తెలంగాణ రెజ్లింగ్ సంఘం చైర్మన్ హఫీజ్ఖాన్
కొత్తపల్లి, జూలై 19 : ఒలింపిక్స్లో దేశ ఖ్యాతిని పెంచిన క్రీడ రెజ్లింగ్ అని, కొత్తగా ఏర్పడిన కొత్త జిల్లాల రెజ్లింగ్ సంఘం బాధ్యులు ఈ క్రీడాభివృద్ధికి కృషిచేయాలని తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ హఫీజ్ఖాన్ సూచించారు. కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేర్ పాఠశాలలో కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ల నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అసోసియేషన్ పరిశీలకులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర అసోసియేషన్ ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పడ్డ అన్ని జిల్లాలకు కార్యవర్గ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెజ్లింగ్లో కరీంనగర్ జిల్లా నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలో విజేతలుగా నిలిచిన ఘనత కరీంనగర్ రెజ్లర్లదన్నారు. ఎంతో మంది జాతీయస్థాయిలో పతకాలు సాధించినట్లు తెలిపారు. జిల్లా ఒలింపిక్ ప్యాట్రన్ కడారి అనంతరెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ కొత్త జిల్లా సంఘాల బాధ్యులు బాధ్యతాయుతంగా, ప్రణాళికాబద్ధంగా తమ అసోసియేషన్ కార్యకలాపాలను నిర్వహించాలని సూచించారు. జిల్లా క్రీడలు, యువజన అధికారి కీర్తి రాజవీరు మాట్లాడుతూ ఒలింపిక్స్లో భారత్కు వరుసగా పతకాలు అందిస్తున్న క్రీడ రెజ్లింగ్ అని, భారత రెజ్లర్ల స్ఫూర్తితో మన జిల్లాలో ప్రతిభావంతులు రెజ్లింగ్ క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొత్త జిల్లాలకు సంబంధించిన వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ రెజ్లింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీరే..
నాలుగు జిల్లాలకు కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. కరీంనగర్ జిల్లాకు అధ్యక్ష, కార్యదర్శులుగా తుమ్మల రమేశ్రెడ్డి, మహ్మద్ కరీం, పెద్దపల్లి జిల్లాకు మహ్మద్ రఫీ, ఎం వంశీ, రాజన్న సిరిసిల్ల జిల్లాకు అజ్మీర రాములునాయక్, బీ రవి, జగిత్యాల జిల్లాకు మహ్మద్ ఇక్బాల్, జి రవి ఎన్నికయ్యారు.