జ్యోతినగర్, మార్చి 14: ఎన్టీపీసీలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తి తుదిదశకు చేరువతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి యాజమాన్యం సన్నాహాలు చేపట్టింది. 800 మెగావాట్ల 1వ యూనిట్ పనుల పూర్తితో ఇటీవల నిర్వహించిన పలు కీలక విభాగాల ట్రయిల్ రన్ల సక్సెస్తో 1వ యూనిట్ను ఉత్పత్తి దశలోకి తీసుకురావడానికి అధికారులు లైటప్కు సిద్ధమయ్యారు. ఇటీవల కీలకమైన స్టీమ్ బ్లోయింగ్ పక్రియ ట్రయిల్ రన్ తాజాగా బాయిలర్ రిహీటర్ హైడ్రో టెస్ట్ కూడా సక్సెస్ కావడంతో యూనిట్ను లైటప్ చేయనున్నారు. లైటప్ పక్రియ సక్సెస్ అనంతరం టర్బైన్, జనరేటర్ల అనుసంధానం పక్రియతో విద్యుత్ను కమర్షియల్ ఆపరేషన్గా ప్రకటించనున్నారు. కాగా 1వ యూనిట్ను సోమవారం రాత్రి అధికారులు లైటప్ చేసినట్లు సమాచారం. ప్రయోగాత్మకంగా బాయిలర్ను మండించారు. మంగళవారం బాయిలర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో తాత్కాలికంగా యూనిట్ లైటప్ను నిలిపివేసినట్లు తెలిసింది. ఈ నెల 7న ప్రాజెక్టుకు చేసుకున్న బొగ్గు లింకేజీతో సింగరేణి నుంచి బొగ్గు దిగుమతి పక్రియ కూడా ప్రారంభమైంది. ఇక మరో 800 మెగావాట్ల రెండో యూనిట్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. నాలుగు, ఐదు నెలల్లో రెండో యూనిట్ను కూడా ఉత్పత్తి దశలోకి తీసుకురావడానికి అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు.
తెలంగాణ ప్రాజెక్టును సందర్శించిన డైరెక్టర్
ఎన్టీపీసీలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంగళవారం ఢిల్లీ నుంచి విచ్చేసిన ఎన్టీపీసీ ప్రాజెక్టు డైరెక్టర్ ఉజ్వల్ క్రాంతి భట్టాచార్య ప్రాజెక్టు సందర్శనతో ప్రాజెక్టు పురోగతిని తెలుసుకున్నారు. యూనిట్ 1, 2 బూడిద నిర్వహణ పురోగతిని సమీక్షించారు. సీహెచ్పీ కంట్రోల్ గది పరిశీలనతో యూనిట్ల కమిషనింగ్పై చర్చించారు. స్టీమ్ జనరేట్ను పరిశీలించారు. అనంతరం బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ ఉన్నతాధికారులతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష సమావేశంతో పనుల పురోగతిపై సమీక్ష చేసిన డైరెక్టర్ త్వరితగతిన ప్రాజెక్టును ఉత్పత్తి దశలోకి తీసుకురావాలన్నారు. అనంతరం టౌన్షిప్లోని వీఐపీ గెస్ట్ హౌజ్ ఆవరణలో మొక్క నాటారు. అంతకుముందు డైరెక్టర్కు ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేబాసిష్ చటోపాధ్యాయ, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఇక్కడ తెలంగాణ ప్రాజెక్టు సీజీఎం ప్రసెన్జింత్ పాల్, జీఎంలు పీకే లాడ్, అనిల్కుమార్, హరేరామ్ సింగ్, రవీంద్రపటేల్, మోహన్రెడ్డి, తదితరులు ఉన్నారు.