తిమ్మాపూర్, సెప్టెంబర్14: మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వంద మంది ముస్లిం మహిళలకు గురువారం ఆయన ఎల్ఎండీలోని క్యాంపు కార్యాలయంలో కుట్టుమిషన్లు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, ఏ పని చేసుకున్నా ముస్లింలు ఆత్మగౌరవంతో జీవిస్తారని, గత ప్రభుత్వాలు మైనార్టీలను విస్మరించాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే ముస్లింలను గుర్తించిందన్నారు. ముస్లింలకు షాదీముబారక్ పథకం ప్రవేశపెట్టడంతో పాటు రంజాన్కు దుస్తుల పంపిణీ, మసీదులకు మరమ్మతులు చేయించామని గుర్తు చేశారు. కుట్టుమిషన్లు రాజకీయాలు, ఓట్ల కోసం ఇవ్వడం లేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ముస్లింల కోసం ఏమీ చేయలేదని, చేయరని స్పష్టం చేశారు. ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా వంద మందికే కుట్టు మిషన్లు అందజేశామని, మరికొద్ది రోజుల్లో వెయ్యి మందికి అందజేస్తామన్నారు. నామమాత్రపు కంపెనీల యంత్రాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదని, ఉషా కంపెనీ బ్రాండ్ ఇస్తున్నామన్నారు.
గ్రామాల్లో కుట్టు పని చేసుకుంటూ ఉపాధి పొందుతూ ఆర్థిక ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు, నాయకులతో కలిసి గ్రామాల వారీగా మిషన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే రసమయి అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, ముస్లిం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటం
మాకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక చొరవతో సుమారు రూ.14 వేల విలువైన కుట్టుమిషన్ అందజేయడం ఆనందంగా ఉంది. నూతన యంత్రంతో ఇంట్లోనే పని చేసుకుంటూ ఉపాధి పొందుతా. నామమాత్రపు యంత్రం కాకుండా మంచి కంపెనీ యంత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-ఫాతిమా సుల్తానా, నుస్తులాపూర్
ఉపాధి పొందుతా
తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్ అందజేయడం ఆనందంగా ఉంది. కొత్త యంత్రంతో లేటెస్ట్ మోడల్స్ స్టిచింగ్ చేస్తూ ఉపాధి పొందుతా. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ముస్లింలను పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం.
-హదియా తయ్యబా, నుస్తులాపూర్