‘కాంగ్రెస్కు అధికారమిస్తే వ్యవసాయం అంధకారమవుతది. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ను ఖతం చేస్తేనే మనకు న్యాయం జరుగతది’ అంటూ రైతాంగం ముక్తకంఠంతో నినదించింది. వ్యవసాయంపై అవగాహన లేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్రెడ్డి రైతు వ్యతిరేకి అని మండిపడ్డది. ఉచిత కరెంట్పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను నాలుగో రోజు గురువారం రైతు వేదికల సాక్షిగా ఎండగట్టింది. ఆయన ముక్కు నేలకు రాసి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ‘మూడు గంటల కాంగ్రెస్ మాకొద్దు. 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆరెఎస్సే ముద్దు’ అంటూ తీర్మానాలు చేసింది. రేవంత్కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ నాయకులను ఊరి పొలిమేర దాకా తరిమికొడుతామని తేల్చిచెప్పింది.
– కరీంనగర్, జూలై 20(నమస్తేతెలంగాణ)
కరీంనగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఉచిత కరెంట్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ వైఖరిపై రైతాంగం ఆగ్రహం చల్లారడంలేదు. 3 గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ను పాతరేస్తామని నినదిస్తున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతు వేదికల సాక్షిగా రైతులు నిరసనలు తెలుపుతున్నారు. మూడురోజులుగా వేలాదిమంది తరలివచ్చి కాంగ్రెస్ వైఖరిని తూర్పారబడుతున్నారు. నాలుగోరోజు గురువారం కూడా రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించుకున్నారు. ‘కాంగ్రెస్కు ఓటేస్తే కటిక చీకటే. హస్తం పార్టీ వద్దు. కేసీఆర్ సర్కారే ముద్దు’ అంటూ నినాదాలు చేశారు.
‘రేవంత్రెడ్డి రైతు ద్రోహి.. కాంగ్రెస్ను పాతరేద్దాం’ అంటూ నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొని రైతాంగానికి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్కు ఓటేస్తే కటిక చీకట్లు అలుముకుంటాయని చెప్పారు. రైతు అనుకూల విధానాలు అనుసరిస్తున్న రైతుపక్షపాత బీఆర్ఎస్ సర్కారుకు అండగా నిలువాలని విజ్ఞప్తిచేశారు. సీఎం కేసీఆర్తోనే అన్నదాతకు మేలు జరుగుతందని పేర్కొన్నారు. ‘మూడు గంటల కాంగ్రెస్ను తరిమికొడదాం. మూడు పంటల బీఆర్ఎస్ సర్కారుకు అండగా నిలుద్దాం’ అంటూ పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్ వ్యతిరేక విధానాలపై తీర్మానాలు చేశారు.