పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని దొంగల చేతుల్లో పెట్టవద్దని, విపక్షాలకు అధికారం ఇస్తే తెలంగాణ మరో 50 ఏళ్లు వెనక్కి పోతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి, బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు. తర్వాత తన నివాసంలో బీసీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సంతోషితోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు, ప్యారడైజ్ విద్యా సంస్థల అధినేత ఫాతిమారెడ్డి బీఆర్ఎస్లో చేరగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సీతారాంపూర్లో 20, 21వ డివిజన్లకు సంబంధించిన మహిళల ఆత్మీయ సమ్మేళనం, తర్వాత పద్మనగర్లో నిర్వహించిన కరీంనగర్ ఆటో డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
– కార్పొరేషన్, అక్టోబర్ 30
కార్పొరేషన్, అక్టోబర్ 30 : ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ర్టాన్ని దొంగల పాలు చేయొద్దని, విపక్షాలకు అధికారం ఇస్తే అభివృద్ధి ఆగిపోతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. స్థానిక సీతారాంపూర్లో 20, 21 డివిజన్ల మహిళల ఆత్మీయ సమ్మేళనానికి హాజరవగా, ఆయనకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ నుంచి మూడుసార్లు ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే గెలిచానని, మహిళల ఆశీర్వాదమే తమకు ఎంతో బలమని పేర్కొన్నారు. తమపై పెట్టుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అభివృద్ధి చేసి చూపించామన్నారు.
50 ఏళ్లుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కరీంనగర్ అభివృద్ధిలో ఏం మార్పులూ రాలేదని, 50 ఏళ్ల దరిద్రాన్ని, పదేళ్లల్లో జరిగిన అభివృద్ధిని గమనించాలని కోరారు. మహిళల ఓట్ల కోసం కాంగ్రెస్ ఆచరణ కాని హామీలను ఇస్తున్నదని, ఆచితూచి ఓటు వేయాలని సూచించారు. ఒక్క ఓటు తప్పు చేస్తే 50 ఏళ్లు వెనక్కి పోతామన్నారు. తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలంటే కేసీఆర్ చేతుల్లోనే ఉంచాలన్నారు. తెలంగాణను ఢిల్లీ చేతుల్లో పెడితే అరిగోస పడుతామన్నారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, మెడికల్ కళాశాలను తెచ్చుకున్నామని తెలిపారు.
విపక్షాలను నమ్మి ఓట్లు వేస్తే ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. మళ్లీ గెలిపిస్తే కాలనీల్లోని సమస్యలను తీర్చే బాధ్యతను తీసుకుంటామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఎంపీ ఇప్పటి వరకు ప్రజల వద్దకు రాలేదన్నారు. అలాంటి వారికి ఓటు వేసి వృథా చేసుకోవద్దని సూచించారు. అభివృద్ధి సాగిస్తున్న వారిని మరోసారి ఆశీర్వదించాలని, మహిళల అండదండలు అందించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్ జంగిలి సాగర్, భూమాగౌడ్, నాయకులు తుల బాలయ్య, శ్రీనివాస్ , మహిళలు పాల్గొన్నారు.