Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబర్ 1 : అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆరు గ్యారెంటీల వైపల్య పోరుబాటను విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ సన్నద్ధులు కావాలని బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునిచ్చారు. కాల్వశ్రీరాంపూర్లో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పులువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతులను రాజుగా చేసేందుకు రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేస్తే, ఈ ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కి, రైతులను బానిసలుగా చూస్తుందని విమర్శించారు.
ప్రజల సమస్యలు పట్టని ఈ ప్రభుత్వం మాకొద్దంటూ నినాదాలు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఫించన్లు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఫించన్లు పెంచలేదన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వకుండా రైతులను నట్టేటముంచిన ఘనత కాంగ్రేస్ సర్కారుకే దక్కిందన్నారు. రైతు భరోసా రూ.15వేల ఇస్తామని చెప్పి, 12 వేలకు తగ్గించారని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల10 వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ప్రతీ ఒక్క కార్యకర్త తప్పని సరిగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, సర్పంచులు బూసి సదాశివరెడ్డి, తీగల నాగరాజు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆకుల స్వామి వివేక్ పటేల్, నాయకులు నిదానాపురం దేవయ్య, మాదాసి రామచంద్రo, పుప్పాల నాగార్జున్ రావు, గోనేశ్యాం, నరెడ్ల సదయ్య, నవీన్, రాజుకుమార్, శ్రీనివాస్ రెడ్డి, శంకర్, సారంగపాణి, సాంబారావు, గొడుగు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.