సిరిసిల్ల కలెక్టరేట్, ఫిబ్రవరి 28 : సిరిసిల్లలో ఆసాములు, కార్మికులు కదం తొక్కారు. తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్, ఆసాముల సమన్వయ కమిటీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ‘నేతన్నల ఆకలి కేక’ పేరిట బుధవారం నిర్వహించిన మహాధర్నాకు పెద్దసంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి, అంబేద్కర్ చౌక్ను దిగ్బంధించారు. గంటపాటు అక్కడే ధర్నా చేశారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమను సంక్షోభం నుంచి రక్షించాలని, తక్షణమే బతుకమ్మ చీరెలు, ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని, పెండింగ్ బకాయి లు, సబ్సిడీ నగదును అందించాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చెరుపల్లి సీతారాములు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్ బాబు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ సర్కారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రూ. కోట్ల విలువైన వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి, కార్మికులకు చేతినిండా పని కల్పించదని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి కూరుకు పోయిందని విమర్శించారు. టెస్కోకు 480 కోట్లు చెల్లించకపోవడమే కాకుండా జనవరిలో ఇవ్వాల్సిన బతుకమ్మ చీరెలు, ప్రభుత్వ రంగ సంస్థల ఆర్డర్లు ఇవ్వక పోవడంతో యజమాన్యం పరిశ్రమను మూసి వేసిందని చెప్పారు.
దీంతో పవర్లూం కార్మికులు, ఆసాములు, వైపని, వార్పిన్, గుమాస్తాలు, జాఫర్లు, అనుబంధ రంగాల కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని, జాతీయ టెక్స్టైల్ బోర్డును, ఇతర పథకాలను రద్దు చేసి కార్మికుల బతుకులపై ఉక్కుపాదం మోపిందని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గం పరిధిలో ఉన్న కార్మికుల సమస్యలపైన గానీ, టెక్స్టైల్ పార్కు అభివృద్ధి కోసం గానీ పార్లమెంటులో ఒక్కసారైనా నోరు మెదపకపోవడం సిగ్గు చేటన్నారు.
బీజేపీకి మత రాజకీయాలు తప్ప, ప్రజల ప్రయోజనం అవసరం లేదని విమర్శించారు. సాంచాల సంక్షోభ నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బతుకమ్మ చీరెలు, విద్యార్థుల యూనిఫాంలు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగాలకు సంబంధించిన ఇతర వస్ర్తాల ఉత్పత్తుల ఆర్డర్లు కార్మికులకు ఇప్పిస్తే 365 రోజులపాటు నిరంతరాయంగా ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే మన రాష్ట్రంలోని కార్మికుల ద్వారా ఉత్పత్తి చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, సీఐటీయూ సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఆసాముల సంఘం అధ్యక్షుడు సిరిసిల్ల రవి, కార్యదర్శి చేరాల అశోక్, సహాయ కార్యదర్శి మండల రాజు తదితరులు పాల్గొన్నారు.