హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం కన్నూరులో టీఆర్ఎస్ ధూం ధాం కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్కు ఓటు వేస్తే లాభమా.. బీజేపీకి ఓటు వేస్తే లాభమా.. అన్నది ప్రజలు ఆలోచించాలని కోరారు. ‘న్యాయం గెలవాలా.. అన్యాయం గెలవాలా, ధర్మం గెలవాలా.. అధర్మం గెలవాలా.. రైతులకు ఉచిత కరెంటు రైతులకు ఇవ్వాలని టీఆర్ఎస్ అంటోంది. బావుల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టాలని బీజేపీ అంటోంది. కేసీఆర్ సీఎం అయ్యాక కరెంటుకు ఇబ్బంది లేదు. ట్రాన్స్ఫార్మర్లు కాలడం లేదు. విత్తనాలకు కొరత లేదు. రైతు బంధు, రైతు బీమా వచ్చింది. కాళేశ్వరం నీరు కాలువల్లో పారుతోంది. అదే.. ఈటల చేరిన బీజేపీ మాత్రం మార్కెట్లు రద్దు చేస్తాం అంటోంది.. ఎరువుల ధర పెంచుతానంటోంది. డీజిల్ ధర వంద రూపాయలు దాటించింది. ఇలాంటి బీజేపీకి ఓటు వేద్దామా?’ అని ప్రశ్నించారు.
‘పువ్వు గుర్తుకు ఓటు వేయడమంటే.. పెంచిన డీజిల్ ధరకు మనం మద్దతు తెలపడమే. బీజేపీ నల్ల చట్టాలు తెచ్చిందని ఈటల రాజేందరే అన్నారు. జమ్మికుంట, వీణవంక మార్కెట్లను కేంద్రం మూయిస్తోంది. దాని మీద కొట్లాడతా అన్నారు. ఇప్పుడు ఏమైంది. నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీతో చేతులు కలిపారు. రైతుల మార్కెట్లు రద్దయినా ఫర్వాలేదా? అని సూటిగా ప్రశ్నించారు.
‘ఎరువుల ధరలు పెరిగినా ఫర్వాలేదు. డిజీల్ ధరలు పెరిగినా ఫర్వాలేదు. జనం ఏమైనా ఫర్వాలేదు అన్నట్లు ఈటల రాజేందర్ వ్యవహరిస్తున్నారు. ఈటలా..నీకు న్యాయం ఉందా? ధర్మం ఉందా? అదే ఉంటే రైతుల ఉసురు తీసే బీజేపీలో ఎందుకు చేరావో చెప్పు. రైతుల ఉసురు తీసే బీజేపీని బొంద పెట్టాలన్న రాజేందర్ ఎందుకు అందులో చేరాడో రైతులకు చెప్పాలి కదా’ అని ప్రశ్నించారు.