కరీంనగర్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా అమలు చేస్తున్న రైతు బీమా పథకంలో అర్హులు చేరేందుకు తాజాగా, మార్గదర్శకాలను జారీ చేసింది. 2018 నుంచి అమలవుతున్న ఈ పథకం కింద నాలుగేళ్ల కాలంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తం గా మరణించిన 1,945 రైతుల కుటుంబాలకు రూ.97.25 కోట్లు పంపిణీ చేశారు. కొత్తగా రైతు బంధులో చేరే వారికి ఈ నెల 14 నుంచి అమలులోకి వస్తుంది.
ఉచితంగా ప్రీమియం చెల్లింపు
కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రైతు అకాల మరణం చెందితే అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ రైతు బీమా పథకాన్ని తెచ్చింది. 2018 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 18 నుంచి 59 ఏండ్ల వయసు ఉన్న రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. రైతుల కోసం ఎల్ఐసీకి ప్రభుత్వమే ఉచితంగా ప్రీమియం చెల్లిస్తోంది. ఈ పథకంలో చేరిన రైతులు ఏ కారణం చేతనైనా మరణించినట్లయితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున బీమా వర్తించే లా ఈ పథకాన్ని రూపొందించారు. నాలుగేళ్లుగా అమలవుతున్న ఈ పథకంలో భాగంగా 2018లో మరణించిన 363 మందికి రూ.18.15 కోట్లు, 2019లో మరణించిన 471 మందికి రూ.23.55 కోట్లు, 2020లో మరిణించిన 731 మందికి 36.55 కోట్లు, 2021 మరణించిన 380 మందికి రూ.19.00 కోట్ల చొప్పున మొత్తం 1,945 మంది రైతుల కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.97.25 కోట్లు పంపిణీ చేశారు.
కొత్త వారికి ఈ నెల 14 నుంచి వర్తింపు
ఐదో ఏడాదిలో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన అర్హులైన రైతులు ఈ పథకంలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2022లో చేరుతున్న రైతులకు ఈ నెల 14 నుంచి ఈ పథకం వర్తిస్తుంది. అయితే, 18 నుంచి 59 ఏండ్లు ఉన్న అంటే 1963 నుంచి 2004 ఆగస్టు 14 వరకు జన్మించిన వారు మాత్రమే ఈ పథకంలో చేరేందుకు అర్హులు. జిల్లాలో ఇప్పటి వరకు రైతు బీమాలో ఉన్న 1,09,717 మంది రైతులు వారి ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు జరిగి ఉంటే ఈ నెల 22 వరకు వ్యవసాయ విస్తరణ అధికారులకు అందించాలి. స్వయంగా మార్పులు చేసుకోవాలని అనుకునేవారు కూడా ఈ అధికారులను సంప్రదించి చేసుకోవాలి. జిల్లాలో గతేడాది నుంచి అర్హులై బీమా పథకంలో చేరని 10,827 మంది, కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన 12,817 మంది రైతులు బీమా పథకంలో పొందాలంటే రైతు బీమా దరఖాస్తు ఫారంతోపాటు పట్టాదారు పాసు పుస్తకం, రైతు ఆధార్ కార్డ్ జిరాక్స్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ స్వయంగా సంబంధిత రైతే వచ్చి వ్యవసాయ అధికారులకు అందించాలి. రైతుకు బదులుగా మరొకరు వచ్చి దరఖాస్తు ఇచ్చినట్లయితే స్వీకరించబడదు. కొత్తగా బీమా పథకంలో నమోదు చేసుకునేందుకు ఆగస్టు 1 వరకే గడువు ఉంటుంది. ఈ తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరించరు.
అర్హులందరూ రైతు బీమాలో చేరండి
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన అర్హులందరూ బీమా పథకంలో చేరాలి. ప్రతి రైతుకు మా వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉంటారు. రైతు బీమా పథకంలో చేరిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఎల్ఐసీ సంస్థకు రైతుల పక్షాన ఉచితంగా ప్రీమియం చెల్లిస్తుంది. ఇంత మంచి అవకాశాన్ని 18-59 ఏండ్లు ఉన్న ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలి. ఇది రైతుకు ఎంతో మేలు చేకూర్చే పథకం.
– వాసిరెడ్డి శ్రీధర్, డీఏవో, కరీంనగర్