రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధికి అద్దం పట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను 2,90,396 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ పద్దులో సీఎం కేసీఆర్ మానవీయ కోణం ఆవిష్కృతమైంది. వ్యవసాయం, విద్య, వైద్యంతోపాటు అన్ని రంగాలకూ ప్రాధాన్యం దక్కింది. పేదలు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి చేకూరనున్నది. ఉమ్మడి జిల్లా పరంగా చూస్తే.. కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పేరిట 750కోట్లను ప్రతిపాదించడంతో మేడిగడ్డ నుంచి ఎగువమానేరు దాకా పర్యాటక శోభ సంతరించుకోనున్నది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణకు 350 కోట్లు, వరద కాలువ కింద పలు పనులు చేపట్టేందుకు 210 కోట్లు, కరీంనగర్ స్మార్ట్ సిటీకి 176 కోట్లు, వేములవాడ రాజన్న క్షేత్రం అభివృద్ధికి 50కోట్లు, కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లకు 20 కోట్లు, ఆర్ఎఫ్సీఎల్ నిర్వహణకు 10కోట్లు, కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్కు 8.25 కోట్లు కేటాయించింది. అలాగే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే నియోజకవర్గానికి 2వేల మందికి 3లక్షల చొప్పున సాయం అందనున్నది. దళితబంధు కింద హుజూరాబాద్ మినహా 12 నియోజకవర్గాల పరిధిలో మరో 13,200 మందికి ప్రయోజనం చేకూరనున్నది. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టును ఏర్పాటుతోపాటు కాంట్రాక్టు ఉద్యోగులను ఏప్రిల్ నుంచి క్రమబద్ధీకరిస్తామని తీపికబురు అందించింది. ఇలా సకల జనులందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ను తేవడంపై అన్ని వర్గాల్లోనూ హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన 2,90,396 కోట్ల బడ్జెట్ సకలజనుల సంక్షేమానికి అద్దం పట్టింది. ప్రతి అంశంలోనూ సీఎం కేసీఆర్ మానవీయ కోణం ఆవిష్కృతమైంది. ఇప్పటివరకు అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, చేనేత బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక సంక్షేమ పథకాలకు గతానికి మించి నిధులు కేటాయించడం కనిపించింది. ఇదే సమయంలో వ్యవసాయం, విద్య, వైద్యం, నీటిపారుదల వంటి అనేక అభివృద్ధి రంగాలకు ప్రాధాన్యం దక్కింది.
పల్లె, పట్టణ ప్రగతికి నిధులు కేటాయించడంతోపాటు, నేరుగా నిధులు ఇస్తామని మంత్రి చెప్పారు. అదనపు భారం పెరుగుతుందని తెలిసినా.. తాజాగా, మంజూరు చేసిన ఆసరా పింఛన్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో లోకల్ రిజర్వేషన్ను 95 శాతానికి పెంచడంతోపాటు కొత్త ఉద్యోగాల వేతనాలకు ఈ బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈహెచ్ఎస్ విధానం, ఏప్రిల్ ఒకటి నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సెర్ప్ ఉద్యోగుల పే స్కేల్ సవరణ ఇలా ఎన్నో ప్రకటించారు. కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పేరిట 750కోట్లు, కరీంనగర్ స్మార్ట్ సిటీకి 175 కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణకు 350 కోట్లు, వరద కాలువ కింద పలు పనులు చేపట్టేందుకు 210 కోట్లు, వేములవాడ రాజన్న క్షేత్రం అభివృద్ధికి 50కోట్లు, కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్కు 8.25 కోట్లు, కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లకు 20 కోట్లు, ఆర్ఎఫ్సీఎల్ నిర్వహణకు 10కోట్లు ఇలా ప్రత్యేకంగా కేటాయించారు. మొత్తంగా అన్ని వర్గాలకు సముచిత రీతిలో కేటాయింపులు జరగ్గా, బడ్జెట్పై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరం టూరిజం సర్క్యూట్కు 750 కోట్లు
ప్రాజెక్టుల రీడిజైన్ కింద కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేసి, మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రస్తుతం ఈ సర్క్యూట్ మొత్తాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు కాళేశ్వరం సర్క్యూట్గా పేర్కొంటున్నారు. తాజా, బడ్జెట్లో 750 కోట్లతో చేసిన ప్రతిపాదనలు ఉమ్మడి జిల్లాకు భారీగా లబ్ధి చేకూర్చనున్నాయి. లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతీ (అన్నారం), సుందిళ్ల (పార్వతీ), ఎల్లంపల్లి, గాయత్రీ పంప్హౌస్ (లక్ష్మీపూర్), శ్రీరాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు), అన్నపూర్ణ (అనంతగిరి)రిజర్వాయర్, ఎగువ మానేరు జలాశయం వరకు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఆస్కారముంటుంది.
కాళేశ్వరంతో అన్ని రిజర్వాయర్లలో 365 రోజులు నీళ్లుంచేందుకు అవకాశమున్నది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఎత్తిపోతల పనులన్నీ పూర్తవడమే కాదు, జలాశయాలన్నీ కాళేశ్వరం నీటితో కళకళలాడుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులతో గోదావరిలో దాదాపు 100 కిలోమీటర్ల పొడవునా నీళ్లు నిండుగా ఉంటున్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ప్రపంచ పర్యాటకులను సైతం ఆకట్టుకునే అవకాశాలున్నాయి. అలాగే శ్రీరాజరాజేశ్వర, అన్నపూర్ణ రిజర్వాయర్ల మధ్యన కొండలు ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు రిజర్వాయర్ల పరిసరాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి గతంలోనే పర్యాటక శాఖ 170 కోట్లతో అద్భుతమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. లోయర్ మానేరు డ్యాం దిగువన మానేరుపై తీగల వంతెన త్వరలోనే ప్రారభోత్సవం చేసుకోనున్నది. మరోవైపు రివర్ ఫ్రంట్ పనులు వేగంగా సాగుతున్నాయి. వీటితోపాటు ఎగువమానేరును పర్యాటకరంగంగా తీర్చిదిద్దడానికి చాలా అవకాశాలున్నాయి.
దళిత బంధు కింద 13,200 మందికి లబ్ధి
దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధు కింద ప్రతీ నియోజకవర్గానికి 1100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపి చేసి, ఒక్కో లబ్ధిదారుడికి 10 లక్షల చొప్పున లబ్ధి కల్పించేందుకు 12,980 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, పైలెట్ ప్రాజెక్టు హుజూరాబాద్లో దళితబంధు కింద దాదాపు అందరికీ లబ్ధి కల్పించారు. మిగిలిన పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాజాగా బడ్జెట్లో పేర్కొన్న దాని ప్రకారం చూస్తే కొత్తగా 13,200 మందికి లబ్ధి చేకూరనున్నది.
సొంత స్థలం ఉంటే సాయం
పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర సర్కారు, తాజాగా మరో తీపికబురు చెప్పింది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి 3 లక్షల చొప్పన ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముందుగా 2 వేల మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పింది. సీఎం కోటాలో మరో 26 వేల మందికి సాయం అందిస్తామని తెలిపింది. బడ్జెట్లో 7890 కోట్లు కేటాయించింది. ఆ లెక్కన ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 వేలకుపైగా మందికి లబ్ధి చేకూరే అవకాశమున్నది.
భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 1.61 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించి, అందులో 1.41 లక్షల పోస్టులను భర్తీ చేసింది. ఇవేకాకుండా గతేడాది మార్చి నుంచి కేటగిరీల్లో 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే గ్రూప్-1, 2, 3, 4 నోటిఫికేషన్లు పడ్డాయి. పోలీస్ శాఖలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. మిగిలిన ఉద్యోగాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు రానున్నాయి. లోకల్ రిజర్వేషన్ 95 శాతానికి పెంచడంతో పాటు, కొత్త ఉద్యోగాల వేతనాలకు ఈ బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించింది. దీంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
రాజన్న క్షేత్రానికి నిధులు శుభపరిణామం
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధి కోసం అనేక పనులు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వీటీడీఏకు 50 కోట్లు కేటాయించడం హర్షనీయం. రానున్న కాలంలో వేములవాడ క్షేత్రాన్ని దివ్యధామంగా నిలిపేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు ఈ కేటాయింపులు చూస్తే తెలుస్తున్నది. త్వరలో గుడిచెరువు పార్కింగ్ స్థలంలో పనులు ప్రారంభమవుతాయి.
– ముద్దసాని పురుషోత్తమరెడ్డి, వీటీడీఏ వైస్ చైర్మన్ (వేములవాడటౌన్)
తెరపైకి ఎంప్లాయీస్ ట్రస్ట్
క్రిటికల్ కేర్ పరిస్థితుల్లో సంబంధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా నిలిచేందుకు ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలంటూ కొన్నేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ సంఘాలు కోరుతూనే ఉన్నాయి. పలుమార్లు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నాయి. ఈ వినతులపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు తాజా బడ్జెట్లో మంత్రి హరీశ్రావు చెప్పారు. కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగానే ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ట్రస్టులో ప్రభుత్వ ప్రతినిధులతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తున్నదని, అందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని, దీనిద్వారా కొన్ని క్రిటికల్ పరిస్థితులు ఎదుర్కొనే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు న్యాయం జరుగుతుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు.
ప్రారంభం కానున్న కరీంనగర్, సిరిసిల్ల మెడికల్ కాలేజీలు
ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు, వైద్య సేవలను మరింత చేరువ చేస్తున్నది. అందులో భాగంగా కోట్లాది రూపాయలతో దవాఖానలను బలోపేతం చేస్తున్నది. మరోవైపు జిల్లాకో మెడికల్ కాలేజీని ప్రారంభిస్తున్నది. ఇప్పటికే జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ప్రారంభించింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఈ యేడాది నుంచే ప్రారంభిస్తామని మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అందుకోసం అన్ని రకాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అలాగే జిల్లాకో నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నాలుగు జిల్లాల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీలు పూర్తయి అందుబాటులోకి వస్తే, పేద, మధ్య తరగతి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందే అవకాశముంటుంది.
నెరవేరుతున్న ఉద్యోగుల కల
నగదు రహిత కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వోద్యోగులు పొందాలనేది ప్రతి ఉద్యోగి కల. ఈ బడ్జెట్తో ఉద్యోగుల కల నెరవేరనుంది. ఉద్యోగుల ఆరోగ్యభద్రతకు పెద్దపీట వేస్తూ హెల్త్కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్రావు ప్రకటించడం సంతోషకరం. ఇప్పుడు సీఎం కేసీఆర్ సహకారంతో ఆచరణలోకి తేవడం హర్షణీయం. ఉద్యోగుల వైద్యానికి సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తామని ప్రకటించారు. విధి విదానాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పడం అభినందనీయం. ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఒక శాతం చందాతో ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) అమలు చేయాలని ఎప్పటినుంచి కోరుతుండగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఉద్యోగులుగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆపదలో ఉన్న ఎంప్లాయీస్కు ఈ ట్రస్ట్ ద్వారా భరోసా లభిస్తుంది.
– మారం జగదీశ్వర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు
వ్యవసాయానికే అగ్రభాగం
స్వయంగా రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే బడ్జెట్లో వ్యవసాయరంగానికి సీఎం కేసీఆర్ అగ్రభాగం కేటాయించారు. దాదాపుగా రూ.26,831 కోట్లు కేటాయించి మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారు. రాష్ట్రం వచ్చిన నాటి నుంచే రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పుడు రైతును లాభదాయక పంటలవైపు మళ్లించేందుకు చేపడుతున్న ఆయిల్పాం సాగుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. ఒక రైతు సీఎం అయితే ప్రగతి ఎలా ఉంటుందో కేసీఆర్ పాలన చూస్తే అవగతమవుతున్నది. పంటకు పెట్టుబడి సాయం, రైతు బంధు, అనుకోని పరిస్థితుల్లో రైతు మృతిచెందితే కుటుంబాలు రోడ్డున పడకుండా రైతు బీమా ఇస్తున్నరు. బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్ద పీట వేసిన సీఎం కేసీఆర్కు రైతు బంధుపక్షాన, రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు.
– గడ్డం నర్సయ్య, ఆర్బీఎస్ అధ్యక్షుడు (రాజన్న సిరిసిల్ల జిల్లా)
కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు
కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో కాంతిరేఖ లాంటిది ఈ బడ్జెట్. అన్ని వర్గాల వారికి మేలు చేస్తుందన్న నమ్మకం ఏర్పడింది. వ్యవసాయం, నీటిపారుదల, విద్య రంగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా విద్యా రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. మన ఊరు- మన బడి కింద ప్రత్యేకంగా నిధులివ్వడం సంతోషించదగ్గ విషయం. ఉద్యోగుల మేలు కోసం నిధులు కేటాయించడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. రెండు దశాబ్దాలుగా కాంట్రాక్టు లెక్చరర్లుగా, కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారందరికి ఈ బడ్జెట్ ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగులందరిని వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుండి రెగ్యులర్ చేస్తామనడం గొప్ప విషయం.
– శ్రీనివాస్, మ్యాథ్స్ కాంట్రాక్ట్ లెక్చరర్ (మల్యాల)
ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్..
అసెంబ్లీలో సోమవారం మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆమోదాన్ని పొందుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈహెచ్ఎస్ విధానాన్ని తెస్తున్నట్లు ప్రకటించడం సంతోషాన్ని ఇచ్చింది. దీని వల్ల ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య పరీక్షలు, వైద్యం తదితర అంశాల్లో సరళత వస్తుంది. అలాగే భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. ప్రభుత్వం ఉద్యోగుల స్నేహశీలిగా వ్యవహరిస్తుండడం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్
– ఆనందరావు, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి (జగిత్యాల)
వీ ఫైవ్కు కేటాయింపులు సూపర్
బడ్జెట్ సూపర్గా ఉంది. ముఖ్యంగా మౌలిక రంగాలుగా గుర్తింపు పొందిన విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయం, వీకర్స్ సెక్టార్లను వీ ఫైవ్గా చెప్పుకోవచ్చు. ఈ వర్గాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపులు అద్భుతమని చెప్పాల్సిందే. దాదాపు లక్షన్నర కోట్ల కేటాయింపులు ఉన్నాయి. ఇవి అమలైతే మౌలిక రంగాలు పురోగమిస్తాయి. విద్యారంగంతోపాటు విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు భారీ కేటాయింపులతో త్వరలోనే కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఐదు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే మన రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఎక్కువ ప్రయోజనకారిగా కనిపిస్తుంది.
– కొత్తూరి మణి కృష్ణ, ఎంఏ ఫైనలియర్ విద్యార్థి (ఉస్మానియా విశ్వవిద్యాలయం)
పర్యాటకంగా అభివృద్ధి
కాళేశ్వరం ప్రాజెక్టుతో పెద్దపల్లి జిల్లా వాటర్ హబ్లా మారింది. గోదావరి తీరం నిండుకుండలా కనిపిస్తున్నది. దేశం అబ్బురపడేలా ప్రాజెక్టు నిర్మించి దిగువకు వెళ్లే నీటిని ఎదురెక్కించేలా ప్రాజెక్టును నిర్మించడం ఒకెత్తయితే, ఇప్పుడు టూరిస్టు స్పాట్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించడం శుభపరిణామం. గోదావరి తీరంలో ప్రతిపాదించిన కాళేశ్వరం సర్క్యూట్తో గొప్ప ప్రయోజనం కలుగనున్నది. ప్రత్యక్షంగా.. పరోక్షంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇది గొప్ప పరిణామం. – ఉప్పు రాజ్కుమార్, పెద్దపల్లి
పేదింటి తల్లిదండ్రులకు ఊరట..
ప్రభుత్వం పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి ఇచ్చే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. ఇది చాలా గొప్ప పథకం. మాలాంటి కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతుంది. నేను ఇదివరకే మా కూతురు పెండ్లికి కల్యాణ లక్ష్మి డబ్బులు తీసుకున్న. ఎంతో ఆసరైనయి. నాలా ఎంతో మందికి ఆసరవుతయి. గత ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఒక్కటి కూడా పెట్టలేదు. తెలంగాణ ప్రభుత్వంలోనే మేలు జరుగుతుంది. ఇంత గొప్ప స్కీంలు అమలు చేస్తున్న కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటం.
– చాటకోళ్ల స్వామి, రాఘవాపూర్ (పెద్దపల్లి మండలం)
పర్యాటకంగా మరింత అభివృద్ధి..
కార్మికక్షేత్రమైన సిరిసిల్ల మంత్రి కేటీఆర్ చొరవతో ఎంతగానో అభివృద్ధి సాధించింది. సిరిసిల్ల – వేములవాడలు కార్మిక, ధార్మికక్షేత్రాలుగా పిలుస్తారు. ఈ బడ్జెట్లో కాళేశ్వరం టూరిస్టు సర్క్యూట్ను ఏర్పాటుకు నిధులు కేటాయించడం హర్షణీయం. ఈ సర్క్యూట్తో ప్రాజెక్టుల వద్ద పర్యాటకంగా అభివృద్ధి అయితది. రామప్పను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నరు. రామప్ప పరిసరాలు ఇప్పటికే మిడ్మానేరు బ్యాక్ వాటర్తో కళకళలాడుతున్నాయి. ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దితే మరింత అభివృద్ధి జరుగుతుంది. వేములవాడకు వచ్చే ఇతర రాష్ర్టాల భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. వేలాదిమంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది. రామప్పను పర్యాటకంగా చేస్తే సిరిసిల్ల, వేములవాడ పట్టణాల అభివృద్ధి కూడా జరుగుతుంది.
– బోడ ప్రవీణ్, సర్దార్నగర్ (సిరిసిల్ల)
తెలంగాణలోనే ఉద్యోగుల సంక్షేమం
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తించవు. ఉద్యోగుల పక్షపాతిగా ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ఉద్యోగులకు సైతం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నారు. రైతుబంధుతో పాటు రైతు బీమా, దళితబంధు పథకాలను వర్తింపజేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం అభినందనీయం. చిరుద్యోగాలు చేసే వారికి ఈ పథకాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. అత్యధిక మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉండటం ఉద్యోగులుగా గర్వపడుతున్నాం. అలాగే, ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించడం హర్షనీయం.
-దారం శ్రీనివాస్రెడ్డి ,టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి (కరీంనగర్)
న్యాయవాదుల సంక్షేమ ప్రభుత్వం
న్యాయవాదులకు సంక్షేమాన్ని గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేసీఆర్ సర్కారు గతంలోనే రూ. 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసింది. దీని ద్వారా అనేక మంది వివిధ కారణాలతో అనారోగ్యాల పాలవుతున్న, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అనేక మంది లాయర్లను ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నది. న్యాయవాదుల అభ్యున్నతి కోసం ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించడం అభినందనీయం.
– పూరెళ్ల రాములు, న్యాయవాది(కరీంనగర్)
సీఎం కేసీఆర్ సార్కు రుణపడుతం..
రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేసేందుకు నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. ఈ డబ్బులతో మిగిలిన పావలా వంతు రుణం కూడా మాఫీ అయితది. సీఎం కేసీఆర్ సార్ గత ఎన్నికల సమయంలో లక్ష రూపాయల దాకా రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిండు. విడుతల వారీగా మాఫీ చేస్తూ వస్తుండు. ఇప్పటికే 75వేల దాకా మాఫీ చేసిండు. సీఎం కేసీఆర్ మా రైతుల కోసం అనేక మంచి పనులు చేసిండు. ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా ఇస్తండు. రైతులకు ఇంత కంటే సౌలత్ చేసే సర్కారు మరొకటి లేదు. సీఎం కేసీఆర్ సార్కు రుణపడుతం.
– బాసనపెల్లి శ్రీనివాస్, రైతు (ఇబ్రహీంపట్నం)
పల్లెల అభివృద్ధికి పెద్దపీట
ప్రభుత్వం బడ్జెట్లో పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఇందుకు భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటికే పల్లె ప్రగతి కింద నిర్మించిన డంప్యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, ప్రకృతివనాలు. పంచాయతీ భవనాలతో గ్రామాల రూపురేఖలు మారాయి. ఈ బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులు కేటాయించడంతో మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉంటది.
– జక్కం నర్సయ్య, సర్పంచ్, ముగ్దుంపూర్ (కరీంనగర్ రూరల్)
రైతులకు అనువైనది..
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి రైతుల కోసం అనేక పథకాలను అమల్లోకి తెచ్చిన్రు. ఈ బడ్జెట్లోనూ వ్యవసాయానికి పెద్దమొత్తంలో నిధులు కేటాయించిన్రు. రైతుబంధు, రైతుబీమా. ఉచిత కరెంట్ ఇస్తూనే ఇపుడు రుణమాఫీకి కూడా పెద్దమొత్తంలో నిధులు కేటాయిండం సంతోషంగా ఉన్నది. మొత్తంగా ఇది రైతులకు అనువైన బడ్జెట్.
– మెనుకుల తిరుపతి, రైతు, షానగర్ (రామడుగు)
వైద్యరంగానికి పెద్దపీట
ప్రస్తుత బడ్జెట్లో వైద్యం, ఆరోగ్యానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఇప్పటికే సర్కారు దవాఖానలన్నీ కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందిస్తున్నాయి. సేవలు మెరుగుపడ్డాయి. మందుల సరఫరాలో ఎక్కడా లోటు లేకుండా చేస్తున్నారు. గతంలో సర్కారు దవాఖానల్లో పూర్తిగా తగ్గిపోయిన ప్రసవాల సంఖ్య ప్రభుత్వ చొరవ, నిధుల కేటాయింపు, సౌకర్యాల కల్పనతో 70శాతానికి పెరిగింది. ఈ తాజా కేటాయింపులతో మరింత వృద్ధి సాధ్యమవుతుంది.
– ఆకుల స్వామి వివేక్పటేల్, జేఎన్టీయూహెచ్ జేఏసీ మాజీ అధ్యక్షుడు పెద్దపల్లి