అవకాశాలుంటాయనేది ఎన్నికల అధికారుల భావన. గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రతి అసెంబ్లీ నియోజకవర్ంగ వారీగా క్షేత్రస్థాయి పరిశీలన బృందాలను విభాగాలు, అంశాల వారీగా ఏర్పాటు చేయనుండగా, ఇప్పటికే ఆయా ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతాధికారులకు తమ సిబ్బందిని కేటాయించాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం సమాచారం పంపినట్లు తెలుస్తోంది.
ఒకవైపు అభ్యర్థుల వ్యయాలపై డేగకన్ను వేస్తూనే మరోవైపు.. డబ్బుతోపాటు మత్తు పదార్థాలు వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాగం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఆయా జిల్లాలు, నియోజకవర్గాలకు నలువైపులా చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన రహదారులపై 22 చోట్ల చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పోలీసులు… ఇప్పటికే సంబంధిత స్థలాలను గుర్తించి 17 చోట్ల ఏర్పాటు చేశారు. వీటితో పాటు.. ఈసారి పోలీసులు కొత్త పద్ధతిలో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
చెక్పోస్టులకు మాత్రమే పరిమితం కాకుండా.. ప్రధాన రహదారులు, మండల కేంద్రాల పరిధిలో ఆకస్మిక చెక్ పోస్టులను ఏర్పాటుచేసి.. పకడ్బందీగా తనిఖీలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న పోలీసు యంత్రాగం.. ఏ బృందం ఏరోజు ఎక్కడికి వెళ్తుందన్న విషయాన్ని మాత్రం.. చాలా సీక్రెట్గా ఉంచనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి లావాదేవీలు జరిగినా.. ఒకచోట కాకుంటే మరోచోట పట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
3,797 పోలింగ్ కేంద్రాలు
ఓటర్ల జాబితాను ప్రకటించిన ఎన్నికల సంఘం. వాటికి అనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,797 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నది. ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక పరిస్థితులు గత ఎన్నికల్లో జరిగిన ఒడిదొడుకులన్నింటినీ పరిగణలోకి తీసుకొని బూత్లను ఏర్పాటు చేశారు. వీటిలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను ఇప్పటికే గుర్తించి.. ఎక్కడ ఎలాంటి పొరపాట్లూ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
దీంతోపాటు బైండోవర్లను ఇప్పటికే పెంచారు. ఇంకోవైపు.. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చట్టపరంగా చేపట్టే చర్యలపై పలువురు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. నిర్ణయించిన పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఏర్పాట్ల కోసం ప్లాన్చేసి రెడీగా ఉంచిన అధికారులు వృద్ధులు, దివ్యాంగులు కూడా పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు హకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.